2008 నాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసిన దిల్లీ పేలుడు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
దిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడులో కనీసం ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనతో దేశ రాజధాని దిల్లీ సహా పొరుగు రాష్ట్రాలలో హై అలర్ట్ను ప్రకటించారు.
పేలుడుకు కారణం ఏమిటనేదీ ఇంకా విచారణ జరుగుతున్నప్పటికీ, ఈ పేలుడు తీవ్రత, జరిగిన ప్రదేశాన్ని బట్టి చూస్తే, 2000 దశాబ్దం మధ్యలో భారతదేశాన్ని కుదిపేసిన పలు బాంబు దాడుల భయాందోళనల పరిస్థితులను మళ్లీ గుర్తుకు తెస్తున్నాయి.
దిల్లీలో చివరి భారీ దాడులు 2008 సెప్టెంబర్లో జరిగాయి. రద్దీగా ఉండే మార్కెట్లలో జరిగిన వేర్వేరు వరుస బాంబు పేలుళ్ల ఘటనల్లో సుమారు 20 మంది మరణించారు. ఆ సంవత్సరం జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరులో జరిగిన ఆ తరహా పేలుళ్లకు ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూపులు, ఓ రహస్య విద్యార్థి బృందం కారణమనే ఆరోపణలు వచ్చాయి.
ఆ ఏడాది భారత్కు భయానక కాలం. 2008 సెప్టెంబర్లో బీబీసీకి రాసిన కథనంలో ‘‘ ఇలాంటి రోజులు భారతీయుల జీవితంలో సాధారణమవుతున్నాయి. 2005 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు భారత్లోని నగరాలలో జరిగిన బాంబు దాడులలో 400మందికిపైగా మరణించారు’’ అని పేర్కొన్నాను.


ఫొటో సోర్స్, REUTERS/Adnan Abidi
2008 : ఓ భయానక సంవత్సరం...
తరువాత, 2008 ముంబయి దాడులలో 166 మంది మరణించారు. సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు రాజధాని అంతటా ఆందోళనను రేకెత్తించింది. నగరమంతా భద్రతను కట్టుదిట్టం చేసేలా ప్రేరేపించింది.
అది ప్రమాదమా లేదా ఉద్దేశపూర్వక దాడా అనే విషయం పక్కన పెడితే, ఈ పేలుడు ఘటన వరుస బాంబు దాడులతో నగరాల్లో భయానక పరిస్థితులను కలిగించిన హింసాత్మక దశాబ్దాన్ని గుర్తు చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














