పాకిస్తాన్‌: ఫ్రీగా బర్గర్లు ఇవ్వలేదని రెస్టారెంట్‌ సిబ్బందిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫ్రీ బర్గర్స్ ఇవ్వలేదని అరెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

బర్గర్లు ఉచితంగా ఇవ్వలేదని పాకిస్తాన్ పోలీసులు ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌లోని మొత్తం 19 మంది సిబ్బందిని అరెస్ట్ చేశారు.

శనివారం రాత్రి ఒంటిగంటకు లాహోర్‌లోని జానీ అండ్ జుగ్నూ చెయిన్ రెస్టారెంట్ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

"మా రెస్టారెంట్‌ దగ్గర ఇలాంటివి జరగడం కొత్తేం కాదు" అని ఆ రెస్టారెంట్ చెయిన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ ఘటనకు పాల్పడిన 9మంది పోలీసులను సస్పెండ్ చేశారు. వారిని సస్పెండ్ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఇనామ్ ఘనీ ట్విటర్‌లో ప్రకటించారు.

"చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరినీ అనుమతించం. అన్యాయాన్ని సహించేది లేదు. వారు ఎవరైనా శిక్ష తప్పదు" అని అన్నారు.

రెండ్రోజుల క్రితం తమ రెస్టారెంట్‌కు వెళ్లిన కొంతమంది పోలీసులు ఉచితంగా బర్గర్లు ఇవ్వాలని అడిగారని జానీ అండ్ జుగ్నూ రెస్టారెంట్ ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటన పోస్ట్ చేసింది.

"వాళ్లకు అది మామూలైపోయింది. ఉచితంగా ఇవ్వడం కుదరదని చెప్పాం. మా మేనేజర్లను బెదిరించి పోలీసులు వెళ్లిపోయారు. నిరాధార వాదనలతో మా సిబ్బందిని మరింత వేధించడానికి, వారిపై ఒత్తిడి తేవడానికి తర్వాత రోజు వాళ్లు మళ్లీ వచ్చారు" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

"జూన్ 11న కొంతమంది పోలీసులు మా అవుట్‌లెట్‌కు వచ్చారు. మా మేనేజర్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. మా బ్రాంచ్ మొత్తం ఖాళీ చేయించారు. మిగతా మేనేజర్లతో సహా మా కిచెన్ స్టాఫ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు" అని తెలిపింది.

కిచెన్ మూసేయడానికి తమ సిబ్బంది ఒప్పుకోలేదని, ఆ సమయంలో స్టవ్‌లు మండుతూనే ఉన్నాయని, కస్టమర్లు తమ ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్నారని వివరించింది.

"మా సిబ్బందిని ఏడు గంటలపాటు నిర్బంధించారు. పోలీసులు తమను వేధించారని, చుట్టూ తోస్తూ మాట్లాడారని... బర్గర్లు ఉచితంగా ఇవ్వలేదనే ఇదంతా చేశారని వారు మాకు చెప్పారు" అని రెస్టారెంట్ చెయిన్ చెప్పింది.

పంజాబ్ ప్రాంత పోలీసు దళాలను సంస్కరించాలని గతంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. అక్కడ పోలీస్ స్టేషన్లలో స్థానిక రాజకీయ నాయకులు తమ వాళ్లను నియమించుకున్నారని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)