సూయజ్‌ కాలువలో ఎవర్ గివెన్‌ నౌక ఇరుక్కుపోవడానికి కారణం ఈమేనంటూ ప్రచారం.. అసలు నిజమేంటి

MARWA ELSELEHDAR

ఫొటో సోర్స్, MARWA ELSELEHDAR

గత నెలలో ఒక చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు మార్వా ఎల్సెలెదార్.

మార్చ్‌లో ఎవర్ గివెన్ అనే భారీ నౌక సూయజ్‌ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయింది.

దాంతో సూయజ్ కాలువ జల మార్గంలో సరుకు రవాణా నిలిచిపోయింది.

న్యూస్ చానెళ్లు, మీడియాలో ఈ వార్త ప్రముఖంగా వచ్చింది.

ఆ సమయంలో తన ఫోన్ చెక్ చేసుకున్న మార్వా ఆశ్చర్యపోయింది.

ఎందుకంటే.. సూయజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక అడ్డంగా ఇరుక్కుపోవడానికి మార్వానే కారణమంటూ ఆన్‌లైన్‌లో పుకార్లు చక్కర్లు కొట్టాయి.

వాటిని చూసిన తర్వాత షాకయ్యానని చెప్పారు మార్వా.

ఆమె ఈజిప్ట్‌లో తొలి మహిళా షిప్ కెప్టెన్.

సూయజ్‌ కెనాల్‌

ఫొటో సోర్స్, CNES2021, DISTRIBUTION AIRBUS DS

ఆ సమయంలో మార్వా ఎక్కడున్నారు?

సూయజ్ కాలువలో భారీ నౌక ఇరుక్కుపోయిన సమయంలో మార్వా వందలాది కిలోమీటర్ల దూరంలో అలెగ్జాండ్రియాలో Aida-4 నౌకలో విధులు నిర్వహిస్తున్నారు.

ఈ నౌక ఈజిప్ట్ మారీటైమ్ సేఫ్టీ అథారిటీకి చెందినది.

ఎర్ర సముద్రంలో ఉన్న లైట్‌హౌజ్‌కి సరుకులు రవాణా చేస్తుంటుంది.

అరబ్ లీగ్ నడుపుతున్న అరబ్ అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ మారీటైమ్ ట్రాన్స్‌పోర్ట్‌ సిబ్బందికి శిక్షణ ఇస్తుంటుంది.

సూయజ్‌ కాలువలో నౌక ఇరుక్కుపోవడానికి మార్వానే కారణమంటూ ఆమె ఫొటోతో సహా స్క్రీన్ షాట్లు పెట్టి మరీ ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు.

MARWA ELSELEHDAR

ఫొటో సోర్స్, MARWA ELSELEHDAR

పాత ఫొటోతో ఫేక్ న్యూస్ ప్రచారం

ఈజిప్ట్ తొలి మహిళా షిప్ కెప్టెన్‌గా నిలిచిన మార్వా గురించి ఒక ప్రముఖ అరబ్ న్యూస్.. మార్చి 22న ఒక కథనం రాసింది.

అందులో వాడిన మార్వా ఫొటోనే మార్ఫింగ్ చేసి ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారని భావిస్తున్నారు.

ఎవర్ గివెన్ నౌక ఘటనలో తన ప్రమేయం ఉందంటూ మార్వా పేరుతో ఉన్న అనేక ట్విటర్ ఖాతాలు కూడా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశాయి.

అయితే, మొదట ఈ వార్త ఎక్కడ మొదలైందో.. ఎవరు, ఎందుకు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారో తనకు తెలియదని బీబీసీతో చెప్పారు మార్వా.

నేను ఈ రంగంలో విజయం సాధించాను. అందుకే కొందరు నన్ను టార్గెట్ చేసి ఉండొచ్చు. కానీ అసలు కారణం ఏమిటో నాకు తెలియదు అని మార్వా అన్నారు.

సూయజ్ కాలువ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఈ ఫొటోలో ఎడమవైపు పైభాగంలో ఎవర్ గివెన్ నౌక ఇరుక్కుపోయి ఉండడం మీరు చూడొచ్చు. ఇక కుడివైపున నీటిలో చాలా ఓడలు నిలిచిపోయి ఉండటం కూడా మీరు గమనించొచ్చు.

ఎవర్ గివెన్‌ నౌక ఘటనపై ఇప్పటికే ఈజిప్ట్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

దాదాపు వారం రోజుల తర్వాత నౌకను కాలువకు అడ్డు లేకుండా చేయగలిగారు.

ప్రపంచ జలమార్గ వాణిజ్యానికి సూయజ్ కాలువను వెన్నెముకగా చెబుతుంటారు. ప్రధాన జల మార్గాల్లో ఇది ఒకటి.

ప్రపంచ వాణిజ్యంలో 12శాతం సరుకు రవాణా దీని ద్వారానే జరుగుతోంది.

The Ever Given on the move

ఫొటో సోర్స్, Reuters

సూయజ్ కెనాల్ ఎందుకంత కీలకం?

సూయజ్ కాలువ 193 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.

ఇది మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రంతో కలుపుతుంది.

ఆసియా, యూరప్ మధ్య దగ్గరి జలమార్గం ఇదే.

ఈ కాలువ ఈజిఫ్టులోని సూయజ్ ఇస్థమస్(జలసంధి)ని దాటి వెళ్తుంది.

ఈ కాలువలో మూడు సహజ సరస్సులు కూడా ఉన్నాయి.

1869లో ఈ కాలువలో రాకపోకలు మొదలయ్యాయి. వాణిజ్యానికి ఇది చాలా కీలకం.

దీనిని తవ్వక ముందు ప్రపంచంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి వచ్చిపోయే నౌకలు దక్షిణాఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ప్రయాణించేవి.

కానీ ఈ జలమార్గం నిర్మించిన తర్వాత ఆసియా, యూరప్ నౌకలన్నీ పశ్చిమాసియాలోని ఈ జలమార్గం నుంచే వెళ్తున్నాయి.

వరల్డ్ మారీటైమ్ ట్రాన్స్‌పోర్ట్ కౌన్సిల్ వివరాల ప్రకారం ఈ కాలువ తవ్వడం వల్ల యూరప్‌ వెళ్లే ఆసియా నౌకల ప్రయాణంలో 9వేల కిలోమీటర్ల దూరం తగ్గింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)