డ్రాగన్ క్యాప్సూల్: సునీతా విలియమ్స్, విల్మోర్లను భూమికి తెచ్చేందుకు వెళ్లిన నౌక

ఫొటో సోర్స్, NASA
- రచయిత, లారెన్స్ పీటర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఈ ఏడాది జూన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో పని చేయడానికి వెళ్లి అక్కడే ఉండిపోవాల్సి వచ్చిన ఇద్దరు వ్యోమగాములు సునీత విలియమ్స్, బారీ బుచ్ విల్మోర్లను భూమి మీదకు తీసుకొచ్చేందుకు స్పేస్ఎక్స్ తన మిషన్ను పంపింది.
డ్రాగన్ క్యాప్సూల్ అనే వ్యోమనౌక, సునీత విలియమ్స్, బారీ బుచ్ విల్మోర్ల కోసం రెండు ఖాళీ సీట్లతో ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి శనివారం నింగిలోకి ఎగిసింది.
8 రోజుల మిషన్ కోసం ఐఎస్ఎస్కు వెళ్లిన సునీత విలియమ్స్, బారీ బుచ్ విల్మోర్ తిరిగి వచ్చేందుకు సరైన వాహనం లేకపోవడంతో అక్కడే ఉండిపోయారు.

బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్లైనర్ అనే వ్యోమనౌకలో సునీతా, విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.
అయితే, ఈ వ్యౌమనౌక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు చేరుకోవడానికి ముందే అందులోని ప్రొపల్షన్ సిస్టమ్లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడం లాంటి సమస్యలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ, వారు అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగానే చేరుకున్నారు.
అయితే, అదే వాహనంలో వారిని కిందికి తీసుకురావడం ప్రమాదమని భావించడంతో వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వారిని తీసుకెళ్లిన స్టార్లైనర్ వ్యోమనౌక ఖాళీగా కిందకి వచ్చింది.
నాసా వ్యోమగామి నిక్ హేగ్, రష్యాకు చెందిన కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్లు సునీత విలియమ్స్, బారీ బుచ్ విల్మోర్లకు అవసరమైన సరుకులతో ఆకాశంలోకి వెళ్లారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీతా, విల్మోర్లను తిరిగి భూమి మీదకు తీసుకురావాలని భావిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, EPA
గురువారం నాడు డ్రాగన్ క్యాప్సూల్ నింగిలోకి ఎగరాల్సి ఉంది. కానీ హరికేన్ హెలెన్ వల్ల కాస్త ఆలస్యమైంది.
బిలియనీర్ ఎలాన్ మస్క్ ఏర్పాటు చేసిన స్పేస్ఎక్స్ కంపెనీ..ప్రతి ఆరు నెలలకు ఒకసారి అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి, భూమి నుంచి అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను తీసుకెళ్తుంటుంది.
ఆదివారం రాత్రి 9.30 (GMT) గంటలకు డ్రాగన్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకుంటుంది.
రష్యన్ ప్రభుత్వ స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మాస్, నాసా మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం అంతరిక్ష కేంద్రానికి వెళ్లే ప్రతి మూడు సీట్ల రష్యన్ సోయుజ్ స్పేస్క్రాఫ్ట్లో ఒక నాసా వ్యోమగామి ఉంటారు. అలాగే, ప్రతి నాలుగు సీట్ల డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్లో ఒక రష్యన్ వ్యోమగామి వెళ్తారు.
నేవీ హెలికాప్టర్ పైలట్గా పనిచేసి రిటైర్ అయిన సునీత విలియమ్స్ అంతర్డాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం ఇది మూడోసారి.
అలాగే ఫైటర్ జెట్ పైలట్గా పనిచేసిన విల్మోర్ కూడా గతంలో రెండు సార్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు.
“మేం ఇక్కడ చాలా బిజీగా ఉన్నాం. సిబ్బందితో కలిసిపోయాం” అని ఇటీవల అంతరిక్షం నుంచి జరిపిన సంభాషణలో విలియమ్స్ అన్నారు.
‘‘మాకు ఇంటి దగ్గర ఉన్నట్టుగానే ఉంది. అటూ, ఇటూ ఇలా తేలుతూ ఉంటే చాలా బాగుంది. అంతరిక్షంలో గడపడం ఓ అద్భుతం’’ అని వారు అన్నారు.

ఫొటో సోర్స్, AFP
అంతకుముందు కూడా అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములు
గతంలో కూడా వ్యోమగాములు అంతరిక్షంలో నిర్దేశించిన సమయంకంటే ఎక్కువ రోజులు ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది.
1990లో రష్యన్ వ్యోమగామి వలెరీ పులికోవ్ 437 రోజులపాటు మిర్ స్పేస్ స్టేషన్లో గడిపారు.
గత ఏడాది ఫ్రాంక్ రుబియో 371 రోజులు ఐఎస్ఎస్ లో ఉండి వచ్చారు. అత్యధిక రోజులు అంతరిక్షంలో గడిపిన అమెరికన్ వ్యోమగామి ఆయనే.
తాము అనుకోకుండా అంతరిక్షంలో ఇన్ని రోజులు ఉండాల్సి రావడం చాలా బాగుందని సునీత విలియమ్స్, విల్మోర్లు అంతరిక్షం నుంచి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
అదనంగా కొన్ని వారాలు ఇక్కడ ఉండాల్సి వచ్చినందుకు మాకు వచ్చిన ఇబ్బందేమీ లేదని వారు అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














