వేరే అభ్యర్థికి ఓటేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఏం జరిగిందంటే...

ఫొటో సోర్స్, FB/Chandrababu, Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో సాయంత్రం 5 గంటల వరకు సుమారు 68 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకోవడంలో పట్టణ ప్రాంత ఓటర్లకు పెద్దగా ఇబ్బందులేమీ ఎదురుకానప్పటికీ మారుమూల ప్రాంతాలలో మాత్రం ఇబ్బందులు పడ్డారు.
నదులు, కొండలు దాటి మరీ రాజ్యాంగం తమకు కల్పించిన హక్కును వినియోగించుకున్నారు కొన్ని గ్రామాల ప్రజలు.
ముఖ్యంగా గిరిజన గ్రామాల ప్రజలు, పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాల వారికి ఇబ్బందులు తప్పలేదు.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలలో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు ఓటర్లు కూడా సొంత వాహనాలు, రైళ్లు, బస్సులలో వెళ్లి ఓటేశారు.

ఫొటో సోర్స్, CEO Andhra Pradesh

ఫొటో సోర్స్, Venkat
ఓటు కోసం నీటిలో తిప్పలు
పార్వతీపురం జిల్లా కొమరాడ మండలం రెబ్బ గ్రామానికి చెందిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏకంగా నదిని దాటాల్సి వచ్చింది.
వీరికి కేటాయించిన పోలింగ్ కేంద్రానికి వెళ్లాలంటే నాగావళి నదిని దాటాలి.
వేసవిలోనూ నాగావళిలో మోకాలి లోతు నీరు ప్రవహిస్తుండడంతో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లల తల్లులు కూడా నదిలో నడుచుకుంటూ కూనేరు వెళ్లి ఓట్లు వేశారు.

ఫొటో సోర్స్, janasena
వేరే అభ్యర్థికి ఓటేసిన చంద్రబాబు, పవన్
ఎన్నికలు, రాజకీయాలలో ఆరితేరిపోయినవారే కాదు మామూలు అభ్యర్థులు కూడా తమ ఓటు తమకు వేసుకుంటారు.
కానీ, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన పార్టీల అధ్యక్షులు మాత్రం తమ ఓటు వేరే వారికి వేశారు.
అవును.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ ఓటు తమకు వేసుకోలేకపోయారు.
దీనికి కారణం ఉంది. పవన్ కల్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నప్పటికీ ఆయనకు ఓటు మాత్రం మంగళగిరిలో ఉంది.
దీంతో ఆయన సోమవారం హెలికాప్టర్లో మంగళగిరి చేరుకుని అక్కడ లక్ష్మీనరసింహ స్వామి కాలనీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇక చంద్రబాబుదీ అదే పరిస్థితి. ఆయన కుప్పంలో పోటీ చేస్తున్నప్పటికీ ఆయనకు ఓటు హక్కు మాత్రం మంగళగిరిలో ఉంది.
సోమవారం ఉదయం ఆయన కుటుంబ సమేతంగా వచ్చి మంగళగిరిలో ఓటేశారు.
కాగా మంగళగిరి నియోజకవర్గంలో చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేశారు.
దీంతో పవన్, చంద్రబాబు ఇద్దరూ లోకేశ్ నియోజకవర్గంలో ఓటేసినట్లయింది.
తెలంగాణలోనూ కాసాని జ్ఞానేశ్వర్, మాధవీలత వంటి అభ్యర్థులు కొందరు తాము పోటీ చేస్తున్న నియోజకవర్గంలో తమకు ఓటు లేకపోవడంతో వేరే చోట ఓటేశారు.

ఫొటో సోర్స్, CEO andhra pradesh
ఈవీఎంల పడవ ప్రయాణం
ఆంధ్రప్రదేశ్లోని గోదావరి, కృష్ణానదుల్లోని లంక గ్రామాలు.. కాకినాడ సమీపంలో సముద్రంలోని హోప్ ఐలాండ్లో పోలింగ్ కేంద్రాలున్నాయి.
అక్కడ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఈవీఎంలను బోట్లు, పడవలలో తీసుకెళ్లారు. పోలింగ్ తరువాత వాటిని స్ట్రాంగ్ రూమ్లకు చేర్చడానికి కూడా అధికారులకు బోట్లే ఏకైక మార్గం.
బాపట్ల జిల్లా నాగాయలంక మండలం ఎలచెట్ల దిబ్బలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఇలాగే బోటులో ఈవీఎంలను తీసుకెళ్లారు.
ముమ్మిడివరం నియోజకవర్గంలోని హోప్ ఐలాండ్ పోలింగ్ కేంద్రానికి సముద్రంలో 16 కిలోమీటర్లు బోటులో ప్రయాణించి సిబ్బంది వెళ్లారు.
పోలింగ్ ముగిసిన తరువాత ఈ కేంద్రాల నుంచి ఈవీఎంలను తిరిగి ఇదే మార్గంలో తీసుకొస్తున్నారు

ఫొటో సోర్స్, ECI
కాలితో ఓటు
రెండు చేతులు లేని ఓటర్లు కొందరు ఈ ఎన్నికలలో తమ హక్కును వినియోగించుకున్నారు. వారు చేతులతో బదులు కాలితో ఓటు వేశారు.
తెలంగాణలోని డిచ్పల్లి మండలం సుద్దపల్లిలో అజ్మీరా రవి అనే యువకుడు ఇలాగే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఓ యువకుడు రెండు చేతులు లేకపోవడంతో కాలితోనే ఓటేశారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














