తెలుగు పాఠకులకు సుపరిచితుడైన ఆఫ్రికా సాహితీ దిగ్గజం గూగీ వా థియాంగో మృతి.. జైలులో ఉన్నప్పుడు టాయిలెట్లోని టిష్యూ పేపర్పై నవల రాసిన రచయిత

ఫొటో సోర్స్, Ngugi wa Thiong'o
- రచయిత, వెడెలీ చిబులెషి, వెంకట కిషన్ ప్రసాద్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఆధునిక ఆఫ్రికా సాహిత్యంలో దిగ్గజ రచయిత గూగీ వా థియాంగో, 87 ఏళ్ల వయస్సులో మృతి చెందారు.
జైలు, బహిష్కరణ, అనారోగ్యం వంటివి ఆయన కలాన్ని ఆపలేకపోయాయి.
కెన్యాకు చెందిన గూగీ, ప్రధానంగా తమ దేశం వలస పాలన నుంచి ప్రజాస్వామ్య దేశంగా మారే క్రమంపై ఎన్నో రచనలు చేశారు.
సాహిత్య విభాగంలో ఆయనకు నోబెల్ బహుమతి అందుతుందని చాలాసార్లు ఆశపడిన అభిమానులకు ప్రతిసారీ నిరాశే ఎదురైంది.
"నోబెల్ రాకున్నా, నా రచనలు మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తున్నందుకు నేను గర్వ పడుతుంటాను" అని 2018లో ‘బీబీసీ తెలుగు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గూగీ వా థియాంగో అన్నారు.
ఈ ఇంటర్వ్యూలో తన సాహితీ ప్రయాణం గురించి వివరంగా మాట్లాడారు. గూగీ తెలుగు సాహిత్యాభిమానులకు సుపరిచితుడే.

ఆయన రాసిన 'డెవిల్ ఆన్ ద క్రాస్' పుస్తకం తెలుగులో 'మట్టికాళ్ల మహారాక్షసి' పేరుతో అచ్చయింది. ఆ తర్వాత 'మాటిగరి', 'బందీ' పుస్తకాలు తెలుగులో వచ్చాయి.
'డ్రీమ్స్ ఇన్ ఎ టైమ్ ఆఫ్ వార్' అనే పుస్తకం 'యుద్ధకాలపు స్వప్నాలు' పేరుతో తెలుగులో వచ్చింది.
ఈ పుస్తకాన్ని నాగపుర్ జైలులో యావజ్జీవ ఖైదీగా ఉన్న సమయంలో ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా తెలుగులోకి అనువదించారు.
నోబెల్ స్థాయి రచయితగానే కాకుండానే, ఆఫ్రికా స్థానిక భాషల్లో రాసిన సాహిత్యానికి ఒక బలమైన సమర్థకుడిగా కూడా గూగీ పేరు పొందారు.
కెన్యా, బ్రిటిష్ పాలనలో ఉన్న సమయంలో 1938లో గూగీ జన్మించారు. ఆయన అసలు పేరు జేమ్స్ థియాంగో గూగీ.
వ్యవసాయ పనులు చేసే పేద కుటుంబం వారిది. లిమురు పట్టణంలో ఆయన బాల్యం గడిచింది.

ఫొటో సోర్స్, BBC/Sharique
2018లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గూగీ ఏం చెప్పారంటే?
వలసవాద పాలనపై, మూడో ప్రపంచ దేశాల్లో వలసవాద మనస్తత్వంపై పదునైన విమర్శలు చేసేవాడిగా పేరున్న గూగీ ఈ ఇంటర్వ్యూలో మాతృభాషలలో విద్య, సాహిత్య సృజన ఆవశ్యకతను బలంగా చెప్పారు.
తన రాజకీయ విశ్వాసాల కారణంగా గూగీ కెన్యాలో జైలు జీవితాన్ని ఎదుర్కొన్నారు. చాలా సంవత్సరాల పాటు పరాయి దేశాల్లో తలదాచుకున్నారు.
గూగీ జైలులో ఉన్న సమయంలో మరుగుదొడ్లో ఉండే టిష్యూ పేపర్పై 'డెవిల్ ఆన్ ద క్రాస్' పుస్తకాన్ని రాశారు.
'సీగల్ బుక్స్' ఆహ్వానంపై గూగీ రెండు వారాల పర్యటనపై 2018 ఫిబ్రవరి 10న భారత్కు వచ్చారు.
ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

ఫొటో సోర్స్, Getty Images
ప్రశ్న: రచయితగా మీ ప్రయాణం ఎలా మొదలైంది? ఆనాడు ఆఫ్రికాలో, కెన్యాలో నెలకొన్న పరిస్థితులేంటి?
గూగీ: నేను 1938లో కెన్యాలో పుట్టాను. కెన్యా 1895 నుంచి 1963 వరకు బ్రిటిష్ కాలనీగా ఉంది. ఇంగ్లండ్కు చెందినవారు మా నేలను ఆక్రమించుకున్నారు. ఆఫ్రికన్ మూలనివాసులను వారు మూడో తరగతి పౌరులుగా దిగజార్చారు.
1952లో కెన్యన్లు వారిపై తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటును 'మౌ మౌ' ఉద్యమం అని పిలుస్తారు. తిరుగుబాటుదారులు మాత్రం తమను తాము 'కెన్యా ల్యాండ్ అండ్ ఫ్రీడమ్ ఆర్మీ' అని చెప్పుకున్నారు. భూమి, స్వేచ్ఛ - ఇవే తమ లక్ష్యాలని వారు ప్రకటించుకున్నారు.
నేను రెండో ప్రపంచ యుద్ధానికి కాస్త ముందుగా పుట్టాను. బాల్యంలో నేను బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా సాగిన సాయుధ ఉద్యమాన్ని చూశాను. వీటన్నింటి ప్రభావం నాపై ఉంది.
ఆ తర్వాత చాలా ఏళ్లకు.. యుగాండాలోని కంపాలాలో ఉన్న మకరెరె యూనివర్సిటీలో చదువు పూర్తయిన తర్వాత నా రచనా వ్యాసంగం మొదలైంది.
బాల్యంలో నేను చూసిన ఉద్యమాల ప్రభావం నా రచనలపై ఉంది. లేదా నేను వాటిని ప్రేరణగా తీసుకున్నాను.

ఫొటో సోర్స్, Getty Images
ప్రశ్న: స్థానిక భాషల గురించి మీరు మీ 'డీకాలనైజింగ్ మైండ్' పుస్తకంలో చాలా రాశారు. ప్రస్తుత గ్లోబలైజేషన్ యుగంలో దీనిని మీరెలా చూస్తారు? ఇంగ్లిష్ను ఇప్పటికీ మీరు సామ్రాజ్యవాద భాషగానే పరిగణిస్తారా?
గూగీ: నిజమే, నా మొదటి మూడు నవలలు - ద రివర్ బిట్వీన్, వీప్ మై చైల్డ్, గ్రెయిన్ ఆఫ్ వీట్ - ఇంగ్లిష్లోనే రాశాను.
కొంత కాలానికి నేను పేర్ల గురించి, చరిత్ర గురించి పునరాలోచించడం మొదలుపెట్టాను. ఆఫ్రికన్లను బానిసలుగా మార్చుకొని అమెరికాలోని ప్లాంటేషన్లకు తీసుకెళ్లినపుడు వారి పేర్లను మార్చేసే వారు.
ప్లాంటేషన్ యజమాని పేరునే అతని బానిసలకూ పెట్టారు. వారు ఒక ప్లాంటేషన్ నుంచి మరొక ప్లాంటేషన్కు మారిపోతే వారి పేర్లు కూడా మార్చేసేవారు. ఒక ఆఫ్రికన్కు బ్రౌన్ అనే పేరు పెట్టారంటే ఆ ప్లాంటేషన్ యజమాని పేరు బ్రౌన్ అని అర్థం.
ఆ తర్వాత క్రైస్తవ మిషనరీలు ఆఫ్రికాకు వచ్చినపుడు బాప్టిజం ఇప్పించి మా వాళ్లను క్రిస్టియన్లుగా మార్చారు. ఈ ప్రక్రియలో భాగంగానే ఆఫ్రికన్లకు క్రైస్తవ పేర్లు పెట్టారు. ఈ పేర్లన్నీ ఇంగ్లిష్ పేర్లే. అందులో భాగంగానే నా పేరును 'జేమ్స్ గూగీ'గా మార్చారు. నాకిది అప్పటి ప్లాంటేషన్ బానిసత్వానికి కొనసాగింపే అనిపించింది.
ఇది అర్థమైన తర్వాత నా పేరును వదిలించుకోవాలని నిశ్చయించుకున్నా. మా పేర్లకన్నా వాళ్ల పేర్లు ఎక్కువ దైవత్వాన్ని కలిగి ఉన్నాయనే భావన ఇందులో ఇమిడి ఉంది. ఇది ఓ అహంకార ధోరణి. నా క్రిస్టియన్ పేరును వదిలించుకోవడానికి ఇదొక కారణం.
అలా నేను 'జేమ్స్ గూగీ' నుంచి 'గూగీ వా థియాంగో'గా మారిపోయాను.

ప్రశ్న: స్థానిక భాషల గురించి మీరు మీ 'డీకాలనైజింగ్ మైండ్' పుస్తకంలో చాలా రాశారు. ప్రస్తుత గ్లోబలైజేషన్ యుగంలో దీనిని మీరెలా చూస్తారు? ఇంగ్లిష్ను ఇప్పటికీ మీరు సామ్రాజ్యవాద భాషగానే పరిగణిస్తారా?
గూగీ: వలసకాలంలో ఇంగ్లిష్ భాష సామ్రాజ్యవాద శక్తికి ప్రతీకగా ఉంది. ప్రపంచంలో సామ్రాజ్యవాద శక్తికి ప్రతీకగానే ఇంకా కొనసాగుతోంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక భాషగా ఇంగ్లిష్తో మనకు ఇబ్బందేమీ లేదు.
అయితే ఇంగ్లిష్ అనేది తెలుగుకన్నా గొప్ప భాషేమీ కాదు. తెలుగు అనేది ఎట్లా ఒక భాషనో, ఇంగ్లిష్ కూడా అట్లాగే ఒక భాష. అంతే. అంతకన్నా ఎక్కువ ఏమీ కాదు.
ఇంగ్లిష్, తెలుగు, గికియు లేదా ఫ్రెంచ్ అన్నీ సమానమైన భాషలే.
అయితే ఎవరైనా తమ భాష మరే ఇతర భాషకన్నా గొప్పదని అంటే అది మిగిలిన భాషలను అవమానించడమే.
భాషల మధ్య సంబంధం సమాన హోదాలో ఉండాలే తప్ప ఆధిపత్య ధోరణిలో ఉండగూడదు.
ఇంగ్లిష్కు తనదైన భాషా సౌందర్యం ఉంది. తెలుగుకు తనదైన వినూత్న సౌందర్యం ఉంటుంది. హిందీకి తనదైన సౌందర్యం ఉంటుంది. ప్రతి భాష మరో భాషను ప్రభావితం చేస్తుంది.
కానీ భాషలను చిన్నది, పెద్దది అనే ఆధిపత్య ధోరణితో చూసినప్పుడే సమస్య తలెత్తుతుంది.
భాషలన్నీ పరస్పరం సంబంధం కలిగి ఉండాలి. అయితే అది గుర్రానికీ, రౌతుకు మధ్య సంబంధంలా ఉండకూడదు. ఇచ్చిపుచ్చుకునే సంబంధంలా ఉండాలి.

ప్రశ్న: తమ భాషలను కాపాడుకునేందుకు సంఘర్షిస్తున్న భారతీయ ఆదివాసీ సమూహాలకు మీరిచ్చే సలహా ఏంటి?
గూగీ: తమ భాషల కోసం పోరాడటం తప్ప ప్రత్యామ్నాయ మార్గమేదీ లేదు. వాళ్లు తమ భాషలలో రచనలు చేయాలి.
తమ భాషలలోకి అనువాదాలు చేసుకోవాలి. మరోమాటలో చెప్పాలంటే - మాతృభాషకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.
వనరులు సమీకరించుకోండి. మీ భాషలలో రాయండి. వాటిని అభివృద్ధి చేసుకోండి. అట్లాగే మీ భాషలలోని సాహిత్యాన్ని హిందీలోకీ, ఇంగ్లిష్లోకి అనువాదం కూడా చేయండి.
భాషల మధ్య ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు లేవంటే, ఒక భాష మరొక భాషపై ఆధిపత్యం చెలాయిస్తున్నట్టే అర్థం.
భారత్లోనైనా, ప్రపంచంలో మరెక్కడైనా ప్రతి వ్యక్తికీ, ప్రతి పిల్లవాడికీ తమ భాషపై హక్కు ఉంటుంది. ఇది మౌలికమైన విషయం.

ప్రశ్న: సోషల్ మీడియా విస్తృతమవడం వల్ల ప్రజలకు తమ స్థానిక భాషలలో వ్యక్తీకరణకు అవకాశం దొరికిందంటారా?
గూగీ: అంతగా కానప్పటికీ సోషల్ మీడియా వల్ల కొంత ఉపయోగం ఉంది. ఇంటర్నెట్ వ్యాప్తి మూలంగా ప్రజలకు తమ భాషలలో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం వీలవుతోంది.
అయితే ప్రతి ఒక్కరికీ తమ మాతృభాషే మౌలిక ఆధారం. బేస్ చాలా ముఖ్యమైంది. అంతరిక్షంలోకి రాకెట్ ప్రయోగించాలన్నా సరే దానికి గట్టి బేస్ ఉండాల్సిందే.
అట్లాగే మనిషి గ్లోబల్గా ఎక్కడికి దూసుకు పోవాలనుకున్నా సరే.. మాతృభాష అనే ఆధారం (బేస్) గట్టిగా ఉండాలి.

ప్రశ్న: మీరు ప్రపంచమంతా తిరిగారు కదా. ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాల్లో స్థానిక భాషలలో వస్తున్న సాహిత్యం ఎలా ఉంది?
గూగీ: నేడు చాలా వరకు గొప్ప సాహిత్యం వస్తుందనే చెప్పాలి. ప్రపంచంలో గతంలో వలసలుగా ఉన్న దేశాలకు చెందిన రచయితలు సృష్టిస్తున్న సాహిత్యమే నేడు అత్యద్భుత సాహిత్యంగా ఉందని నా అభిప్రాయం.
అయితే, దురదృష్టవశాత్తు ఆ సాహిత్యంలో ఎక్కువ భాగం యూరప్కు చెందిన ఆధిపత్య భాషలలోనే - అంటే ఫ్రెంచ్, ఇంగ్లిష్, పోర్చ్గీస్, స్పానిష్లలోనే వస్తోంది.
నిజానికి తెలుగులో లేదా గుజరాతీలో, ఆదివాసీ, దళిత భాషలలో సాహిత్యం పుట్టి ఇంగ్లిష్ సహా మిగతా భాషలలోకి వెళ్లగలిగితే బాగుండేది.
ఇటు నుంచి అటు వెళ్లే క్రమం చాలా ముఖ్యమైంది.
ప్రస్తుత ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ పరిస్థితి ఎలా ఉందని మీ అభిప్రాయం?
గూగీ: ఆధిపత్యంలో ఉన్న వర్గాలు ఎప్పుడైనా తాము అణిచివెయ్యాలని చూసే వర్గాల గొంతు నొక్కాలని చూస్తాయనే విషయం చరిత్ర పొడవునా కనిపిస్తుంది.
కాబట్టి అణచివేతకు గురవుతున్న వారు తమ ప్రజాస్వామిక హక్కుల పరిధిని వ్యాప్తి చేసుకోవడం కోసం నిరంతరం పోరాడాల్సిందే. అది వారి బాధ్యత.

ప్రశ్న: సమకాలీన భారత రచయితలలో మీరెవరిని ఇష్టపడతారు?
గూగీ: నిజానికి తొలి భారతీయ ఇంగ్లిష్ రచయితలు కెన్యాలో మా పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారు.
1960 దశకం తొలి భాగంలో నైరోబీలో ఇంగ్లిష్ డిపార్ట్మెంట్ను మార్చడానికి వారు కృషి చేశారు. ఆసియా, కరేబియన్, ఆఫ్రో-అమెరికా రచయితల సాహిత్యాన్ని ఇంగ్లిష్లోకి అనువాదం చేయడానికి వారు కృషి చేశారు.
ఆసియా విభాగపు రచయితల్లో భారతీయ రచయితలు ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నారు. వారంతా మాకు అభిమాన పాత్రులే.
ఇంకా సల్మాన్ రష్దీ, సుసీ తారు తదితరులు నాకు మంచి స్నేహితులు. నాకు భారతీయ సాహిత్యంతో మంచి పరిచయమే ఉంది.
మహాభారతం, రామాయణం, వేదాలు వంటి వాటితో కూడా కొంత పరిచయం ఉంది.
ప్రశ్న: కొన్నేళ్ల క్రితం భారత్లో చాలా మంది రచయితలు దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ అవార్డుల్ని వెనక్కి ఇచ్చేశారు. దీనిపై మీ అభిప్రాయం?
గూగీ: భారత్ అంటే నా దృష్టిలో భారతీయ ప్రజలే. భారత్లోనైనా, కెన్యాలోనైనా, అమెరికాలోనైనా ఎక్కడైనా ప్రజాస్వామిక పరిధిని పెంచుకోవడం కోసమే ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. సహనం పెరగాలి.
జాతి, కులం, రంగు, జెండర్ ఆధారంగా మనుషుల మధ్య విభజన సరైంది కాదు.
పుట్టుక ఆధారంగా మనుషుల పట్ల వివక్షను ఆమోదించలేం.

ప్రశ్న: మీకు నోబెల్ రావొచ్చని ప్రచారం జరిగింది. కానీ ఈసారి కూడా మీకది దక్కలేదు. దీనిపై మీ కామెంట్?
గూగీ: రచయితగా నేను ఎవరినైనా కలిసినప్పుడు, ఆ వ్యక్తి మీ పుస్తకం నన్ను ప్రభావితం చేసిందని చెప్పినపుడు అది నాకు నోబెల్ దక్కినంత ఆనందం కలిగిస్తుంది.
1996లో ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా నాతో మాట్లాడారు. తాను డిప్రెషన్లో ఉన్న సమయంలో ఓ బుక్ షాప్కు వెళ్లినపుడు నా పుస్తకం 'డెవిల్ ఆన్ ఎ క్రాస్' కనిపించిందట. అది తన జీవితాన్ని మార్చేసిందని, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని నాకు చెప్పారు.
కాబట్టి నా పుస్తకాలు ప్రజలను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయనేదే నాకు ముఖ్యం.
నా 'డీకాలనైజింగ్ మైండ్' పుస్తకం వల్ల ఎవరికైనా తమ భాషలను ఎలా చూడాలి అనే అవగాహన పెరిగిందా అన్నది ముఖ్యం.
ఇదే నాకు ఎక్కువ సంతోషం కలిగిస్తుంది. రచయితకు ఇంతకన్నా ఏం కావాలి? ప్రపంచంలో ఇంతకన్నా పెద్ద పురస్కారం మరొకటేముంది?

ఫొటో సోర్స్, FB/Kranti Tekula
ప్రశ్న: మీ మూడు పుస్తకాలు తెలుగులో వచ్చాయి. మరొకటి ఈ మధ్యే వచ్చింది. కెన్యాలో మౌమౌ ఉద్యమం జరిగినప్పుడే తెలంగాణలో భూమి కోసం రైతుల పోరాటం జరిగింది. వీటిని మీరెలా చూస్తారు?
గూగీ: నాకు తెలంగాణ రైతాంగ ఉద్యమం గురించి చాలా ఏళ్ల తర్వాత తెలిసింది. అవును, మౌమౌ ఉద్యమం కూడా భూమి, స్వేచ్ఛ కోసం జరిగిందే.
భారత్కు చెందిన సుసీ తారు మహిళలూ, దళితులకూ సంబంధించిన పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మేమిద్దరం కలిసి చదువుకున్నాం.
సుసీ తారు విద్యార్థినిగా ఉన్నప్పుడు నా మొదటి నాటకంలో నల్లజాతి తల్లిగా పాత్ర పోషించారు. ఆ నాటకం పేరు 'బ్లాక్ హామ్లెట్'. ఆమె ద్వారా నాకు ఇక్కడి దళిత ఉద్యమాల గురించి తెలిసింది. అట్లా నాకు తెలుగు వాళ్లతో సంబంధం ఉంది.
గూగీకి ఇష్టమైన భారతీయ వంటకం?
ఇక్కడి పరాఠాలు నాకిష్టం. భారతదేశమంతటా ఇవి దొరుకుతాయి (నవ్వుతూ).
మీరు ఇటీవల చదివిన పుస్తకం?
ఇండియన్ ఫిలాసఫీ.
(ఫోటోలు/వీడియో: షారిఖ్)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














