అనుర కుమార దిసనాయకే: శ్రీలంక కొత్త అధ్యక్షుడు భారత్ వ్యతిరేక, చైనా అనుకూల వైఖరి అనుసరిస్తారా?

ఫొటో సోర్స్, DrSJaiShankar/Instagram
- రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అనుర కుమార దిసనాయకే... వామపక్ష భావాలున్న ఒక నాయకుడు శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇదే తొలిసారి.
అనుర కుమార దిసనాయకే, జనతా విముక్తి పెరమునె (జేవీపీ) పార్టీకి చెందినవారు. లోతైన వామపక్ష భావజాలం కలిగిన పార్టీగా జేవీపీ పేరుగాంచింది.
ఎక్కువగా మధ్యేవాద, మితవాద నాయకులే పాలిస్తున్న శ్రీలంకను ఇప్పుడు ఒక వామపక్ష నాయకుడు పాలించనుండటం అక్కడి రాజకీయల్లో వచ్చిన చెప్పుకోదగిన మార్పు.
జేవీపీకి ఉన్న భారత వ్యతిరేక వైఖరి.. వామపక్ష ధోరణి కారణంగా దిసనాయకే ప్రభుత్వం ఇప్పుడు శ్రీలంకను చైనాకు చేరువ చేసి, భారత్కు దూరం చేస్తుందా? అనేది చాలామందికి కలుగుతున్న ప్రశ్న.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 38 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి శ్రీలంక చరిత్రలో తొలిసారి ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వచ్చింది.
దిసనాయకే, పొరుగు దేశాలైన చైనా, భారత్లతో ఎలా వ్యవహరిస్తారనేది కీలకంగా మారనుంది.


ఫొటో సోర్స్, Getty Images
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
జేవీపీ భారత వ్యతిరేక వైఖరి
జనతా విముక్తి పెరమునెకి భారతదేశంపై అనుకూల దృక్పథం లేదు. ముఖ్యంగా 1980లలో, శ్రీలంక వ్యవహారాల్లో భారతదేశ ప్రమేయాన్ని ఆ పార్టీ తీవ్రంగా విమర్శించింది.
శ్రీలంక అంతర్యుద్ధం సమయంలో తమిళ వేర్పాటువాద ఉద్యమాలకు మద్దతు ఇవ్వడంలో భారత్ పాత్ర వారికి నచ్చలేదు.
శ్రీలంక విషయంలో భారత్ ఆధిపత్య వైఖరిని ప్రదర్శించిందని జేవీపీ ఆరోపించింది.
వామపక్ష ధోరణి కారణంగా దిసనాయకే సహజంగా భారత్ కంటే చైనా వైపు ఎక్కువ మొగ్గు చూపుతారనేది సాధారణ భావన.
శ్రీలంక పట్ల భారత్ అనుసరిస్తున్న విధానాన్ని కూడా జనతా విముక్తి పెరమునె చాలా కాలం విమర్శించింది.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి దశలో సెప్టెంబర్ 16న జరిగిన రాజకీయ చర్చా కార్యక్రమంలో భారత్పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే శ్రీలంకలో అదానీ గ్రూపు పెట్టుబడులున్న పవన విద్యుత్ ప్రాజెక్టును రద్దు చేస్తానని ఆయన అన్నారు.
శ్రీలంక సార్వభౌమత్వానికి ఈ ప్రాజెక్ట్ విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాలన్నీ అనుర కుమార దిసనాయకేపై భారత్కు వ్యతిరేకి అనే ముద్ర వేశాయి.
భారత్ వైఖరి ఏమిటి
భారత్పై జేవీపీకి వ్యతిరేక వైఖరి ఉన్నప్పటికీ, ‘దిసనాయకే’ను భారత విధానకర్తలు దూరం పెట్టలేదు.
ఈ అంశంపై లయోలా కాలేజీకి చెందిన అంతర్జాతీయ సంబంధాల నిపుణుడు, ప్రొఫెసర్ గ్లాడ్స్టన్ జేవియర్తో బీబీసీ మాట్లాడింది.
‘‘భారత్ కొంతకాలం నుంచి దిసనాయకేతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ ఏడాది ఆరంభంలో ఆయనను భారత్కు ఆహ్వానించింది. భారత్లోని కీలక నాయకులతో ఆయన సమావేశమయ్యారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడితో సంబంధాలు కొనసాగించడానికి భారత్ ఆసక్తితో ఉందని దీన్నిబట్టి అర్థం అవుతోంది. తమ పొరుగు దేశాల్లో జరిగే పరిణామాల గురించి భారత్ ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటుంది’’ అని ప్రొఫెసర్ జేవియర్ అన్నారు.
‘‘భారత ప్రభుత్వం ఫిబ్రవరిలో దిసనాయకేను దిల్లీకి ఆహ్వానించింది. ఆయన అప్పుడు పంజాబ్లో కూడా పర్యటించారు. చాలామంది ప్రముఖ నేతలను కలిశారు. భారత్ పట్ల జేవీపీకి ఉన్న చారిత్రక వైఖరి గురించి వారికి స్పష్టంగా తెలుసు. అయితే, 1980ల నాటి జేవీపీ ఇప్పటి జేవీపీ ఒకేలా లేదనే సంగతి భారత ప్రభుత్వానికి బాగా తెలుసు’’ అని జేవియర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత రాయబారి అభినందనలు
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల విషయంలో భారత్ మొదటి నుంచి అప్రమత్తంగానే ఉంది.
అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి, ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు శ్రీలంకలోని భారత రాయబారి సంతోష్ ఝా మాట్లాడుతూ.. ‘‘మేం ఏ అభ్యర్థికీ మద్దతు ఇవ్వడం లేదు. ఎవరు గెలిచినా కొత్త అధ్యక్షుడితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని అన్నారు.
సంతోష్ ఝా ఆదివారం దిసనాయకేను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
దిసనాయకేను సంతోష్ ఝా వ్యక్తిగతంగా కలవడం అనేది శ్రీలంక కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనే భారత ప్రభుత్వ ఉద్దేశాన్ని చాటుతోంది.
ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దిసనాయకేకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అదానీ పవన విద్యుత్ ప్రాజెక్ట్ వివాదం
దిసనాయకే, భారత్ల మధ్య కీలక వివాదాంశం శ్రీలంకలోని అదానీ పవన విద్యుత్ ప్రాజెక్ట్. 2023 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టును ఆమోదించారు.
తన ఎన్నికల ప్రచార సభల్లో దిసనాయకే ఈ ప్రాజెక్టును ప్రస్తావించారు.
శ్రీలంక సార్వభౌమత్వానికి ఈ ప్రాజెక్ట్ విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్కు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఈ ప్రాజెక్టులో 442 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,700 కోట్లు) పెట్టుబడి పెడుతోంది. మన్నార్, పూనగారిలో విండ్ ఫార్మ్స్ను అభివృద్ధి చేస్తోంది.
పర్యావరణం, విద్యుత్ అధిక ధరల కారణంగా అనేక వర్గాల నుంచి ఈ ప్రాజెక్టుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇప్పుడు దిసనాయకే కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడంతో ఆయన భారత వ్యతిరేక వైఖరిని అనుసరించే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.
‘‘అదానీ ప్రాజెక్టు విషయానికొస్తే అదొక వివాదాస్పద అంశం. జేవీపీ మాత్రమే కాకుండా పర్యావరణ బృందాలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా దీనిపై ఆందోళనల వ్యక్తంచేశాయి. కాబట్టి ఈ విషయంలో దిసనాయకే వ్యతిరేకతను మొత్తంగా భారత వ్యతిరేక వైఖరిగా చూడకూడదు. మోదీ, అదానీలు ఈ ప్రాజెక్టును పునఃపరిశీలించాలి’’ అని కొలంబో యూనివర్సిటీ ఎమెరిటస్ ప్రొఫెసర్ జయదేవ ఉయాంగోడ అన్నారు.
ఈ అంశంపై జాఫ్నా యూనివర్సిటీకి చెందిన అహిలాన్ కదిర్గామర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

శ్రీలంక ఆర్థిక సంక్షోభం, విదేశీ విధానాలు
దిసనాయకే విదేశాంగ విధాన నిర్ణయాలను ప్రభావితం చేసే మరో కీలక అంశం శ్రీలంక ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, విదేశీ నిల్వలు అడుగంటడం, అంతర్జాతీయ రుణదాతల వద్ద భారీగా తీసుకున్న అప్పుల కారణంగా శ్రీలంకకు ఇప్పుడు వీలైనంత సహాయం అవసరం.
ఈ సంక్షోభ సమయంలో శ్రీలంకకు ఆర్థిక సహాయం అందించడంలో భారత్ కీలకపాత్ర పోషించింది. దిసనాయకేకు ఈ సంగతి తెలుసు.
‘‘జనతా విముక్తి పెరమునె గతంలో భారత్ పట్ల కఠినంగా ఉండొచ్చు. కానీ, శ్రీలంక ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి ఇతరుల అండ మరింత అవసరం. భారత్ను దిసనాయకే దూరం పెట్టలేరు. ఎందుకంటే ఈ సంక్షోభ సమయంలో ఆర్థిక మద్దతు అందిస్తోన్న కీలక దేశాల్లో భారత్ కూడా ఒకటి’’ అని ప్రొఫెసర్ అహిలాన్ చెప్పారు.
శ్రీలంక విదేశాంగ వనరుల శాఖ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఆ దేశానికి ఆర్థిక సహకారం అందించిన దేశాల్లో చైనా, జపాన్, భారత్లు వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
‘‘భారత్ను పక్కన పెట్టి దిసనాయకే ఒక క్లిష్ట పరిస్థితిని కొనితెచ్చుకోలేరు. భారత ప్రాజెక్టును వ్యతిరేకించిన ఆయన చైనా ప్రాజెక్టులపై ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. ఇది ఆయన అనుసరిస్తున్న ఒక రకమైన పక్షపాతాన్ని సూచిస్తుంది. అయితే, శ్రీలంకలో సంక్షోభం తలెత్తగానే ముందుగా ఆదుకున్నది భారతదేశమే అనే అంశం ఆయనకు తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టకుండా ఆయన వ్యవహరిస్తారని భావిస్తున్నా’’ అని ప్రొఫెసర్ జేవియర్ అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














