హరిద్వార్లోని మన్సా దేవి ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి

ఫొటో సోర్స్, PTI
హరిద్వార్లోని మన్సా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఈ ఆలయానికి ఆదివారం భారీగా భక్తులు పోటెత్తడంతో ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది.
మృతుల సంఖ్యను గడ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ధ్రువీకరించారు.
''ఆరుగురు చనిపోయారు. నేను ఘటనా స్థలానికి బయల్దేరాను. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది'' అని వినయ్ శంకర్ పాండే చెప్పారని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది.
గాయపడిన వారిని అంబులెన్స్లలో సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నట్లుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం: పుష్కర్ సింగ్ ధామి
ఘటనా స్థలానికి ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, ఇతర సహాయక బృందాలు చేరుకున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ట్వీట్ చేశారు.
'' హరిద్వార్లోని మన్సా దేవి మందిరంలో తొక్కిసలాట జరిగిందనే విషాద వార్త తెలిసింది. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. స్థానిక అధికారులతో నేను సంప్రదింపులు జరుపుతున్నా. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం'' అని ట్వీట్లో పేర్కొన్నారు.
ఉదయం 9 గంటల ప్రాంతంలో తమకు ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందిందని అక్కడి కలెక్టర్ మయూర్ దీక్షిత్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే..
ఘటనకు సంబంధించిన వివరాలను గాయపడిన ఓ వ్యక్తి ‘ఏఎన్ఐ’కి వివరించారు.
‘ఒక్కసారిగా భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. దాంతో తొక్కిసలాట జరిగింది. నేను కిందపడిపోయాను. నా చేయి విరిగిపోయింది’ అని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
విద్యుత్ షాక్ అనే వదంతితో..
మన్సా దేవి మందిరంలో తొక్కిసలాట జరిగిందనే సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారని ఎస్ఎస్పీ ప్రమేంద్ర సింగ్ డోబాల్ వార్తా సంస్థ ఏఎన్ఐతో అన్నారు.
''మొత్తం 35 మందిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆరుగురు చనిపోయారు. మిగతావారికి చికిత్స జరుగుతోంది. ఆలయానికి వెళ్లే దారిలోని మెట్లపై విద్యుత్ షాక్ సంభవించిందనే వదంతి వల్ల ఈ తొక్కిసలాట జరిగినట్లుగా భావిస్తున్నాం. దీనిపై దర్యాప్తు చేస్తున్నాం'' అని ఏఎన్ఐతో ప్రమేంద్ర సింగ్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














