ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు, నిమిషాల్లో దూసుకొచ్చిన రాయల్ ఫైటర్ జెట్స్..

ఫొటో సోర్స్, PA Media
- రచయిత, మాట్ ప్రెసీ
- హోదా, బీబీసీ న్యూస్, నార్ఫోక్
భారత్కు చెందిన ఓ ప్రయాణికుల విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో బ్రిటన్కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) ఫైటర్ జెట్లు రంగంలోకి దిగాయి.
ఆర్ఏఎఫ్ టైఫూన్ జెట్లు చేరుకునే సమయానికి ఎయిర్ ఇండియా విమానం నార్ఫోక్ మీదుగా ఆకాశంలో చక్కర్లు కొడుతోంది.
సురక్షితమని తెలిసిన తర్వాత బోయింగ్ 777-300 విమానం ప్రయాణం కొనసాగించడానికి అనుమతించామని ఆర్ఏఎఫ్ ప్రతినిధి తెలిపారు.
విమానానికి గురువారం బాంబు బెదిరింపు వచ్చిందని ఎయిర్ ఇండియా ధ్రువీకరించింది. విమానం హీత్రూ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులు, సిబ్బంది అందరూ విమానం దిగారని తెలిపింది.
అయితే, బాంబు బెదిరింపుపై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు విమాన సిబ్బంది తెలియజేసిన విషయాన్ని ఒక డచ్ ప్లేన్ స్పాటర్ (నెదర్లాండ్స్కు చెందిన ఈ వ్యక్తి విమానాలను గమనించి రికార్డ్ చేస్తుంటారు) రికార్డ్ చేశారు.
"విమానంలో బాంబు ఉన్నట్లు అనుమానంగా ఉంది, ప్రయారిటీ ల్యాండింగ్ కోరుతున్నాం" అని గ్రౌండ్ కంట్రోలర్స్తో విమానం కెప్టెన్ అంటున్నట్లు ఆ ఆడియోలో ఉంది.
ఆ తర్వాత ‘మాకు బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్ ఇండియా-129 ల్యాండింగ్కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం’ అని చెప్పారు కెప్టెన్.
స్పాటర్ సోషల్ మీడియా ‘ఎక్స్’ అకౌంట్ @EHEH_spotter పేరుతో ఉంది. స్కానర్ని ఉపయోగించి కెప్టెన్ ఆడియోను రికార్డ్ చేసినట్లు ఈ నెదర్లాండ్స్ వాసి బీబీసీతో చెప్పారు. ఆర్ఏఎఫ్ జెట్లు విమానం వద్దకు వెళుతుండగా నార్ఫోక్ అంతటా పెద్ద శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన్నామని నార్ఫోక్లోని పలువురు బీబీసీ రేడియో శ్రోతలు చెప్పారు.
"వీసెన్హామ్లో భూమి కదిలింది, నాకు భయమేసింది" అని క్రిస్ అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా తెలియజేశారు.
"నేను కావ్స్టన్లో విన్నాను. తలుపులు, కిటికీలు కదిలి చప్పుడు చేశాయి. పక్కింటి వర్క్ షాపులోకి ట్రక్కు దూసుకుపోయిందనుకున్నా" అని గ్యారీ అనే వ్యక్తి మెసేజ్ చేశారు.

ఫొటో సోర్స్, ADS-B Exchange
12 బాంబు బెదిరింపులు
ఫ్లైట్రాడార్ 24 ప్రకారం.. ఎయిర్ ఇండియా విమానం ఆ సమయంలో ఉత్తర సముద్రం మీదుగా ఎగురుతోంది, తర్వాత దిశను మార్చుకుంది. నార్ఫోక్, సఫోల్క్ గగనతలంలో చక్కర్లు కొట్టింది.
"ముంబయి నుంచి లండన్కు వెళుతున్న ఎయిరిండియా ఫ్లైట్ ఏఐ129కి ఈరోజు సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు వచ్చింది. హీత్రూ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది, ప్రయాణికులు, సిబ్బంది అందరూ దిగారు. వారి రక్షణ, భద్రతే మాకు ముఖ్యం. ఈ ఊహించని పరిస్థితిలో మాకు సాయంగా నిలిచిన స్థానిక అధికారులకు కృతజ్ఞతలు" అని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.
సోమవారం నుంచి 12కి పైగా భారత విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇది విమానాల ఆలస్యంతో పాటు, అవి వెళ్లే మార్గం మార్పులకు దారితీసింది.
బుధవారం బెంగళూరుకు వెళ్లాల్సిన ఎయిర్ ఆకాస విమానాన్ని ఇలాగే బెదిరింపుల కారణంగా దిల్లీకి దారి మళ్లించారు.
ఈ ఘటనలు పలు ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలపై ప్రభావం చూపించాయి. ఈ బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు, వారిని బాధ్యులను చేసేందుకు అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
'మధ్యాహ్నం ప్రయాణికుల విమానానికి బెదిరింపు రావడంతో తనిఖీ చేయడానికి ఆర్ఏఎఫ్ కోనింగ్స్బై నుంచి టైఫూన్ ఫైటర్ జెట్లు వెళ్లాయి' అని ఆర్ఏఎఫ్ ప్రతినిధి ఒకరు స్పష్టంచేశారు. సురక్షితమని తెలిసిన తర్వాత గమ్యస్థానానికి బయలుదేరిందని చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














