సూయజ్‌ కాలువ: ఎవర్ గివెన్‌ నౌకకు కొత్త కష్టాలు.. అక్కడి నుంచి కదలాలంటే వందల కోట్ల జరిమానా కట్టాలన్న ఈజిప్ట్

సూయజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సూయజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక

సూయజ్ కాలువకు అడ్డంగా ఇరుక్కుపోయిన ఎవర్ గివెన్ నౌక మళ్లీ కదలగానే కథ సుఖాంతమైందని అనిపించింది.

కీలకమైన అంతర్జాతీయ వాణిజ్య జల మార్గాల్లో ఒకటైన సూయజ్ కాలువ నుంచి ఎవర్ గివెన్ నౌకను మార్చి చివరలో విజయవంతంగా కదిలించగానే ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది.

కానీ దాని వల్ల ఆ నౌక యజమానులను వచ్చిన కష్టాలు మాత్రం ఇప్పట్లో తీరేలా లేవు.

ఎందుకంటే, ఎవర్ గివెన్ నౌకను విడుదల చేయకూడదని ఈజిఫ్ట్ నిర్ణయించింది.

ప్రస్తుతం దాన్ని తమ దేశంలోని గ్రేట్ బిట్టెర్ లేక్‌లో లంగరు వేసి ఉంచింది.

ఎవర్ గివెన్ నౌక.. సూయజ్‌ కాలువకు అడ్డంగా వారం పాటు నిలిచిపోవడంతో తమకు నష్టాలు వచ్చాయని, ఒక బిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించేవరకూ దానిని వదిలేది లేదని ఈజిఫ్ట్ చెబుతోంది.

ఆ నౌక ఇరుక్కోవడంపై విచారణ పూర్తై, నష్ట పరిహారం చెల్లించేవరకూ అది ఇక్కడే ఉంటుంది" అని సూయజ్ కెనాల్ అథారిటీ అధ్యక్షుడు ఒసామా రబీ ఈజిఫ్ట్ జాతీయ చానల్‌కు చెప్పారు.

సూయజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక

ఫొటో సోర్స్, Getty Images

"మేం త్వరగా డీల్ చేసుకోవాలని చూస్తున్నాం. వాళ్లు పరిహారానికి ఒప్పుకున్న మరుక్షణమే ఆ నౌక ఇక్కడ నుంచి కదలడానికి అనుమతిస్తాం" అన్నారు.

నష్ట పరిహారం గురించి మాట్లాడిన రబీ, ఎవర్ గివెన్ ఇరుక్కుపోవడం వల్ల తమకు వచ్చిన నష్టం, ఇసుకను తవ్విన డ్రెడ్జింగ్ మెషిన్లకు అయిన ఖర్చు మొత్తాన్నీ కలిపి ఏప్రిల్ మొదట్లో లెక్కలు వేశామన్నారు.

"అదంతా కలిపి దాదాపు 1 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువే ఉండచ్చు. దాన్ని అడిగే హక్కు ఈజిఫ్టుకు ఉంది" అన్నారు.

కాలువలో రాకపోకలు ఆగడం వల్ల నష్టపోయిన రుసుములు, నౌకను మళ్లీ తేలేలా చేయడానికి జరిగిన తవ్వకాల వల్ల కాలువకు జరిగిన నష్టం, ఆ పనులు చేసిన మెషిన్లు, పరికరాలకు అయిన ఖర్చు అన్నింటికీ ఈజిఫ్ట్ లెక్కలు వేసింది.

నౌక అడ్డంగా ఇరుక్కుపోయినందుకు పరిహారం చెల్లించాలని తమకు ఎలాంటి అధికారిక క్లెయిమ్ లేదా లీగల్ డిమాండ్ రాలేదని ఎవర్ గివెన్ నౌక యజమాని, జపాన్‌కు చెందిన షోయీ కిసెన్ సంస్థ చెప్పింది.

కానీ జరిగిన నష్టాన్ని తాము గుర్తించామని, కాలువ అధికారులతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది.

సూయజ్ కెనాల్ అథారిటీ అధ్యక్షుడు ఒసామా రబీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సూయజ్ కెనాల్ అథారిటీ అధ్యక్షుడు ఒసామా రబీ

నౌక ఎందుకు చిక్కుకుంది

కాలువ ఒడ్డున ఎవర్ గివెన్ నౌక ఎందుకు చిక్కుకుపోయిందో మరిన్ని ఆధారాలు సంపాదించడానికి చేస్తున్న విచారణ ఇంకా పూర్తికాకముందే సూయజ్ కెనాల్ అథారిటీ అధ్యక్షుడు ఒసామా రబీ కొన్ని ప్రకటనలు చేశారు.

బలమైన గాలుల వల్లే అది అలా ఇరుక్కుందని మొదట అనుకున్నారు. కానీ ఇప్పుడు దానికి ఏమైనా టెక్నికల్, లేదా మానవ తప్పిదాలే కారణమా అనేది పరిశోధకులు తనిఖీ చేస్తున్నారు.

"వాతావరణం సరిగా లేకపోవడం వల్ల కాలువను మేం ఎప్పుడూ మూసేయలేదు. నౌక సైజు కూడా దానికి కారణం కాదు. ఎవర్ గివెన్ కంటే పెద్ద నౌకలు కూడా ఆ కాలువను దాటి వెళ్లాయి" అని రబీ చెప్పారు.

ప్రపంచంలోని ప్రధాన జలమార్గాల్లో ఒకటైన సూయజ్ కాలువలో సముద్రాల ద్వారా జరిగే మొత్తం వాణిజ్యంలో 12 శాతం జరుగుతుంది.

సూయజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక చిక్కుకోవడం వల్ల, ఆ దారిలో వెళ్లే చాలా ఓడల ప్రయాణం ఆలస్యం అయింది. ఆ ప్రభావం కొన్ని లక్షల మందిపై పడింది.

వీడియో క్యాప్షన్, సూయజ్‌ కాలువ: భారీ నౌకను ఇలా దారికి తెచ్చారు

ఈ కాలువ నుంచి ప్రతి రోజూ దాదాపు 20 లక్షల బ్యారెళ్ల చమురు, దాదాపు 8శాతం ఎల్పీజీ రవాణా అవుతుంది. దాంతో, ఎవర్ గివెన్ వల్ల ఆ ఉత్పత్తుల ధరలపై తీవ్ర ప్రభావం పడింది.

దీనికితోడు ఎవర్ గివెన్ కాలువలో ఉన్నప్పుడు అటూ ఇటూ 360కి పైగా నౌకలు నిలిచిపోయాయని ఒక అంచనా. వాటిలో సరకు రవాణా నౌకలు, చమురు, నేచురల్ గ్యాస్ టాంకర్లు ఉన్నాయి.

"నౌక కాలువ ఒడ్డున ఇరుక్కుపోవడం వల్ల ఈ మార్గంపై తీవ్ర ప్రభావం పడింది. కాలువకు ప్రతిరోజూ 14 నుంచి 15 మిలియన్ డాలర్ల నష్టం తెచ్చిపెట్టింది" అని సూయజ్ కెనాల్ అథారిటీ అధ్యక్షుడు ఒసామా రబీ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)