కశ్మీర్: ఎల్‌వోసీ వద్ద ‘ఆజాది మార్చ్’ను అడ్డుకున్న పాకిస్తాన్ సైన్యం

ఎల్‌వోసీ వైపు మార్చ్ చేస్తున్న స్థానికులు

ఫొటో సోర్స్, MA Jarral/BBC

    • రచయిత, ఎంఏ జరల్
    • హోదా, పాక్ పాలిత కశ్మీర్ నుంచి బీబీసీ కోసం

పాకిస్తాన్ పాలిత కశ్మీర్ రాజధాని ముజఫరాబాద్‌ నుంచి 'ఆజాది మార్చ్' నిర్వహించడానికి వచ్చిన స్థానికులను ఎల్‌వోసీకి ఆరు కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ దళాలు అడ్డుకున్నాయి.

అయితే, ఈ మార్చ్‌లో పాల్గొన్నవారు రాత్రిపూట అక్కడే బైఠాయించి పొద్దున్నే మళ్లీ సరిహద్దు వైపు వెళ్లడానికి ప్రయత్నించారు.

ఈ సందర్భంలో పాకిస్తాన్ అధికారులు, నిరసనకారుల మధ్య చర్చలు జరిగాయి. కానీ, ఎలాంటి ఫలితం వెలువడలేదు.

ముజఫరాబాద్‌ నుంచి ఈ మార్చ్ చేయాలని జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ మూడు రోజుల కిందట పిలుపునిచ్చింది.

ఆందోళనకారులు

ఫొటో సోర్స్, MA Jarral/BBC

జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను రెండు నెలల కిందట భారత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి భారత పాలిత కశ్మీర్‌లో కఠినమైన ఆంక్షలు విధించారు. దీనికి నిరసనగానే ఈ మార్చ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు, నియంత్రణ రేఖను దాటవద్దని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సరిహద్దుకు వచ్చిన వేలాది మందిలో న్యాయవాది షామా తారిక్ ఖాన్ ఒకరు.

ఆమె బీబీసీతో మాట్లాడుతూ ''ఇది ఎల్‌వోసీ కాదు, ఆ పేరుతో ఉన్న ఒక రక్త ప్రవాహం. మేము ఈ నియంత్రణ రేఖను తొలగించాలనుకుంటున్నాం. ఇది మా ఇల్లు, మేము మా ఇంట్లోని ఒక గది నుంచి మరో గదికి వెళ్లాలనుకుంటున్నాం. దారిలో మమ్మల్ని ఆపకూడదు. మేము కశ్మీర్‌లోని మా ఇంటికి వెళ్తున్నాం'' అని పేర్కొన్నారు.

ఆందోళనకారులు

ఫొటో సోర్స్, MA Jarral/BBC

ఫొటో క్యాప్షన్, తాము భారత్, పాక్ నుంచి స్వేచ్ఛను కోరుకుంటున్నామని దనిశ్ సానియా స్పష్టం చేశారు

జేకేఎల్‌ఎఫ్‌ కార్యకర్త షెబాజ్ కశ్మీరీ మాట్లాడుతూ, ''ఇన్ షా అల్లా, మేము సరిహద్దును ధ్వంసం చేస్తాం. అక్కడి వారు కూడా బయటకొచ్చి నిరసన తెలపాలని, ప్రపంచానికి సందేశం పంపాలని కోరుకుంటున్నాం. అల్లా కోరుకుంటే, సరిహద్దు చెరిగిపోతుంది'' అని పేర్కొన్నారు.

ఈ మార్చ్‌ను ఒక నిరసన రూపంగా అభివర్ణించిన దనిష్ సానియా మాట్లాడుతూ, ''భారత్, పాక్ రెండింటి నుంచి మా దేశానికి స్వాతంత్ర్యం కావాలి. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకుంటే మేం సహించం'' అని చెప్పారు.

ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని షమా తారిక్ ఖాన్ అన్నారు.

ఎల్‌వోసీ వైపు మార్చ్ చేస్తున్న స్థానికులు

ఫొటో సోర్స్, MA Jarral/BBC

మార్చ్‌ను అడ్డుకున్న పాక్ సైన్యం

చికోటీ చెక్ పాయింట్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న చినారి వద్ద పాక్ సైన్యం ఈ మార్చ్‌ను అడ్డుకుంది. కంటైనర్లు, ముళ్ల కంచె వేసి రహదారిని దిగ్భందం చేసింది.

దీంతో నిరసనకారులు శ్రీనగర్, ఉరి రహదారిపై బైఠాయించారు. ఈ సమయంలో, నిరసనకారుల, పాక్ అధికారుల మధ్య చర్చలు జరిగాయి.

నిరసనకు నాయకత్వం వహిస్తున్న తౌకిర్ గీలానీ బీబీసీతో మాట్లాడుతూ, ''భద్రతా దళాలతో మేం ఎలాంటి ఘర్షణ కోరుకోవడం లేదు'' అని అన్నారు.

ఆందోళనకారులు

ఫొటో సోర్స్, MA Jarral/BBC

పాక్ అధికారులు, నిరసనకారుల మధ్య చర్చలు

పాకిస్తాన్ అధికారులు, జేకేఎల్ఎఫ్ నేతల మధ్య రాత్రి చర్చలు జరిగాయి.

జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌ ప్రతినిధి రఫీక్ దార్ బీబీసీతో మాట్లాడుతూ, ''మా మార్చ్‌ను అడ్డుకోవడంతో మేము స్థానిక పాలకులతో మాట్లాడాం. అడ్డంకులను తొలగించమని అభ్యర్థించాం, అలా చేయకపోతే ఇక్కడే బైఠాయిస్తామని చెప్పాం'' అని తెలిపారు.

పాకిస్తాన్ పాలిత కశ్మీర్ అధికార ప్రతినిధి ముష్తాక్ మిన్హాస్, న్యాయ శాఖ మంత్రి ఫరూక్ అహ్మద్ తాహిర్ సంఘటన స్థలానికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడారు.

ముష్తాక్ మిన్హాస్ బీబీసీతో మాట్లాడుతూ, ''మేము ఈ మార్చ్‌పై నిఘా పెట్టాం. వీరి యాత్ర భారత ఆక్రమిత కశ్మీర్‌లో పరిస్థితి ఎలా ఉందో ప్రపంచానికి తెలపడంలో ఒక మైలురాయి. మార్చ్‌కు మద్దతుగా మేము ఇక్కడకు వచ్చాం'' అని చెప్పారు.

అయితే, ఇక్కడి నుంచి మార్చ్‌ చేయడాన్ని తమ ప్రభుత్వం కోరుకోవడం లేదని అన్నారు.

''ఇక్కడి యువత నిజమైన తపనతో ఇక్కడికి వచ్చారు. వారి ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత జమ్ము కశ్మీర్ ప్రభుత్వంపై ఉంది. మేం ఈ నియంత్రణ రేఖను గుర్తించం. ఇప్పుడు పరిస్థితులు బాగా లేవు. అయినప్పటికీ మేం వాటిని అధిగమిస్తాం'' అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)