దిల్లీ మద్యం పాలసీ కేసు: అరవింద్ కేజ్రీవాల్ బెయిల్పై స్టే ఇచ్చిన హైకోర్టు..

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్పై హైకోర్టు స్టే ఇచ్చింది.
రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి న్యాయ బిందు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, కేజ్రీవాల్ బెయిల్ను సవాల్ చేస్తూ ఈడీ దిల్లీ హైకోర్టుకు వెళ్లింది. దీంతో, రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై స్టే ఇస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ఈ స్టే కొనసాగుతుందని వెల్లడించింది.
ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ దిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు.
మనీలాండరింగ్ కేసులో లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు ముగియడంతో జూన్ 2న కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లారు.


ఫొటో సోర్స్, ANI
ఎన్నికల సమయంలో ప్రకంపనలు సృష్టించిన కేసు
ఈ కేసుతో ముడిపడిన మనీ ల్యాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మార్చి 21న అరెస్టు చేసింది.
అప్పటి దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను 2023 ఫిబ్రవరిలో సీబీఐ అరెస్ట్ చేయగా, బెయిల్పై విడుదలైన తర్వాత అదే ఏడాది మార్చిలో ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసింది. ఆయన ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.
ఇంతకూ దిల్లీ మద్యం విధానం కుంభకోణం అంటే ఏమిటి? ఈ కేసు ఎలా మొదలైంది?

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ మద్యం పాలసీ కేసు: అసలేం జరిగింది?
ఒక్క ముక్కలో చెప్పాలంటే, 2021 వరకూ దిల్లీలో గవర్నమెంటే మద్యం అమ్మేది. తరువాత ప్రైవేటుకు ఇద్దాం అనుకున్నారు. ఆ క్రమంలో పెట్టిన రూల్స్లో గోల్మాల్ జరిగిందన్నది బీజేపీ ఆరోపణ. దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేయించారు నాటి లెఫ్టినెంట్ గవర్నర్. దీంతో మొత్తానికి ఆ పాలసీయే వద్దు, పాత పద్ధతిలోనే వెళ్లాలని నిర్ణయించింది ఆప్ ప్రభుత్వం.
కొంచెం వివరంగా చూస్తే, 2021 నవంబర్ నుంచి కొత్త విధానం అమలయింది. ప్రైవేటు సంస్థలకు మందు అమ్మే పద్దతి ప్రారంభించడంతోపాటు, మాఫియాను నియంత్రించడం, ప్రభుత్వానికి ఆదాయం పెంచడం, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినట్టు దిల్లీలోని ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త విధానం వల్ల గతం కన్నా ఎక్సైజ్ ఆదాయం 27 శాతం పెరిగి రూ. 890 కోట్లకు చేరుకుందని చెప్పింది.
ఎంఆర్పీ కన్నా తక్కువ ధరలకు మద్యం అందించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. అందుకు అనుగుణంగా విక్రయదారులకు డిస్కౌంట్లు అందించింది. తద్వారా వినియోగదారులకు మేలు కలుగుతుందని తెలిపింది.
మద్యం రిటైలర్లు, ఒకటి కొంటే ఒకటి ఉచితంగా ఇస్తూ విక్రయాలు పెంచుకున్నారు. పలు బ్రాండ్లపై ఎంఆర్పీ కన్నా తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి రావడంతో దిల్లీలో అమ్మకాలు పెరిగాయి.
ఇలా ప్రైవేటు వారికి అప్పగించే క్రమంలో అనేక అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందనే ఆరోపణలు వచ్చాయి. వెంటనే సీబీఐ ఎంక్వైరీ జరిగింది. ఆ తరువాత, మనీష్ సిసోదియా ఇంటిలో సీబీఐ సోదాలు చేసింది. ఆ వెంటనే, దీని వెనుక అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కుమార్తె కవిత హస్తం కూడా ఉందని బీజేపీ దిల్లీ నాయకులు ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితుడిగా మనీష్ సిసోదియా
ఈ అక్రమాలపై సీబీఐ 11 పేజీల ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీష్ సిసోదియా ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ ఎఫ్ఐఆర్లో మరో 15 మంది పేర్లను జతచేశారు. కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. పలు చోట్ల సీబీఐ సోదాలు చేసింది.
టెండర్ల తరువాత లైసెన్సు పొందిన వాళ్లకు అనుచితమైన ప్రయోజనాలు అందించడం కోసం, సంబంధిత అథారిటీ అనుమతి లేకుండా నేరుగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఎక్సైజ్ కమిషనర్ గోపీకృష్ణ, సిసోదియాలపై ఆరోపణలు చేసింది సీబీఐ.
''లైసెన్స్ ఫీజులలో లబ్ధి, అనుమతి లేకుండా లైసెన్సును పొడిగించటం వంటి అనుచిత ప్రయోజనాలను లైసెన్సుదారులకు కల్పించటానికి ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయటం సహా అక్రమాలు జరిగాయన్నది ఆరోపణ'' అని సీబీఐ పేర్కొంది.
ఈ మొత్తం వ్యవహారాన్ని నిర్వహించడానికి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ సిబ్బందికి ఆర్థిక ప్రయోజనాలను కల్పించడంలో సిసోదియాకు సన్నిహితులైన కొందరు వ్యాపారవేత్తలు క్రియాశీలంగా పనిచేస్తున్నారని ఈ ఎఫ్ఐఆర్లో ఆరోపించారు.
ఎక్సైజ్ పాలసీని అమలు చేయటానికి వీలుగా, అవసరమైన స్వల్ప మార్పులు చేసే అధికారాన్ని దిల్లీ మంత్రిమండలి ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రికి ఇచ్చిందని, కానీ ఆ తరువాత, నాటి లెఫ్టినెంట్ గవర్నర్ సలహా ప్రకారం 2021 మే 21వ తేదీన మంత్రి మండలి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుందని కూడా సీబీఐ పేర్కొంది.
అయినా కూడా, ఉప ముఖ్యమంత్రి, ఇన్చార్జ్ మంత్రి అనుమతితో ఎక్సైజ్ విభాగం, ప్రస్తుత ఆరోపణలకు కారణమైన నిర్ణయాలను తీసుకుని అమలు చేసిందని సీబీఐ ఆరోపించింది.
ఈ కొత్త విధానం వచ్చే సరికి దిల్లీ ఎక్సైజ్ కమిషనర్గా ఉన్న తెలుగు వ్యక్తి, ఐఏఎస్ అధికారి అరవ గోపీకృష్ణపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయన్ను సస్పెండ్ చేశారు.

ఫొటో సోర్స్, BRS
కేసులో ముఖ్య పరిణామాలు, అరెస్టుల వివరాలు
2020 సెప్టెంబరు 04: అప్పటి దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా కొత్త మద్యం పాలసీపై సిఫార్సుల కోసం అప్పటి దిల్లీ ఎక్సైజ్ కమిషనర్ రవి ధావన్ నేతృత్వంలో నిపుణుల ప్యానెల్ ఏర్పాటు చేశారు.
2020 అక్టోబర్ 13: ధావన్ బృందం తన రిపోర్టును దిల్లీ ప్రభుత్వానికి సమర్పించింది. దానిని పబ్లిక్ డొమైన్లో ఉంచారు. 14,761 మంది ప్రజలు తమ సూచనలను పంపినట్లు ప్రభుత్వం తెలిపింది.
2021 ఫిబ్రవరి 05: పాత మద్యం పాలసీ, ప్రజల అభిప్రాయాలపై లోతుగా అధ్యయనం చేయడానికి మనీష్ సిసోదియా, పట్టణాభివృద్ధి మంత్రి సత్యేందర్ జైన్, రెవెన్యూ మంత్రి కైలాష్ ఖేలత్ నేతృత్వంలో దిల్లీ ప్రభుత్వం మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేసింది.
2021 మార్చి 22: సిసోదియా నేతృత్వంలోని కమిటీ తన సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గానికి సమర్పించింది. మంత్రిమండలి ఈ కొత్త ఎక్సైజ్ పాలసీని ఆమోదించింది.
2021 ఏప్రిల్ 15: దిల్లీ కొత్త మద్యం విధానం ఫైలును అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్కు పంపారు. ఆయన కొన్ని సూచనలు చేసి, విధానాన్ని సమీక్షించి అవసరమైన సవరణలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
2021 నవంబర్ 17: దిల్లీ కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చింది.
2022 జులై 8: మద్యం విధానంపై లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు దిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ఒక రిపోర్టు అందించారు. మద్యం విధానం రూపకల్పనలో డబ్బు చేతులు మారినట్లు ఆరోపించారు. ఆర్థిక నేరాల విభాగానికి కూడా ఆయన ఈ రిపోర్టును సమర్పించారు.
2022 జులై 22: సీబీఐ విచారణకు సిఫారసు చేస్తూ అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.
2022 జులై 30: కొత్త ఎక్సైజ్ పాలసీ ఉపసంహరణకు నోటీసు ఇచ్చారు. ఆ తర్వాత ఆరు నెలలకు పాత మద్యం పాలసీని పునరుద్ధరించారు.
2022 ఆగస్టు 6: కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ సహా దిల్లీ ఎక్సైజ్ శాఖకు చెందిన 11 మంది అధికారులను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా సస్పెండ్ చేశారు.
2022 ఆగస్టు 7: సిసోదియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరిలో అప్పటి ఎక్సైజ్ కమిషనర్ సహా ముగ్గురు అధికారులు ఉన్నారు. వారిపై నేరపూరిత కుట్ర, మోసం అభియోగాలు మోపారు.
2022 ఆగస్టు 19: సిసోదియా ఇంట్లో సీబీఐ సోదాలు చేసింది. అంతేకాదు, కేసు దర్యాప్తులో భాగంగా ఏడు రాష్ట్రాల్లో మొత్తం 21 చోట్ల సోదాలు జరిగాయి.
2022 ఆగస్ట్ 23: దిల్లీ ఎక్సైజ్ పాలసీలో మనీలాండరింగ్ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసింది.
2022 సెప్టెంబర్ 28: ఇండోస్పిరిట్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు, వ్యాపారవేత్త , ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.
2022 అక్టోబర్ 8: దిల్లీ, హైదరాబాద్, పంజాబ్ సహా 35 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది.
2022 అక్టోబర్ 10: మద్యం వ్యాపారి అభిషేక్ బోయిన్పల్లిని సీబీఐ అరెస్టు చేసింది.
2023 ఫిబ్రవరి, మార్చి: అప్పటి దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాను సీబీఐ, ఈడీలు అరెస్టు చేశాయి. ఆయన ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.
2024 మార్చి 15: హైదరాబాద్లో సోదాల అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది.
2024 మార్చి 21: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది.
2024 ఏప్రిల్ 02: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
2024 ఏప్రిల్ 11: దిల్లీలోని తిహార్ జైలులో ఉన్న కల్వకుంట్ల కవితను సీబీఐ అరెస్టు చేసింది.
2024 మే 10: 50 రోజుల తర్వాత మే 10న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి బయటకు వచ్చారు.
2024 జూన్ 2: బెయిల్ గడువు ముగియడంతో కేజ్రీవాల్ జూన్ 2న జైలులో లొంగిపోయారు.
2024 జూన్ 20: కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
2024 జూన్ 21: కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్పై దిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది.
ఇవి కూడా చదవండి:
- ఎన్విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎలా మారింది, మైక్రోసాఫ్ట్, యాపిల్ కంపెనీలను అధిగమించడానికి కారణమేంటి?
- మెదక్: బక్రీద్ సందర్భంగా ఇక్కడ జరిగిన గొడవేంటి? ఎందుకు జరిగింది?
- రుషికొండ ‘రహస్య’ భవనాల్లో ఏముందంటే?
- పుతిన్కు ఘనస్వాగతం పలికిన కిమ్ జోంగ్ ఉన్.. అసలు ఉత్తర కొరియాకు పుతిన్ ఎందుకు వెళ్లారు? 3 ప్రశ్నలు, సమాధానాలు
- టీ20 వరల్డ్కప్: సూపర్-8 రౌండ్ పోటీలు ఎలా నిర్ణయించారు? సెమీస్, ఫైనల్లో వర్షం పడితే విజేతను ఎలా నిర్ణయిస్తారు?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














