ఈజిఫ్ట్: తేళ్లు కుట్టడంతో ముగ్గురు మృతి, వందల మంది ఆస్పత్రి పాలు - Newsreel

భారీ వర్షాలు వచ్చినపుడు తేళ్లు తరచూ వీధుల్లోకి చేరతాయి. అవి ఇళ్లలోకి కూడా వచ్చేస్తుంటాయి.

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారీ వర్షాలు వచ్చినపుడు తేళ్లు తరచూ వీధుల్లోకి కొట్టుకొస్తాయి, అవి ఇళ్లలోకి కూడా వచ్చేస్తుంటాయి.

ఈజిఫ్టులోని అస్వాన్ నగరంలో భారీ తుఫాను తర్వాత వీధుల్లోకి కొట్టుకొచ్చిన తేళ్లు ఇళ్లలోకి చేరుకున్నాయి.

ఈ తేళ్లు కుట్టడంతో ముగ్గురు చనిపోయారని, 450 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు చెప్పారు.

ముఖ్యంగా నైలు నదికి సమీపంలో శుక్రవారం వడగళ్లు, ఉరుములతో వచ్చిన తుఫాను హింసాత్మకంగా మారింది.

భారీ వర్షాలు వచ్చినపుడు తేళ్లు తరచూ వీధుల్లోకి కొట్టుకొస్తుంటాయి. పాములు కూడా కనిపిస్తుంటాయి.

పర్వతాలు, ఎడారులకు దగ్గరగా ఉన్న గ్రామాల్లోని వైద్య కేంద్రాలకు యాంటీ వీనమ్ అదనపు డోసులను అందించామని ఒక అధికారి అల్-అహ్రమ్ న్యూస్ ఏజెన్సీకి చెప్పారు.

తేళ్లు కుట్టడంతో ఆస్పత్రులకు వస్తున్న వారికి వైద్య చికిత్స అందిస్తున్న డాక్టర్లు ప్రస్తుతం కరోనా టీకాలు ఇవ్వడం నిలిపివేశారు.

జనం ఇళ్లలోనే ఉండాలని చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం కోరింది.

ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ఫాట్ టెయిల్డ్ స్కార్పియన్లకు ఈజిఫ్టు ఆవాసం. నల్ల ఫాట్ టెయిల్ తేలు మనిషిని కుడితే ఆ విషం గంటలోపే వారి ప్రాణం తీయగలదు.

విస్తృతమైన విష ప్రభావాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండరాలు నలిపేసినట్లు ఉండడం, తలలో ఇబ్బందిగా ఉండడం లాంటివి ఉంటాయి.

లక్షణాలు పెరగక ముందే నివారణ కోసం యాంటీ వీనమ్ ఇవ్వవచ్చు. కానీ, లక్షణాలు తీవ్రంగా ఉన్నా అది పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)