లీసా మోంట్గోమేరీ: 67 ఏళ్ల తరువాత తొలిసారిగా ఒక మహిళకు మరణ శిక్ష అమలు చేసిన అమెరికా

లీసా మోంట్గోమేరీకు 2007లో మరణ శిక్ష విధించారు
ఫొటో క్యాప్షన్, లీసా మోంట్గోమేరీకు 2007లో మరణ శిక్ష విధించారు

67 ఏళ్ల తరువాత తొలిసారిగా అమెరికాలో ఒక మహిళకు మరణ శిక్ష అమలు చేశారు.

అమెరికాకు చెందిన లీసా మోంట్గోమేరీ అనే మహిళకు ఇండియానా రాష్ట్రంలోని టెర్రె హాట్ జైల్లో విషపు ఇంజెక్షన్ ఇచ్చారు. అమెరికా సుప్రీం కోర్టు ఆమెపై విధించిన స్టే ఎత్తి వేయడంతో మరణ శిక్ష ఖాయమైంది.

52 ఏళ్ల లీసా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని, చిన్న వయసులోనే తీవ్ర హింసకు గురయ్యారని ఆమె తరపు లాయర్లు వాదించడంతో ఈ కేసు పలువురి దృష్టిని ఆకర్షించింది.

2004లో లీసా మిస్సౌరీకి చెందిన ఒక గర్భవతిని అత్యంత దారుణంగా హత్య చేసిన కారణంగా అక్కడి న్యాయస్థానం ఆమెకు మరణశిక్ష విధించింది.

23 ఏళ్ల బాబీ జో స్టినెట్ అనే గర్భవతిని హత్య చేసి, కడుపులోంచి బిడ్డను బయటకి తీసి, ఎత్తుకుని పారిపోయారు.

లీసాను తన చివరి కోరిక ఏమిటని అడుగగా "ఏమీ లేదు" అని జవాబు ఇచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

బుధవారం మధ్యాహ్నం 12.00 గంటలకు ఆమెకు మరణ శిక్ష అమలు చేసారు. ఇందులో భాగం పంచుకున్న వారంతా సిగ్గు పడాలని, మానసిక పరిస్థితి సరిగా లేని లీసాకు మరణ శిక్ష విధించడం అన్యాయమని లీసా తరపు లాయర్ కెలీ హెన్రీ అన్నారు.

లీసాకు మరణ శిక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియానాలోని టెర్రె హాట్ జైలు బయట నిరసనలు తెలిపారు
ఫొటో క్యాప్షన్, లీసాకు మరణ శిక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియానాలోని టెర్రె హాట్ జైలు బయట నిరసనలు తెలిపారు

గతంలో కోవిడ్ కారణంగా ఒకసారి, జడ్జ్ స్టే విధించడంతో మరొకసారి లీసాకు మరణ శిక్ష అమలు వాయిదా పడింది. చివరకు సుప్రీం కోర్టు కలుగజేసుకోవడంతో బుధవారం ఆమెకు శిక్షను అమలు పరిచారు.

లీసా మానసిక పరిస్థితిపై విచారణ జరిపేందుకు సోమవారం ఇండియానా కోర్టు జడ్జ్ స్టే విధించారు.

లీసాకు పుట్టుకతోనే మెదడు దెబ్బ తిందని, ఆమె తీవ్ర మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని లాయర్లు వాదించారు.

చిన్నతనంలో లీసా తండ్రి ఆమెను లైంగికంగా, శారీరకంగా వేధించారని, తల్లి ఆమెను వేశ్యావృత్తిలోకి దించారని లీసా కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు ఇచ్చిన చికిత్స కూడా హింసాత్మకంగా ఉండేదని, లీసా ఎంతో వేదన అనుభవించారని ఆమె తరపు లాయర్లు వాదించారు.

మిస్సౌరీలో హత్యకు పాల్పడిన సమయంలో లీసాకు మతిస్థిమితం లేదని, వాస్తవ ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారని లాయర్లు వాదించారు. 41 మంది ప్రస్తుత, మాజీ న్యాయవాదులు, పలు మానవ హక్కుల సంఘాలు ఈ వాదనకు మద్దతు తెలిపాయి.

అయితే ప్రాణాలు కోల్పోయిన జో స్టినెట్ కుటుంబ సభ్యులు మాత్రం లీసాకు మరణ శిక్ష విధించడం సరైనదేనని భావిస్తున్నారు.

లీసా, జో స్టినెట్‌తో ఆన్‌లైన్ స్నేహం ఏర్పరచుకున్నారు. ఇద్దరికీ పెంపుడు కుక్కల పట్ల ప్రేమ ఉండడంతో మంచి దోస్తీ కుదిరింది. ఒకరోజు లీసా, స్టినెట్‌ ఇంటికి వెళ్లి తాడుతో ఆమె గొంతు బిగించి చంపేసారు. తరువాత కడుపులో ఉన్న బిడ్డను బయటకు లాగి ఎత్తుకుపోయారు.

బిడ్డను జో కొడుతున్న లీసాను పోలీసులు అనుమానించి విచారించారు. మొదట ఆ బిడ్డకు తానే జన్మనిచ్చానని లీసా వాదించినా, తరువాత నేరాన్ని అంగీకరించారు.

2007లో లీసా నేరం చేసినట్లు రుజువైంది. వెంటనే ఆమెకు మరణ శిక్ష విధించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)