అమెరికా బాంబు దాడులు: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ సంభాషణ, ఇంకా ఎవరేమన్నారంటే..

ప్రధాని మోదీ, ఖమేనీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై అమెరికా దాడులు జరిపిన తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.

అమెరికా చేపట్టిన ఈ సైనిక చర్యపై ముస్లిం, అరబ్ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

సౌదీ అరేబియా నుంచి పాకిస్తాన్ వరకు పలు దేశాలు ఈ దాడులను ఖండించాయి. దౌత్యమార్గం ద్వారా ఈ ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కోరుతున్నాయి.

అయితే, ఈ దాడులపై ఏయే దేశాలు ఏ విధంగా స్పందించాయి? ఇరాన్ విదేశాంగ మంత్రి ఏమన్నారో ఈ కథనంలో చూద్దాం..

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి

ఫొటో సోర్స్, Getty Images

'ఇరాన్‌కు, అమెరికా ప్రజలకు ట్రంప్ ద్రోహం చేశారు'

తమ దేశ అణుశుద్ధి స్థావరాలపై అమెరికా చేసిన దాడుల గురించి టెలివిజన్ ద్వారా స్పందించారు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి.

ఇరాన్‌‌కు, అమెరికా ప్రజలకు.. ఇద్దరికీ ట్రంప్ ద్రోహం చేశారని అన్నారు.

'' ప్రపంచంలో, తమ ప్రాంతంలో జరిగే యుద్ధాల్లో అమెరికా ప్రమేయానికి ముగింపు పలుకుతామని చెప్పి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్, దౌత్యానికి కట్టుబడి ఉండటంలో విఫలమవ్వడం ద్వారా కేవలం ఇరాన్‌కు మాత్రమే ఆయన ద్రోహం చేయలేదు, అమెరికా ప్రజలను కూడా మోసం చేశారు.’’

‘‘ ఇజ్రాయెల్ ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికా పౌరుల జీవితాలను, వారి సంపదను దోచుకునేందుకు అలవాటుపడిన ఒక యుద్ధ నేరస్తుడి మిషన్‌కు లొంగిపోవడం ద్వారా తన సొంత ప్రజలకూ ద్రోహం చేశారు'' అని అరాగ్చి ఆరోపించారు.

2024 నవంబర్‌లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

గాజాలో నెతన్యాహు యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఆరోపించింది. కానీ, ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ కొట్టివేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోదీ

తాజా ఉద్రిక్తతలపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో మాట్లాడారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన సోషల్ మీడియా ఎక్స్‌లో ఈ మేరకు పోస్ట్ చేశారు.

''ప్రస్తుత పరిస్థితిపై చర్చించాం. తాజా ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాం. తక్షణం ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కోరాం. చర్చలు, దౌత్య మార్గాల్లో ముందుకెళ్లడం ద్వారా తిరిగి ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వం పునరుద్ధరణకు కృషి చేయాలని సూచించాం.'' అని తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా దాడులపై పాకిస్తాన్ ఏమందంటే..

ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు చేయడాన్ని పాకిస్తాన్ ఖండించింది.

ఈ దాడులను ఖండిస్తూ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌‌ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఈ ప్రాంతంలో ఉద్రిక్తత, హింస మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఐక్యరాజ్యసమితి చార్టర్ కింద తమని తాము కాపాడుకునేందుకు చట్టబద్ధమైన హక్కు ఇరాన్‌కు ఉంటుందని తెలిపారు.

ఈ ఘర్షణలకు ముగింపు పలకాలని అభ్యర్థించారు.

'' అంతర్జాతీయ చట్టానికి, ముఖ్యంగా అంతర్జాతీయ మానవతా చట్టానికి అందరూ కట్టుబడి ఉండాలి. ఈ ప్రాంతంలో నెలకొన్న సంక్షోభానికి ఉన్న ఏకైక పరిష్కారం చర్చలు, దౌత్యమే.'' అని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు.

జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా

ఫొటో సోర్స్, Getty Images

ఆందోళన వ్యక్తం చేసిన జపాన్

అమెరికా దాడులపై జపాన్ ప్రధాన మంత్రి షిగేరు ఇషిబా స్పందించారు.

ఈ పరిస్థితిపై జపాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని ఇషిబా అన్నారు.

ఇరాన్ అణు కార్యక్రమాన్ని కూడా ఆపాలన్నారాయన.

రెండు దేశాల మధ్య ఘర్షణలు పెరుగుతోన్న నేపథ్యంలో, ఈ ఘర్షణాత్మక వాతావరణాన్ని తగ్గించడమే కీలకమని చెప్పారు.

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌

ఫొటో సోర్స్, EPA

బ్రిటన్ ప్రధాని సూచన

ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు చేయడంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌ స్పందించారు.

'' అంతర్జాతీయ భద్రతకు ఇరాన్ అణు కార్యక్రమం తీవ్ర ముప్పు. అణ్వాయుధాలు తయారు చేసేందుకు ఇరాన్‌కు అసలు ఎప్పటికీ అనుమతులు ఇవ్వం. ఈ ముప్పును తగ్గించేందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది '' అని చెప్పారు.

మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితి చాలా సెన్సిటివ్‌గా ఉందని, ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని తీసుకురావడమే తమ ప్రాధాన్యం అని తెలిపారు.

అణు ఒప్పందంపై తిరిగి చర్చలు ప్రారంభించాలని ఇరాన్‌కు బ్రిటన్ ప్రధాని సూచించారు.

ఈ సంక్షోభానికి ముగింపు పలికేందుకు ఇరాన్ దౌత్య పరిష్కారాన్ని కనుగొనాలన్నారు.

అరబ్ దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

అరబ్ దేశాలు ఏమన్నాయి?

వాషింగ్టన్‌కు, తెహ్రాన్‌కు మధ్య మధ్యవర్తిత్వం వహించిన ఒమన్.. ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులను ఖండించింది.

అమెరికాతో బలమైన భద్రతా సంబంధాలను కలిగి ఉన్న సౌదీ అరేబియా సైతం.. ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని ఖండించింది. సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పింది.

ఈ అత్యంత సున్నితమైన పరిస్థితుల నేపథ్యంలో ఒక రాజకీయ పరిష్కారానికి వచ్చేందుకు తమ ప్రయత్నాలను రెట్టింపు చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది.

ప్రస్తుత ప్రమాదకర ఉద్రిక్తతలు స్థానికంగా, అంతర్జాతీయంగా వినాశకరమైన పరిణామాలకు దారితీస్తాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అన్ని వర్గాలు ఈ సమయంలో సంయమనం పాటిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)