త్రిపురలో మరొకసారి గెలిచిన బీజేపీ... నాగాలాండ్‌లోనూ కూటమిదే అధికారం

బీజేపీ కార్యకర్తలు

ఫొటో సోర్స్, ANI

ఈశాన్య భారత దేశంలోని నాగాలాండ్, త్రిపుర, మేఘాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపుగా వచ్చేశాయి.

త్రిపురలో బీజేపీ మరొకసారి గెలవగా నాగాలాండ్ ఆ పార్టీ కూటమి గెలిచింది. మేఘాలయలో మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు.

త్రిపుర:

60 సీట్లు ఉన్న త్రిపుర అసెంబ్లీలో 32 సీట్లు బీజేపీ గెలుచుకుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్కిస్ట్)‌కు 11 సీట్లు వచ్చాయి.

కాంగ్రెస్‌కు మూడు సీట్లుగా రాగా స్థానిక టీఎంపీకి 13 సీట్లు వచ్చాయి.

మరొకసారి త్రిపురలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

నాగాలాండ్:

ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్‌డీపీపీ) 25 సీట్లుగా గెలవగా దానితో పొత్తులో ఉన్న బీజేపీ 12 సీట్లు గెలిచింది.

శరద్ పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ)కి 7 సీట్లు వచ్చాయి. నాగా పీపుల్స్ ఫ్రంట్ 2, జేడీయూ 1, ఎల్‌జేపీ(రామ్‌విలాస్) 2, ఎన్‌పీపీ 5, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(అఠావాలే) 2, స్వతంత్ర అభ్యర్థులు నలుగురు గెలిచారు.

ఎన్‌డీపీపీ నేత నెఫ్యూ రియో రికార్డు స్థాయిలో 5వ సారి నాగాలాండ్ ముఖ్యమంత్రి అవుతున్నారు.

మేఘాలయ:

59 సీట్లు ఉన్న మేఘాలయ అసెంబ్లీలో సీకే సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ)కి 26 సీట్లు వచ్చాయి. యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ(యుడీపీ)కి 11 సీట్లు రాగా తృణమూల్ కాంగ్రెస్‌ 5 సీట్లు సాధించింది.

బీజేపీకి 2, వాయిస్ ఆఫ్ ది పీపుల్స్ పార్టీకి 4 సీట్లు వచ్చాయి.

ఇక్కడ ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు.

మహిళా ఎమ్మెల్యేలు

ఫొటో సోర్స్, UGC

తొలిసారి మహిళా ఎమ్మెల్యేలు

నాగాలాండ్‌కు 1963లో రాష్ట్ర హోదా వచ్చింది. ఈ ఎన్నికల్లో తొలిసారి ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. మహిళలు ఎంపీలుగా పని చేసినప్పటికీ ఎమ్మెల్యేలుగా ఎప్పుడూ గెలవలేదు.

మొత్తం 183 మంది అభ్యర్థులు పోటీ చేస్తే వారిలో నలుగురు మాత్రమే మహిళలు ఉన్నారు.

ఎన్‌డీపీపీ పార్టీ మహిళా అభ్యర్థులైన హెకానీ జఖ్లూ(దిమాపూర్-3), సలహౌతు ఒనువో(పశ్చిమ అంగామీ) గెలిచారు.

పురుషాధిపత్యం ఉండే ఆదివాసీ సమాజమైన నాగాలాండ్‌లో మహిళల విజయాన్ని చారిత్రాత్మకంగా నిపుణులు చూస్తున్నారు. నాగాలాండ్ చరిత్రలో అదొక మైలురాయి అని సీనియర్ జర్నలిస్ట్ మోనాలీసా అన్నారు.

‘‘ఇక్కడ చదువుకున్న మహిళలు ఎక్కువగా ఉన్నప్పటికీ వారిని సమాజం మగవాళ్లతో సమానంగా చూడటం లేదు. ఇప్పటికీ వారసత్వపు ఆస్తిలో మహిళలకు హక్కు లేదు. ఈ గెలుపు మార్పుకు ఒక దారిలా కనిపిస్తోంది’’ అని మోనాలీసా అన్నారు.

ప్రస్తుతం గెలిచిన ఇద్దరు మహిళల్లో ఒకరు చనిపోయిన ఎమ్మెల్యే భార్యకాగా మరొకరు లాయర్.

యునైడెట్ డెమోక్రటిక్ పార్టీ తరపున 1977లో రానో ఎం షాజియా లోక్‌సభకు గెలిచారు. పోయిన ఏడాది ఎస్ ఫాంగ్‌నన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)