హైదరాబాద్-పాశమైలారం పేలుడు: కనిపించకుండా పోయిన తమ వారి కోసం వెతుక్కుంటున్న బంధువులు

ఫొటో సోర్స్, UGC
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.
అక్కడి సిగాచీ కెమికల్స్ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 12 మంది చనిపోయినట్లు తెలుస్తోందని రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
ప్రమాద ప్రాంతంలో ఇంకా పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఉన్నట్లు అక్కడి పరిస్థితులను బట్టి బీబీసీ బృందానికి అర్ధమైంది.
ఈ పేలుడు కారణంగా మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.


ఫొటో సోర్స్, UGC
కుప్పకూలిన భవనం
పేలుడు తీవ్రతకు ఒక భవనం పూర్తిగా కుప్పకూలగా సమీపంలోని మరో భవనం దెబ్బతింది.
పేలుడు ధాటికి అక్కడున్న కార్మికులు చాలా దూరం ఎగిరిపడినట్టు కొందరు వర్కర్స్ మీడియాతో చెప్పారు.
ప్రమాదంలో గాయపడినవారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు హుటాహుటిన తరలించారు.
రియాక్టర్ పేలడం, భారీ మంటల కారణంగా రసాయనాల వాసన, పొగ చుట్టుపక్కలంతా వ్యాపించింది.
దీంతో ఇబ్బందులు పడుతున్నామని సమీప ప్రాంతాల్లో నివసిస్తున్నవారు చెబుతున్నారు.
పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














