టన్నెల్ ప్రమాదం: సొరంగంలో తన తోటి వారికి గబ్బర్ సింగ్ ఎలా ధైర్యం చెప్పారు, ఆయన గురించి ప్రధాని ఏమన్నారు

ఫొటో సోర్స్, ANI
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకుపోయిన 41మంది కార్మికులు క్షేమంగా బయటపడిన తరువాత వారంతా ఎలా ఉన్నారని ప్రపంచం ఆరా తీస్తోంది.
టన్నెల్లో చిక్కుకుపోయినప్పుడు వారెలా ఉన్నారు, ఇన్నిరోజులు ఎలా గడపగలిగారు? లోపల ఏం చేశారు అనే ప్రశ్నలు తలెత్తడం సహజం. వీరిలో ఒక కార్మికుడు ఏఏన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు.
మరొకరు సెల్ఫీ రూపంలో తాను ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. వారేం చెప్పారో చదవండి.
ప్ర: మీ పేరేమిటి?
జ : నా పేరు విశ్వజీత్ కుమార్ వర్మ.
ప్ర: మీరు సొరంగంలో చిక్కుకున్న 41మందిలో ఒకరా?
జ: అవును.
ప్ర: సొరంగంలో చిక్కుకున్నప్పుడు ఎలా అనిపించింది?
జ: ఏమీ తోచలేదు. సొరంగం కూలింది. భయపడ్డాం. బయటికొచ్చేందుకు దారి లేదు. నవయుగ కంపెనీ మమ్మల్ని కాపాడేందుకు ప్రయత్నించింది. మాకు ఆక్సీజన్, ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దేశ, విదేశాల నుంచి యంత్రాలను తెప్పించారు. సహాయక బృందాలు వచ్చాయి.
మమ్మల్ని రక్షించేందుకు అందరూ ప్రయత్నించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ సీఎం కూడా వచ్చారు. ప్రధానమంత్రి సహా అందరూ మమ్మల్ని బయటికి తీసుకొచ్చేందుకు కృషి చేశారు.
ప్ర: భోజనం, నీళ్లు ఎలా వచ్చాయి?
జ: లోపల చిక్కుకున్న తర్వాత 15-20 గంటలు కాస్త కంగారు పడ్డాం. తర్వాత నీళ్ల పైపు ద్వారా ఆహారం పంపించారు. 10 రోజుల తర్వాత బయటి నుంచి పైపు ఏర్పాటు చేశారు. జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, రోటీలు, అన్నం, కూర అన్నీ అందించారు. దాంతో అందరం క్షేమంగా ఉన్నాం.
ప్ర: మీ కుటుంబ సభ్యులతో మాట్లాడారా? వాళ్లు ఎలా ఉన్నారు?
జ: మావాళ్లు అందరూ బాగున్నారు. వాళ్లతో మాట్లాడాను. లోపలికి మైక్ ఇచ్చారు. దానితో మాట్లాడాను.
ప్ర: మీవాళ్లు ఇక్కడికి వచ్చారా?
జ: కుటుంబమంతా రాలేదు. నా సోదరుడు వచ్చాడు.
ప్ర : దీపావళి రోజు నుంచి మీరు సొరంగంలోనే ఉన్నారు. మీకేమనిపిస్తోంది?
జ: పర్లేదు సర్. అందరం బాగున్నాం. దీపావళిది ఏముంది, మళ్లీ చేసుకోవచ్చు. ఇప్పుడంతా ఖుషీగా ఉన్నాం.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
లోపలే ఉంటే ఏం జరిగేదో..

ఫొటో సోర్స్, ANI
ఇక సుబోధ్ కుమార్ వర్మ అనే కార్మికుడు సెల్ఫీ ద్వారా ఏం చెప్పారో చదవండి
‘‘నాపేరు సుబోధ్ కుమార్ వర్మ. ఝార్ఖండ్ నుంచి వచ్చాను. నేను కూడా ఉత్తరాఖండ్లోని సొరంగంలో చిక్కుకున్నాను. ఒకరోజు గడిచాక మాకు తినడానికి ఆహారం పంపారు. తరువాత మా కంపెనీ పైపు ద్వారా జీడీపప్పు, కిస్మిస్ లాంటి డ్రైఫ్రూట్స్ పంపారు.
పదిరోజుల తరువాత పప్పు, అన్నం, రొట్టెలు పంపారు. చిక్కుకుపోయిన మొదటిరోజంతా చాలా ఇబ్బంది పడ్డాం. మేమిప్పుడు బానే ఉన్నాం. అందరం ఆస్పత్రిలో ఉన్నాం. మీ అందరి ప్రార్థనలతో మేం బతికి బయటపడ్డాం. లోపలే ఉండి ఉంటే ఏం జరిగేదో నాకు తెలియదు. ఇప్పుడు బాగానే ఉన్నాను. అందుకే మీముందుకు రాగలిగాను.’’ అన్నారు సుబోధ్ కుమార్.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, PMO
గబ్బర్ సింగ్ ఈజ్ కింగ్
ఉత్తరాఖండ్ సొరంగం ఉదంతంలో బాగా నానుతున్న పేరు గబ్బర్ సింగ్ నేగి. ఈయనీ ప్రాజెక్ట్లో ఫోర్మెన్గా పనిచేస్తున్నారు. టన్నెల్ పాక్షికంగా కూలిపోయినప్పుడు లోపల చిక్కుకున్న 41 మందిలో ఈయన కూడా ఉన్నారు.
సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులందరూ తమ మానసిక స్థైర్యం దెబ్బతినకుండా నిరంతరం తమను ప్రోత్సహించింది గబ్బర్ సింగ్ నేగీయేనని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా కార్మికులతో మాట్లాడుతున్నప్పుడు గబ్బర్ సింగ్ నేగీని ప్రశంసించారు.
‘‘ మీ నాయకత్వ లక్షణాలకు ప్రత్యేక అభినందనలు. సంక్షోభ సమయంలో ఓ గ్రామీణ వ్యక్తి తన నాయకత్వంతో మొత్తం టీమంతటికి ఎలా సహాయకారిగా మారాడనే విషయంపై భవిష్యత్తులో ఏదైనా విశ్వవిద్యాలయం పరిశోధన చేయచ్చు’’ అంటూ మోదీ ప్రశంసించారు.
గబ్బర్ సింగ్ నేగీ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అందరు తనకు మద్దతు ఇవ్వడం సంతోషం కలిగిస్తోందన్నారు.
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మా కంపెనీ ఇలా అందరూ మా బాగోగుల గురించి అడుగుతూనే ఉన్నారు. మేమంతా కుటుంబసభ్యుల్లా కలిసి జీవించాం. నా సహచరులందరూ సొరంగంలో కష్టసమయంలో నిర్భయంగా ఉన్నారు. వారు స్థైర్యాన్ని కోల్పోలేదు అని నేగీ చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
సంతోషాన్ని మాటల్లో చెప్పలేను
సొరంగం సంక్షోభం సుఖాంతమవడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కార్మికుల కుటుంబాలన్నీ ఎంతో ఊరట పొందాయి. వారు కూడా తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు.
సారావస్తీకి చెందిన రామ్ మిలన్ కూడా టన్నెల్లో చిక్కుకున్నవారిలో ఒకరు. ఆయన కుమారుడు సందీప్ కుమార ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘‘ మాకు చాలా సంతోషంగా ఉంది. మా బంధవులు మా నాన్నను తీసుకురావడానికి ఉత్తరాఖండ్కు వెళ్ళారు. సొరంగంలోవారిని రక్షించినవారందరికీ కృతజ్ఞతలు’’ అని తెలిపారు.
మరో కార్మికుడు సంతోష్కుమార్ కూడా సారావస్తీ నుంచే వచ్చారు. ఆయన బంధువు షమిత దేవి మాట్లాడుతూ సారవస్తీ నుంచి వెళ్ళిన 8 మంది పిల్లలు టన్నెల్లో చిక్కుకుపోయారని తెలిపారు. సంతోష్ తల్లి మాట్లాడుతూ తాను తన కుమారుడితో మాట్లాడానని అతను త్వరలోనే ఇంటికి తిరిగి వస్తున్నాడని చెప్పారు.
‘‘మేమంతా సంతోషంగా ఉన్నాం. మేం దీపావళి చేసుకున్నాం. మాతోపాటు గ్రామమంతా కూడా దీపావళి చేసుకుంటోంది’’ అని చెప్పారు.
ఒడిశాలోని మయూర్భంజ్కు చెందిన కార్మికుడు ధీరేన్ నాయక్ తల్లి కూడా తమ బిడ్డను రక్షించినవారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అలాగే అస్సామ్కు చెందిన రామ్ ప్రసాద్ నార్జారీ కూడా టన్నెల్ నుంచి బయటపడినందుకు ఆనందం వ్యక్తం చేశారు.
ఈయన తండ్రి మాట్లాడుతూ ‘మా అబ్బాయితో మాట్లాడటం ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఆపరేషన్’లో పాల్గొన్న ప్రభుత్వానికి, ఇతరులకు ధన్యవాదాలు’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, PHOTO BY ARUN SANKAR/AFP VIA GETTY IMAGES
ఇదో అద్భుతం : డిక్స్
శిథిలాల నుంచి సొరంగంలో చిక్కుకున్నవారి వద్దకు మార్గం ఏర్పడగానే మొట్టమొదట ఎన్డీఆర్ఎఫ్కు చెందిన మన్మోహన్ సింగ్ రావత్ వీరి వద్దకు చేరుకున్నారు.
‘‘ నేను లోపలకు చేరుకోగానే, అక్కడి కార్మికుల మొహాలలో ఎంతో సంతోషం కనిపించింది. మేము ఎప్పటి నుంచో వీరిని రక్షిస్తామని చెపుతూనే ఉన్నాను. ఇది వారి మానసిక స్థైర్యం సడలకుండా చేసింది’’ అని చెప్పారు.
ఈ రెస్క్యూ ఆపరేషన్లో కన్సల్టెంట్ గా వ్యవహరించిన అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ మాట్లాడుతూ ఈ ఆపరేషన్లో సాయపడటాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
‘‘ నేను కూడా ఓ తండ్రిని. ఇలాంటి పరిస్థితులలో పిల్లలను తల్లిదండ్రుల వద్దకు తిరిగి పంపడమనేది నాకెంతో గౌరవప్రదమైనది. క్రిస్మస్లోపు వారు టన్నెల్ నుంచి బయటకు వచ్చేస్తారని నేను చెప్పిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఈసారి క్రిస్మస్ ముందుగానే వచ్చేసింది’’ అని ఆయన చెప్పారు.
సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించే ప్రక్రియ సాగుతునన్నిరోజులు ఆర్నాల్డ్ డిక్స్ టన్నెల్ బయట గుడి వద్ద ప్రార్థనలు జరిపేవారు.
‘‘ నా గురించి నేను దేవుడిని ఏమీ ప్రార్థించలేదు. నేను కేవలం సొరంగంలో చిక్కుకుపోయిన 41మంది గురించి, వారిని బయటకు తేవడానికి ప్రయత్నిస్తున్నవారి గురించి మాత్రమే ప్రార్థన చేశాను’’ అని ఆయన ఏఎన్ఐకు తెలిపారు.
‘‘మేమొక అద్భుతమైన బృందంగా పనిచేశాం. భారత్లో ఉత్తమమైన ఇంజినీర్లు ఉన్నారు. ఇటువంటి విజయవంతమైన శిబిరంలో నేను కూడా భాగస్వామిని కావడం గొప్పగా అనిపిస్తోంది’’
‘‘నేను ఇప్పుడు గుడికి వెళ్ళి దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ అద్భుతాన్ని మీరు చూశారో లేదో, కానీ మేం చూశాం’’ అంటూ డిక్స్ ముగించారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ఎన్నికలు: స్పీకర్గా చేస్తే ఎన్నికల్లో ఓటమి తప్పదా... పోచారం శ్రీనివాసరెడ్డి ఈ సెంటిమెంట్కు బ్రేక్ వేస్తారా?
- తెలంగాణ ఎన్నికలు: ఏడాదికి 20 రోజులు కూడా జరగని తెలంగాణ అసెంబ్లీ, ఎందుకింత తక్కువ?
- తెలంగాణ ఎన్నికలు: రైతుబంధును రూ.15 వేలకు పెంచడం సాధ్యమేనా... హామీల అమలుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తాయి?
- సింగరేణి..12 నియోజకవర్గాలలో ఓట్ల గని, మరి పార్టీల వ్యూహాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









