స్టూడెంట్ వీసా: తెలుగు విద్యార్థులకు అమెరికా అవకాశాలు తగ్గిపోతున్నాయా?

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

సికింద్రాబాద్‌ అల్వాల్‌కు చెందిన శరత్‌, నగరంలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ (మెకానికల్‌) చేసి ఎంఎస్‌ చదవడానికి అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఆరిజోనా స్టేట్‌ యూనివర్సిటీలో శరత్‌కు సీటు వచ్చింది. వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. మే 20న దిల్లీలో వీసా స్లాట్‌ వచ్చింది.

''ఆ స్లాట్‌ ఇంటర్వ్యూలో ఎన్నో ప్రశ్నలు అడిగారు. డేటా మైనింగ్‌ అంటే ఏమిటి? బిగ్‌ డేటా అంటే ఏమిటి అనే టెక్నికల్‌ ప్రశ్నలకు కూడా నేను సరిగ్గానే సమాధానం చెప్పాను. ఎక్స్‌పీరియన్స్‌ అడిగితే, నేను చేసిన స్టార్టప్‌ వర్క్‌ గురించి వివరించాను. కానీ, కారణం చెప్పకుండానే వీసాని రిజెక్ట్‌ చేశారు’’ అని శరత్ చెప్పారు.

ఈ వ్యవహారం తర్వాత అమెరికా వెళ్లాలన్న ఆసక్తి పోయిందని శరత్ చెప్పారు.

‘‘మళ్లీ వీసా కోసం అప్లై చేసే ఆలోచనే లేదు. యూకే వెళ్లాలా లేదా మన దేశంలోనే మంచి కాలేజీలో సీటు తెచ్చుకుని చదవాలా అని ఆలోచిస్తున్నా'' అని బీబీసీతో అన్నారు శరత్‌.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బీటెక్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌లో 80 శాతం మార్కులు తెచ్చుకున్న గుంటూరుకి చెందిన ఫయాజ్‌, ఎంఎస్‌ చేసేందుకు న్యూయార్క్‌లోని సెరాక్యూస్‌ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ సెలెక్ట్‌ కావడంతో పాటు ట్యూషన్‌ ఫీజులో 50% స్కాలర్‌ షిప్‌ కూడా వచ్చింది. దీంతో వీసాకి అప్లై చేశారు.

''ఇటీవల దిల్లీలో వీసా ఇంటర్వ్యూకి హాజరు కాగా 11 ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ నేను సరిగ్గానే సమాధానం చెప్పా. కానీ సెక్షన్‌ 214బీ ప్రకారం వీసాకి నేను అర్హుడిని కాదని చెప్పారు. సెక్షన్‌ 214బీ అంటే ఈసారికి అర్హత లేదు అని అర్థం. నాతో పాటు వెళ్లిన మా బ్యాచ్‌ 10మందికి ఇలానే రిజెక్ట్‌ అయింది. ఇంకా ఏం చేయాలో డిసైడ్‌ కాలేదు'' అని బీబీసీతో ఫయాజ్‌ చెప్పారు.

రాజమండ్రికి చెందిన విద్యార్థిని శ్రేయది కూడా దాదాపు ఇదే అనుభవం. ఇటీవల ఆమెకు యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినాలో ఎంఎస్‌ కంప్యూటర్‌ సైన్స్‌ సీటు వచ్చింది. గత నెలలో ఆమె వీసా అప్లికేషన్ రిజెక్ట్‌ అయింది.

అమెరికా వీసా

ఫొటో సోర్స్, Getty Images

ట్రంప్‌ నిర్ణయం కంటే ముందు నుంచే రిజెక్షన్‌లు

అమెరికాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపేయాలని ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్‌ ట్రంప్‌ ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే షెడ్యూలింగ్‌ అయిన స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను కొనసాగించవచ్చని, మే 27 నుంచి కొత్తవి షెడ్యూల్ చేయొద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలను ఆదేశించారు.

విశ్వవిద్యాలయాలను రాజకీయ పోరాటాలకు వేదికగా మార్చకూడదని అంటున్న ట్రంప్ ప్రభుత్వం, అమెరికా విలువలను వ్యతిరేకించే విద్యార్థుల గురించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.

వాస్తవానికి ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకోకముందు నుంచే, అంటే గత నెల రోజులుగా వీసాల స్లాట్లు దొరకడం లేదని, ఒకవేళ దొరికినా ఇంటర్వ్యూల్లో రిజెక్ట్‌ అవుతున్నాయని తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చెబుతున్నారు.

నెల కిందట నుంచే స్లాట్‌లు కనిపించకపోవడంతో విద్యార్థులు అప్పుడే ఆందోళన వ్యక్తం చేయగా, యూఎస్‌ ఎంబసీ అపాయింట్‌మెంట్‌ వ్యవస్థను అప్‌గ్రేడ్‌ చేస్తున్న నేపథ్యంలోనే స్లాట్‌లు కనిపించడం లేదని నిపుణులు చెప్పుకొచ్చారు.

ఈ అంశంపై భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ స్పందిస్తూ, ఎఫ్‌-1 వీసాలను రద్దు చేస్తున్నామంటూ వచ్చే వార్తలపై ఆందోళన అవసరం లేదని చెప్పారు.

కానీ, ట్రంప్‌ సర్కారు విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది.

నెల రోజుల ముందు నుంచే వీసా స్లాట్‌లు దొరకడం లేదని విజయవాడలోని వీసా సర్వీసెస్‌ సంస్థకి చెందిన నవీన్‌ చౌదరి బీబీసీతో అన్నారు.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాపై ఆసక్తి తగ్గుతోందా?

వాస్తవానికి అమెరికాలో ట్రంప్‌ సర్కారు వచ్చినప్పటి నుంచి విదేశీ విద్యార్థులపై ఆంక్షలు పెరిగాయి. ఎఫ్‌-1 వీసాపై వచ్చే విదేశీ విద్యార్థులు, పార్ట్‌టైం జాబ్‌ చేసుకోవడానికి వీల్లేదని, అలా చేస్తే వారిని తమ దేశం నుంచి పంపించి వేస్తామని అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.

దీంతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, ఖర్చుల కోసం పార్ట్‌ టైం జాబ్‌ చేసే భారతీయ విద్యార్థులు, అందులో ఎక్కువ సంఖ్యలో ఉండే తెలుగువారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.

‘‘ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నవాళ్లకు పరవాలేదు. ఎఫ్‌-1 వీసాపై అక్కడికి వెళ్లి, ఖర్చుల కోసం పార్ట్‌టైం జాబ్‌ చేయాలనుకునే మధ్యతరగతి విద్యార్థులు ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో అమెరికా వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు’’ అని హైదరాబాద్‌లోని ఓ కన్సల్టెన్సీ అధినేత జెడ్‌ రమేశ్ కుమార్‌ బీబీసీతో అన్నారు.

అమెరికాలో కొన్నాళ్లుగా విదేశీ విద్యార్థుల రాకపై ఆంక్షలు పెరుగుతున్నాయి.

''కొంతకాలానికి యూఎస్‌ వెళ్లేవారి సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే పిల్లలు ఆల్టర్నేటివ్స్‌ చూస్తున్నారు'' అని జెడ్‌ రమేశ్ కుమార్‌ అన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా వెళ్లే వారి సంఖ్య తగ్గుతోందా?

అమెరికాకు వెళ్లేవారి సంఖ్య రాన్రాను తగ్గిపోతుందని స్థానిక కన్సల్టెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.

‘‘మేం 2010 నుంచి గుంటూరులోని మా కన్సల్టెన్సీ ద్వారా విద్యార్థులను అమెరికాకు పంపిస్తున్నాం. మా దగ్గర నుంచి ఆగస్టులో అమెరికాకు వెళ్లే వారి సంఖ్య ప్రతి ఏటా సగటున 500 మంది వరకు ఉండేది. కానీ, ఈ ఏడాది ఇప్పటివరకు 40 మంది కూడా లేరు" అని ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడు కల్యాణ్‌ బీబీసీతో అన్నారు.

సికింద్రాబాద్‌లోని తమ కన్సల్టెన్సీ ద్వారా ఏడాదికి 50 మంది అమెరికాకు వెళ్తారని, ఈ ఏడాది పదిమంది కూడా లేరని జెడ్‌ రమేశ్ కుమార్‌ తెలిపారు.

"వీసాలపై ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని నేను అనుకోవడం లేదు. విద్యార్థులు భయపడుతున్నారు. అక్కడి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలతో అక్కడికి వెళ్తే ఏమవుతుందోననే ఆందోళన వారిలో ఎక్కువైంది" అని ఆయన చెప్పారు.

యూకేతో పాటు యూరప్ దేశాలకూ డిమాండ్‌

అమెరికాలో ఆంక్షలతో విద్యార్థులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. వాస్తవానికి విదేశీ విద్యకు సంబంధించి యూఎస్‌కు ఉన్నంత క్రేజ్‌ మిగతా దేశాలకు ఉండదు.

"కానీ, ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఎక్కువగా యూకేను ఎంచుకుంటున్నారు. ఐర్లాండ్, కెనడాతో పాటు జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్‌ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడ మరో అడ్వాంటేజ్‌ ఏమిటంటే పబ్లిక్‌ యూనివర్సిటీల్లో ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. ఇతర ఖర్చులు కూడా అమెరికాతో పోలిస్తే తక్కువే. కానీ, సమస్య ఏంటంటే ఇంగ్లిష్‌ ఎక్కువగా వాడుకలో ఉండదు. అక్కడ జాబ్‌ చేయడం ఇబ్బంది అవుతుంది. స్థానిక భాషలు నేర్చుకోవాల్సి ఉంటుంది'' అని గుంటూరుకి చెందిన యూఎస్‌ కన్సల్టెన్సీ అధినేత పరుచూరి కల్యాణ చక్రవర్తి అన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

పరిస్థితులు కుదుటపడతాయా?

అమెరికాలో ఉన్నత చదువులు పూర్తయ్యాక కోర్సులను బట్టి 12 నుంచి 36 నెలల వరకు ఓపీటీకి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఉద్యోగాలు చేసేందుకు హెచ్‌-1బీకి అర్హత లభిస్తుంది. ఓపీటీ గడువు పూర్తయ్యాక ఐ-140 వీసా జారీ చేస్తారు. ఇది వస్తే గ్రీన్‌ కార్డ్‌ వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది.

ఇలా ఓపీటీలో అక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందినవారు దాదాపు 2లక్షల మందికిపైగా ఉంటారని అంచనా.

ఒక ఏడాది ఆగితే పరిస్థితులు కుదుటపడతాయని ఆశిస్తున్నట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని అమెరికన్‌ కార్నర్‌ ప్రొఫెసర్‌ పాల్‌ డగ్లస్‌ బీబీసీతో అన్నారు.

చదువు కోసం అమెరికా వెళ్లాలనుకునే వారికి వీసా, అక్కడి కోర్సులు ఎలా ఉంటాయి, ఇతరత్రా విషయాలపై ఇక్కడ అవగాహన కల్పిస్తారు. అమెరికా కాన్సులేట్‌ పర్యవేక్షణలో ఈ కార్నర్‌ పని చేస్తుంది.

తెలుగు విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులే అధికం’

"అమెరికా వెళ్లేవారిలో ఉతర భారతం కన్నా దక్షిణ భారత విద్యార్థులే ఎక్కువమంది ఉంటారు. సౌత్‌లో కూడా ఏపీ, తెలంగాణ విద్యార్థులదే అగ్రభాగం. ఆ తర్వాత తమిళనాడు, కేరళ, కర్ణాటక విద్యార్థులు ఉంటారు" అని పరుచూరి కల్యాణ చక్రవర్తి తెలిపారు.

ఉన్నత చదువుల కోసం తమ దేశానికి వచ్చేవారి కోసం అమెరికా ప్రతి ఏటా దాదాపు 2 లక్షల ఎఫ్‌-1 వీసాలు జారీ చేస్తుంది. ఇందులో దాదాపు 40 శాతం భారతీయులకే కేటాయిస్తోంది.

2024లోనూ అమెరికా దాదాపు 84 వేల మంది భారతీయులకు ఎఫ్‌-1 వీసాలు జారీ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారి సంఖ్య దాదాపు 25 వేల వరకు ఉంటుందని ఓ అంచనాగా ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)