బీబీసీ ఇండియా ఆపరేషన్లలో మార్పులు.. ప్రకటించిన సంస్థ

బీబీసీ

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, జెరెమీ గ్రెగరీ
    • హోదా, బీబీసీ న్యూస్

భారత్‌లో విదేశీ పెట్టుబడుల నిబంధనలను అనుసరించేలా చూసేందుకు ఇక్కడ తమ ఆపరేషన్లలో బీబీసీ మార్పులు చేస్తోంది.

దీని కోసం బీబీసీ నుంచి నలుగురు ఉద్యోగులు బయటకువచ్చి ‘కలెక్టివ్ న్యూస్‌రూమ్’ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇది పూర్తిగా భారతీయుల యాజమాన్యంలో నడిచే సంస్థ. ఆరు బీబీసీ భారతీయ భాషా సర్వీసులు దీని కిందకు వస్తాయి.

అయితే, భారత్‌లోని ఇంగ్లిష్ న్యూస్‌గేదరింగ్ ఆపరేషన్ మాత్రం బీబీసీ కిందే ఉంటుంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో బీబీసీ ఇండియా కార్యాలయాల్లో ఆదాయపు పన్ను విభాగం సర్వే అనంతరం తాజా మార్పులు జరుగుతున్నాయి.

కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం భారత్‌లోని డిజిటల్ న్యూస్ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులు 26 శాతానికి మించకూడదు. అంటే భారత్‌లో డిజిటల్ న్యూస్ కంటెంట్ పబ్లిష్ చేసే ఏ సంస్థలోనైనా మెజారిటీ వాటా భారతీయుల పేరిటే ఉండాలి.

ప్రస్తుత బీబీసీ ఇండియా హెడ్ రూపా ఝా కొత్తగా ఏర్పాటుచేసే ‘కలెక్టివ్ న్యూస్‌రూమ్‌’కు నేతృత్వం వహిస్తారు. ఆమెతోపాటు ముఖేశ్ శర్మ, సంజయ్ మజుందార్, సారా హసన్ ఈ సంస్థను నడిపిస్తారు.

బీబీసీ తెలుగు, బీబీసీ హిందీ, బీబీసీ తమిళ్, బీబీసీ మరాఠీ, బీబీసీ గుజరాతీ, బీబీసీ పంజాబీ సర్వీసుల కోసం పనిచేసే సిబ్బంది ఈ కొత్త సంస్థలో చేరుతారు.

బీబీసీ ఇండియా ఇంగ్లిష్ యూట్యూబ్ చానల్ సిబ్బంది కూడా ఈ సంస్థ కిందకే వస్తారు.

‘‘బీబీసీ, కలెక్టివ్ న్యూస్‌రూమ్‌ల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా బీబీసీ భారతీయ భాషలు అందిస్తున్న నాణ్యమైన సేవలు అలానే కొనసాగుతాయని ఆడియన్స్‌కు మేం హామీ ఇస్తున్నాం’’ అని రూపా ఝా చెప్పారు.

దిల్లీ, ముంబయిలలోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను అధికారుల సర్వే అనంతరం విదేశీ పెట్టుబడుల నిబంధనలను అనుసరించడంలో కొన్ని సమస్యలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తూ బ్రిటన్‌లో ఒక డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన కొన్ని వారాలకే ఫిబ్రవరిలో బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను సర్వే జరిగింది.

అయితే, ఆ సమయంలో చట్ట ప్రకారమే తాము ఈ సర్వే చేపడుతున్నామని, దీనికి భారత్‌లో ప్రసారం చేయని ఆ డాక్యుమెంటరీకి ఎలాంటి సంబంధం లేదని భారత ప్రభుత్వం చెప్పింది.

ప్రస్తుతం భారత్‌లోని వివిధ బీబీసీ సర్వీసుల్లో 300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. హిందీలో బీబీసీ సేవలు 1940లో మొదలయ్యాయి.

భారత్‌లో బీబీసీ ప్రయాణానికి ఇక్కడి చరిత్రతో లోతైన అనుబంధముందని, ‘కలెక్టివ్ న్యూస్‌రూమ్’ ఏర్పాటుతో ఈ బంధం మరింతగా పెనవేసుకుంటుందని బీబీసీ న్యూస్ డిప్యూటీ సీఈవో జోనథన్ మున్రో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)