ఫిలిప్పీన్స్‌: కోడి పందేల నిర్వాహకుల కిడ్నాప్.. అనుమానితులపై కేసులు

కోడిపందేలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కేథరిన్ ఆర్మ్‌స్ట్రాంగ్
    • హోదా, బీబీసీ న్యూస్

ఫిలిప్పీన్స్‌లో కోడి పందేల నిర్వాహకులను కిడ్నాప్ చేశారు. దీంతో అనుమానితులైన ఆరుగురిపై అభియోగాలు నమోదయ్యాయి.

రాజధాని మనీలాలో జనవరిలో కోడి పందేలు నిర్వహించడానికి వెళుతున్న వారు అకస్మాత్తుగా కిడ్నాప్‌నకు గురయ్యారు.

ఆ దేశంలో కోళ్ల పందేలు చాలా పాపులర్. ఈ అనుమానాస్పద కిడ్నాప్ ఘటన ఉలిక్కిపడేలా చేసింది.

కోవిడ్ తర్వాత కోడి పందేల పోటీలను ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయించడం ద్వారా వచ్చిన పన్నులే అక్కడి ప్రభుత్వానికి ఆర్థిక ఊతమిచ్చాయి.

అయితే ఫిలిప్పీన్స్‌ అప్పటి అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టే మాత్రం ఈ ఆన్‌లైన్ పోటీలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అదే సమయంలో సంప్రదాయ కోడి పందేలను తిరిగి ప్రారంభించేలా అనుమతులు మంజూరు చేశారు.

Rodrigo Duterte

ఫొటో సోర్స్, Getty Images

అయితే అభియోగాలు ఎదుర్కొన్న ఆరుగురు మాత్రం కిడ్నాప్ ఆరోపణలను కొట్టిపారేశారు.

కోడి పందేలపై ఎక్కువ ఆసక్తి చూపించే ఓ వ్యక్తిని 2021 ఆగస్టులో ముగ్గురు మాజీ పోలీసు అధికారులు అపహరించినట్లు కూడా అభియోగాలున్నాయని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.

అయితే ఆ బాధిత వ్యక్తి నకిలీ బెట్టింగ్ నడుపుతున్నట్లు ఆరోపణలు వచ్చినట్లు ఏఎఫ్‌పీ చెప్పింది.

ఈ రంగంలో దాదాపు 27 మంది కనిపించకుండా పోయిన తర్వాత ఈ కేసులు నమోదయ్యాయి.

కాగా, వారందరి ఆచూకీ బతికుండగానే కనుక్కుంటారనే ఆశలు కనిపించడం లేదు.

జస్టిస్ సెక్రటరీ జీసస్ రెముల్లా మాట్లాడుతూ.. '' వారిని నేను తప్పిపోయిన కోడి పందేల నిర్వాహకులుగా కాకుండా, చనిపోయిన కోడి పందేల నిర్వాహకులుగా పిలవాలనుకుంటున్నా'' అని అన్నారు.

Cockfighting Philippines

ఫొటో సోర్స్, Getty Images

ఫిలిప్పీన్స్‌లో కోడి పందేలు పెద్ద సంఖ్యలో జనాలను ఆకర్షిస్తాయి.

పందెంలో ఏ కోడి చివరి వరకు పోరాడి గెలుస్తుందనే దానిపై అధిక మొత్తంలో పందెం కాస్తారు. కోడి కాళ్లకు పదునైన కత్తులు కడుతారు.

కాగా, ఈ క్రీడపై పలు దేశాల్లో నిషేధం ఉంది. అయితే కోవిడ్ నేపథ్యంలో పోటీలను ఆన్‌లైన్‌లోకి నిర్వహించడంతో ఫిలిప్పీన్స్‌లో మరింత ప్రజాదరణ పొందింది. 

కోడి పందేల పోటీల వ్యసనం, దానిలో జరిగే హింస తదితర కారణాల దృష్ట్యా ఆన్‌లైన్ పోటీ "ఇ-సబాంగ్"ని నిషేధించాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. ఈ డిమాండ్‌ను అప్పటి ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టే వ్యతిరేకించారు.

పందేల నిర్వహణతో ప్రభుత్వానికి దాదాపు రూ. 94 కోట్లు పన్నుల రూపంలో వచ్చేవని, అది ప్రభుత్వ ఆర్థిక వనరులను భర్తీ చేయడంలో సాయపడిందని అంగీకరించారు.

రోడ్రిగో జూన్‌లో పదవి నుంచి దిగిపోవడానికి ముందు ప్రత్యక్ష ప్రసార పోటీలను నిషేధించారు. సంప్రదాయ కోడిపందేలు తిరిగి ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)