కాప్26: ఊహించని ప్రకటన చేసిన అమెరికా, చైనా.. ఈయూ, యూఎన్, గ్రీన్‌పీస్ ఏమన్నాయంటే..

వాతావరణాన్ని మెరుగుపరచాలంటూ నిరసనలు చేస్తున్న ఉద్యమకారులు

ఫొటో సోర్స్, EPA

పర్యావరణం, వాతావరణాన్ని మెరుగుపరిచే విషయంలో తమ వంతు సహకారం అందిస్తామని అమెరికా, చైనా దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. ఈ మేరకు తీర్మానం చేస్తూ గ్లాస్గోలో జరుగుతున్న కాప్26 సమావేశంలో బుధవారం ప్రకటన చేశాయి.

ఊహించని ఈ తీర్మానాన్ని ఉద్యమకారులు, రాజకీయ నాయకులు స్వాగతించారు. అయితే, దీనిని కాస్త జాగ్రత్తగా పరిశీలించాలని ఉద్యమకారులు అభిప్రాయపడ్డారు.

ఇరు దేశాలు తీసుకున్న ఈ చర్య చాలా ముఖ్యమైనదంటూ, ఇది ప్రోత్సాహకరమైన అడుగు అని యూరోపియన్ యూనియన్, యూఎన్ వ్యాఖ్యానించాయి.

అయితే, ఈ రెండు దేశాలూ మరింత నిబద్ధతను ప్రదర్శించాలని గ్రీన్ పీస్ పేర్కొంది.

ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాల్లో అమెరికా, చైనా ఉన్నాయి.

2015 పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు ఇరు దేశాలూ కలిసి పని చేస్తామని చెప్పాయి.

అంతర్జాతీయ ఉష్ణోగ్రతలను 1.5 సెంటీగ్రేడు ఉష్ణోగ్రతలకు తగ్గించడం ద్వారా మానవాళిని దారుణమైన వాతావరణ ప్రభావాలకు లోను కాకుండా తప్పించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దీనికి సంబంధించిన చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చే వారం మొదట్లో వర్చ్యువల్‌గా సమావేశం అయ్యే అవకాశం ఉంది.

గత 10 నెలలుగా జరిగిన సుమారు 30 సమావేశాల తరువాత ఈ ప్రకటన చేసినట్లు చైనా క్లైమేట్ రాయబారి చెప్పారు.

ఊహించని ప్రకటనకు సానుకూల స్పందన లభించింది. కానీ, ఈ హామీలను నిలబెట్టుకునేందుకు పటిష్టమైన చర్యలు వెంటనే తీసుకోవాలని నిపుణులు, ఉద్యమకారులు సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)