గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకారం- అమెరికా, ఖతార్ ఏం చెబుతున్నాయంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డేవిడ్ గ్రిట్టెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దాదాపు 15 నెలల యుద్ధం తర్వాత గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల విషయంలో ఇజ్రాయెల్, హమాస్ ఒక ఒప్పందానికి వచ్చాయని మధ్యవర్తులైన అమెరికా, ఖతార్ తెలిపాయి.
ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థాని చెప్పారు. ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదించిందన్నారు.
"ఇది గాజాలో యుద్ధాన్ని ఆపుతుంది. దీని వల్ల పాలస్తీనీయులకు అవసరమైన మానవీయ సాయం అందుతుంది. బందీలను వారి కుటుంబ సభ్యులను కలుపుతుంది" అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.
ఈ ఒప్పందానికి మద్దతిచ్చిన జో బైడెన్కు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు. ఇది పాలస్తీనా ప్రజల మనో ధైర్యానికి దక్కిన ఫలితమని హమాస్ నాయకుడు ఖలీల్ అల్-హయ్యా అన్నారు.
అనేక మంది పాలస్తీనీయులు, ఇజ్రాయెల్ బందీల బంధువులు ఈ వార్త విని వేడుకలు చేసుకున్నారు.
అయితే గాజాలో దాడులు మాత్రం ఆగలేదు. తాజా ఒప్పందం గురించి ఖతార్ ప్రకటన చేసిన తర్వాత కూడా ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 20 మంది ప్రజలు చనిపోయారని హమాస్ నాయకత్వంలోని పౌర రక్షణ సంస్థ తెలిపింది.
ఈ ఆరోపణల మీద ఇజ్రాయెల్ సైన్యం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకు వచ్చి దాదాపు 1200 మందిని చంపి, 251 మందిని బందీలుగా పట్టుకెళ్లింది. దీంతో హమాస్ను అంతమొందిస్తామంటూ ప్రకటించిన ఇజ్రాయెల్.. గాజాలో యుద్థం ప్రారంభించింది.
ఈ యుద్ధం వల్ల గాజాలో ఇప్పటి వరకు 46,700 మందికి పైగా చనిపోయారని హమాస్ నాయకత్వంలోని ఆరోగ్యశాఖ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్ బందీలు, పాలస్తీనా ఖైదీలు
ఇజ్రాయెల్ దాడులతో 23 లక్షల మంది నిర్వాసితులయ్యారని, భారీగా విధ్వంసం జరిగిందని హమాస్ చెబుతోంది. గాజాలో ప్రజలకు ఆహారం, ఇంధనం, ఔషధాలు, వసతితో పాటు అనేక మందికి అత్యవసర సాయం అవసరమని హమాస్ అంటోంది.
హమాస్ దగ్గర ఇంకా 94 మంది బందీలు ఉన్నారని, అందులో 34 మంది చనిపోయినట్లు అనిపిస్తోందని ఇజ్రాయెల్ చెబుతోంది. వీరితో పాటు యుద్ధానికి ముందు హమాస్ వద్ద ఉన్న నలుగురు ఇజ్రాయెలీలలో ఇద్దరు చనిపోయారని తెలిపింది.
తొలి దశ (మొదటి ఆరు వారాలు) కాల్పుల విరమణ ప్రారంభం కావడానికి ముందు ఇరు వర్గాలు ప్రశాంతంగా ఉండాలని ఖతార్ ప్రధానమంత్రి కోరారు. ఇజ్రాయెల్లోని జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ చెరలో ఉన్న 33 మంది బందీలను విడుదల చేస్తారని అన్నారు. బందీల్లో మహిళలు, పిల్లలు, వృద్దులు ఉన్నారు.
గాజాలో జన సాంద్రత ఎక్కువగా ఉన్న తూర్పు ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ సైన్యాన్ని ఉపసంహరించుకుంటుంది. నిరాశ్రయులైన పాలస్తీనీయులు తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటారు. ఇకపై ఇక్కడికి ప్రతి రోజూ మానవీయ సాయం కింద సరుకులు తీసుకొచ్చే లారీలు రానున్నాయి.
రెండో దశ చర్చల్లో భాగంగా మిగతా బందీల విడుదల, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల పూర్తి ఉపసంహరణ, ప్రశాంతత పునరుద్దరణ గురించి మాట్లాడతారు. ఈ చర్చలు జనవరి 16 నుంచి ప్రారంభం అవుతాయి.
మూడోది, చివరి దశ చర్చల్లో భాగంగా గాజా పునర్నిర్మాణం, మిగిలిన బందీల శరీరాల అప్పగింతపై చర్చిస్తారు.
"రెండు, మూడు దశలకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ సిద్ధంగా ఉంది" అని షేక్ మొహమ్మద్ చెప్పారు. చర్చించాల్సిన అంశాలు ఖరారైన తర్వాత రెండు రోజుల్లో చర్చలకు సంబంధించిన ఒప్పందాన్ని వెల్లడిస్తామని ఆయన అన్నారు.
ఈ చర్చల్లో మధ్యవర్తులుగా ఉన్న ఖతార్, అమెరికా, ఈజిప్టు దేశాలు ఈ ఒప్పందంలోని అంశాలు అమల్లోకి వచ్చేలా చూస్తాయని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
జో బైడెన్, డోనల్డ్ ట్రంప్ ఏమన్నారంటే..
కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన ప్రణాళిక 8 నెలల క్రితమే సిద్ధమైందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.
"మేము ఈ వార్తను స్వాగతిస్తున్నప్పటికీ, అక్టోబర్ 7న హమాస్ దాడిలో మరణించినవారి కుటుంబాలను కూడా గుర్తుంచుకుంటాం. అలాగే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలను కూడా.." అని ట్రంప్ ఒక ప్రకటనలో చెప్పారు.
తర్వాత జరిగిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన బైడెన్, ఈ ఒప్పందం కుదరడంలో కాబోయే అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అందించిన సాయాన్ని గుర్తుచేశారు. సోమవారం తాను ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే బందీలను విడుదల చేసేలా ట్రంప్ ఇరు పార్టీల మీద ఒత్తిడి తెచ్చారని బైడెన్ చెప్పారు.
"కొన్ని రోజులుగా మేమంతా ఒక బృందంగా పని చేస్తున్నాం" అని బైడెన్ అన్నారు.
కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయాన్ని ముందుగా డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత వైట్ హౌస్, ఖతార్ ప్రకటన చేశాయి.
"బందీల విడుదలకు మద్దతిచ్చినందుకు ధన్యావాదాలు" అంటూ ఇజ్రాయెల్ ప్రధానమత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ట్రంప్కు ధన్యవాదాలు తెలిపింది.
"బందీలంతా స్వదేశానికి చేరుకునేందుకు ప్రధానమంత్రి కట్టుబడి ఉన్నారు" అని ఆ ప్రకటనలో పేర్కొంది.
"ప్రస్తుత ఒప్పందంలో పేర్కొనాల్సిన పూర్తి వివరాలపై కసరత్తు జరుగుతోందని, అది పూర్తైన తర్వాతే ఒప్పందం బయటకు వస్తుంది" అని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
మర్చిపోము, క్షమించము
ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రి వర్గం ఆమోదించిన తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వం విడుదల చెయ్యబోయే పాలస్తీనా ఖైదీల జాబితాను ప్రకటిస్తారు. వారి కుటుంబ సభ్యులు ఏదైనా చెప్పాలనుకుంటే 48 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీల్లో కొంత మంది హత్య, తీవ్రవాదం వంటి నేరాలకు గాను యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు.
"శత్రువుతో పోరాటంలో ఇది ఒక మైలు రాయి. మన ప్రజల స్వేచ్చ, పునరాగమనం లక్ష్యంగా సాగుతున్న యుద్ధంలో కీలక మలుపు" అని హమాస్ తరపున చర్చల్లో పాల్గొన్న గాజా చీఫ్ ఖలీల్ అల్- హయ్యా చెప్పారు.
"గాజా పునర్నిర్మాణం, బాధను తొలగించడం, గాయాలను మాన్పడం" పై హమాస్ దృష్టి పెడుతుందని చెప్పారు.
అదే సమయంలో గాజాలో పాలస్తీనీయులు అనుభవించిన బాధను గుర్తు చేస్తూ.. "మేం మర్చిపోం, మేం క్షమించం" అని అన్నారు.
కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని తెలియగానే సెంట్రల్ గాజా పట్టణం దీర్ అల్ బలా, ఖాన్ యూనిస్లో పాలస్తీనా జండాలు ఎగరవేస్తూ ప్రజలు వేడుక చేసుకుంటున్న ఫొటోలు ఆన్లైన్లో కనిపించాయి.
బందీల బంధువులు కూడా తమ వారు విడుదల అవుతారని హర్షం వ్యక్తం చేశారు.
"యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన వారికి, కష్టాలు ఎదుర్కొన్న వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి" అని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














