సౌదీ అరేబియాలో ఇకపై పెళ్ళికాని జంటలు హోటల్లో కలిసి ఉండవచ్చు...

అవివాహిత జంటలు హోటల్లో కలిసి ఉండచ్చు

ఫొటో సోర్స్, Getty Images

సౌదీ ప్రభుత్వం తమ కొత్త వీసా నిబంధనలను ప్రకటించింది. సౌదీ అరేబియాలోని హోటళ్లలో ఇక అవివాహిత విదేశీ జంటలు ఒకే గదిలో కలిసి ఉండచ్చు.

దానితోపాటు ఏ మహిళైనా హోటల్లో గది తీసుకుని ఒంటరిగా ఉండచ్చు. గతంలో కపుల్స్ హోటల్లో ఒకే గదిలో కలిసి ఉండాలంటే తాము వివాహితులమని ఇద్దరూ నిరూపించాల్సి వచ్చేది. దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుందని చెబుతున్నారు.

కొత్తగా ఏ మార్పులు వచ్చాయి?

గతంలో సౌదీ అరేబియా వచ్చే ఏ విదేశీ జంటలైనా హోటల్లో ఒకే గదిలో బస చేయాలంటే తమ ఇద్దరికీ పెళ్లైనట్లు పత్రాలు చూపించాల్సి వచ్చేది. కానీ ఇక సౌదీ అరేబియా వచ్చే విదేశీ జంటలు హోటల్లో ఉండేందుకు తాము వివాహితులమని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.

అవివాహిత జంటలు హోటల్లో కలిసి ఉండచ్చు

ఫొటో సోర్స్, Getty Images

సౌదీ టూరిజం, నేషనల్ హెరిటేజ్ మంత్రిత్వ శాఖ దీనిపై ఒక ప్రకటన జారీ చేసింది.

సౌదీ అరేబియా పౌరులు హోటల్ చెకిన్ సమయంలో తమ ఫామిలీ ఐడీ లేదా రిలేషన్‌షిప్ సర్టిఫికెట్ చూపించాలి. విదేశీ జంటలకు మాత్రం ఆ అవసరం లేదు. కానీ, మహిళలు అందరూ తమ ఐడీ ఇచ్చి హోటల్లో గది బుక్ చేసుకోవచ్చు. సౌదీ మహిళలకు కూడా ఈ అవకాశం కల్పించారు.

కొత్త వీసా నిబంధనల ప్రకారం మహిళా పర్యాటకులు తమను పూర్తిగా కప్పుకునే దుస్తులు ధరించాల్సిన అవసరం లేదు. కానీ, "వారు మర్యాదపూర్వకంగా ఉండే బట్టలు వేసుకుంటారనే" తాము ఆశిస్తున్నట్లు టూరిజం మంత్రిత్వ శాఖ చెప్పింది. అయితే మద్యంపై మాత్రం ఇప్పటికీ ఆంక్షలు ఉన్నాయి.

అవివాహిత జంటలు హోటల్లో కలిసి ఉండచ్చు

ఈ మార్పు వెనక కారణం

సౌదీ అరేబియాకు ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలు ఉన్న దేశంగా గుర్తింపు ఉంది. కానీ ఓపెన్ మార్కెట్‌ ఆర్థికవ్యవస్థలో సౌదీ అరేబియా తనను తాను అంత దూరంగా ఉండాలని అనుకోవడం లేదు. అది తమ దేశానికి పర్యాటకులు రావాలని, పెట్టుబడులు పెరగాలని కోరుకుంటోంది.

కరడుగట్టిన సంప్రదాయ దేశంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్-సల్మాన్ ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. సౌదీ అరేబియా మహిళలు కారు నడపడంపై ఉన్న ఆంక్షలను ఆయన ఎత్తివేశారు. దానితోపాటు పురుష సంరక్షకులు లేకుండా సౌదీ మహిళలు విదేశాలకు వెళ్లడంపై ఉన్న ఆంక్షలను కూడా తొలగించారు.

అయితే ఈ మార్పుల కంటే ఎన్నో వివాదాస్పద సౌదీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటిలో టర్కీలోని సౌదీ కాన్సులేట్‌లో జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీని హత్య చేయడం ఒకటి.

సౌదీ అరేబియా తాజా నిర్ణయంతో అక్కడ విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ద ఇండిపెండెంట్ ట్రాలెవ్ ఎడిటర్ సిమోన్ కైల్డర్ భావిస్తున్నారు.

"వీసా నిబంధనలు సడలించడం వల్ల సౌదీలో విదేశీ పర్యాటకుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. అరబ్ ప్రపంచాన్ని చూడాలనే ఆసక్తి ఉన్నవారికి ఇది శుభవార్తే" అని ఆయన బీబీసీకి చెప్పారు.

వీడియో క్యాప్షన్, మహిళల డ్రైవింగ్ పైన నిషేధం ఎత్తివేయాలనే ప్రకటన చేశాక, వారి కోసం ప్రత్యేకంగా కార్ల షో

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)