హెచ్‌ఐవీ: క్యాన్సర్‌కు చికిత్స చేస్తే ఎయిడ్స్ పూర్తిగా తగ్గిపోయింది.. ప్రపంచంలోనే హెచ్ఐవీ నుంచి విముక్తి పొందిన నాలుగో రోగి

హెచ్ఐవి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జేమ్స్ గల్లఘర్
    • హోదా, హెల్త్, సైన్స్ ప్రతినిధి

1988 నుంచి నుంచి హెచ్ఐవీతో బాధపడుతున్న ఓ ఎయిడ్స్ రోగి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారని డాక్టర్లు చెబుతున్నారు. హెచ్ఐవీ నుంచి పూర్తిగా కోలుకున్న వారిలో ఈయన నాలుగో వ్యక్తని వైద్యులు చెబుతున్నారు. ఆయన వయసు 66 ఏళ్లు.

రోగి కోరిక మేరకు ఆయన వివరాలు గోప్యంగా ఉంచారు. ప్రస్తుతం ఈయన హెచ్ఐవీకి చికిత్స కానీ, ఔషధాలు కానీ తీసుకోవడం లేదు.

ఆయనకు బ్లడ్ క్యాన్సర్ సోకడంతో బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఈ బోన్ మారోను వైరస్‌కు సహజ నిరోధక శక్తి కలిగిన మరొకరు దానం చేశారు.

ఆయన శరీరంలో హెచ్ఐవి పూర్తిగా మాయమవడాన్ని చాలా గొప్ప విషయంగా భావిస్తున్నట్లు చెప్పారు.

కాలిఫోర్నియాలోని డుఆర్ట్‌లో చికిత్స చేసిన తర్వాత ఆయనను "సిటీ ఆఫ్ హోప్" పేషెంట్ అని పిలవడం మొదలుపెట్టారు.

ఆయన స్నేహితులు చాలా మంది హెచ్ఐవీతో మరణించారు. అయితే, ఆయుః ప్రమాణాలను పెంచే యాంటీ రెట్రో వైరల్ ఔషధాలు అప్పటికి అందుబాటులోకి రాలేదు.

"ఈ రోజు చూస్తానని అనుకోలేదు"

హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవి) శరీరంలోని రోగ నిరోధక శక్తిని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇది ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్)కు దారి తీసి ఇన్ఫెక్షన్‌తో పోరాడేందుకు శరీరం ఇబ్బంది పడుతుంది.

"నాకు 1988లో హెచ్ఐవి సోకిందని తెలిసినప్పుడు చాలా మంది మాదిరిగానే ఇది నా మరణ శిక్ష అని అనుకున్నాను" అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

"హెచ్ఐవి నా శరీరం నుంచి పూర్తిగా మాయమైపోయిన ఇలాంటి రోజును చూస్తానని ఊహించలేదు" అని అన్నారు.

అయితే, ఆయనకు హెచ్ఐవి కోసం చికిత్స చేయలేదు. ఆయనకు 63 ఏళ్ల వయసులో బ్లడ్ క్యాన్సర్ సోకింది.

ఆయనకు క్యాన్సర్ రక్త కణాలను మార్చేందుకు బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ అవసరమని వైద్యుల బృందం గుర్తించింది. ఆయనకు బోన్ బారో దానం చేసిన వ్యక్తి హెచ్ఐవికి సహజ రోగ నిరోధక శక్తి కలిగి ఉండటం అనుకోకుండా జరిగింది.

హెచ్ఐవి వైరస్ (సిసిఆర్5 అనే ప్రోటీన్) శరీరంలోని తెల్ల రక్త కణాలలోకి అతి సూక్ష్మమైన మార్గం ద్వారా ప్రవేశిస్తుంది.

కానీ, కొన్ని సార్లు అవయవ దాతలకు కూడా సిసిఆర్ 5 మ్యుటేషన్‌లు ఉంటాయి.

వీడియో క్యాప్షన్, ఇక్కడ హెచ్‌ఐవీ బాధితులకే పెళ్లి సంబంధాలు చూస్తారు!

బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తర్వాత సిటీ ఆఫ్ హోప్ రోగిని జాగ్రత్తగా పర్యవేక్షించారు. ఆయన శరీరంలో హెచ్ఐవి వైరస్ జాడ పూర్తిగా మాయమైనట్లు వైద్యులు గుర్తించారు.

ఆయనకు 17 నెలలుగా హెచ్ఐవి నుంచి పూర్తిగా ఉపశమనం లభించింది.

"ఆయన హెచ్ఐవి నుంచి విముక్తి చెందారని, 30 ఏళ్లకు పైగా తీసుకుంటున్న యాంటీ రెట్రోవైరల్ చికిత్స ఇకపై తీసుకోనవసరం లేదని చెప్పడానికి మాకు చాలా ఉత్సాహంగా అనిపించింది" అని సిటీ ఆఫ్ హోప్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డాక్టర్ జానా డిక్టర్ చెప్పారు.

2011లో ప్రపంచంలో హెచ్ఐవి నుంచి పూర్తిగా కోలుకున్న తొలి వ్యక్తి గా టిమోథీ రే బ్రౌన్ నిలిచారు. ఆయనను బెర్లిన్ పేషెంట్ అని పిలుస్తారు.

గత మూడేళ్ళలో హెచ్ఐవి నుంచి మరో ముగ్గురు విముక్తి చెందారు.

సిటీ ఆఫ్ హోప్‌లో రోగి మాత్రం హెచ్ఐవితో సుదీర్ఘ కాలంగా బ్రతుకుతున్న వ్యక్తి అని చెప్పవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 38 మిలియన్ హెచ్ఐవి రోగులకు బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్లు హెచ్ఐవి చికిత్సలో విప్లవాత్మక మార్పులు తెస్తాయని చెప్పేందుకు లేదు.

"ఇది చాలా ప్రతికూల ప్రభావాలతో కూడిన క్లిష్టమైన ప్రక్రియ. హెచ్ఐవి తో బాధపడుతున్న వారందరికీ ఇది తగిన చికిత్స కాదు" అని డాక్టర్ డిక్టర్ చెప్పారు.

కానీ, జీన్ థెరపీ ద్వారా సిసిఆర్-5 ప్రవేశ మార్గాన్నిలక్ష్యం చేసుకునేందుకు అధ్యయనకారులు చూస్తున్నారు.

ఈ కేసును కెనడాలోని మాంట్రియల్‌లో జరిగిన ఎయిడ్స్ 2022 సమావేశంలో తెలిపారు.

"హెచ్ఐవి నుంచి కోలుకునేందుకు పూర్తి చికిత్సను కనిపెట్టడం హెచ్ఐవి పరిశోధనలో ఇంకా మిగిలే ఉంది" అని ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ షారోన్ ల్యూయిన్ అన్నారు.

"గతంలో కొన్ని కేసుల్లో హెచ్ఐవి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇలాంటి కేసులు హెచ్ఐవితో బాధపడుతున్న వారికి కొంత ఆశను, శాస్త్రీయ సమాజానికి కొంత స్ఫూర్తిని కలిగించాయి" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)