కరోనావైరస్ - ఉత్తర కొరియా: 'వెలిగిపోయే విజయం మాది' అంటున్న కిమ్ జోంగ్ ఉన్

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Getty Images

ఉత్తర కొరియాలో కరోనావైరస్ వ్యాప్తిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నట్లు ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ చెప్పినట్లు జాతీయ మీడియా సంస్థ కేసిఎన్ఏ ప్రచురించింది.

గురువారం జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో కిమ్ మాట్లాడుతూ "వైరస్ తమ దేశంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుని, దేశంలో స్థిరమైన పరిస్థితులు స్థిరంగా ఉండేలా చూసుకోగలిగాం” అని అన్నారు.

ఆరు నెలల క్రితమే ఉత్తర కొరియా తమ దేశపు సరిహద్దులను మూసేసి, కొన్ని వేల మంది ప్రజలను ఐసొలేషన్లో పెట్టింది.

ఉత్తర కొరియాలో అసలు వైరస్ కేసులే లేవని అధికారులు చెబుతున్నప్పటికీ అది సాధ్యమయ్యే పని కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గురువారం జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో మహమ్మారిని అరికట్టేందుకు అధికారులు ఆరు నెలల పాటు తీసుకున్న చర్యలను కిమ్ విశ్లేషించారు.

పార్టీ సెంట్రల్ కమిటీ నాయకత్వం వహించిన దూర దృష్టే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సహకరించిందని అన్నారు.

కానీ, పొరుగు దేశాలలో వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నందున నిబంధనలు సడలించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నిబంధనలు సడలిస్తే వైరస్ విజృంభించే ప్రమాదం ఉందని ఆయన పదే పదే హెచ్చరించినట్లు శుక్రవారం కేసిఎన్ఏ రిపోర్ట్ చేసింది.

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, AFP PHOTO/KCNA VIA KNS

సోల్ నుంచి బీబీసీ ప్రతినిధి లారా బికర్ విశ్లేషణ

ఉత్తర కొరియాలో వైరస్ వ్యాప్తి జరిగిందా లేదా అనే విషయం పై స్పష్టత లేదు. ఈ ఏడాది జనవరి 30 వ తేదీ నుంచి దేశ సరిహద్దులు మూసేసారు.

సరిహద్దు ప్రాంతంలో అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ కి చెందిన వాలంటీర్లు వైరస్ ని అరికట్టేందుకు సహాయక చర్యలు చేసే పనిలో ఉన్నారు. ఆ దేశంలో వైరస్ కేసులు ఉన్నప్పటికీ అవి నిర్ధరణ కాలేదు.

కానీ, రాజధానిలో జన జీవనం సాధారణ స్థితిలోనే ఉందని తెలుస్తోంది.

అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పోంగ్యాంగ్ మాత్రం కోవిడ్ ని విజయవంతంగా అరికట్టినట్లు కనిపించాలని చూస్తోంది.

కిమ్ జోంగ్ ఉన్ అవలంబించిన చర్యలు వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి పనికొచ్చాయనే సందేశాన్ని ప్రజలకి ఇస్తున్నారు.

మిగిలిన ప్రపంచం అంతా వైరస్ తో పోరాడుతుంటే ఉత్తర కొరియా ప్రజలను మాత్రం దీని నుంచి రక్షించినట్లు ప్రజలు భావించాలనే సందేశాన్ని ఆయన ఇస్తున్నారు.

కానీ, వీటికి ఉత్తర కొరియా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. సరిహద్దు రవాణాని పూర్తిగా నిలిపేశారు. దీంతో, నిత్యావసరాల సరుకుల సరఫరా పూర్తిగా ఆగిపోయింది.

సరిహద్దులో చాలా వ్యక్తిగత రక్షణ పరికరాలు, వైద్య సరఫరాలు నిలిచిపోయాయని కొంతమంది దౌత్య సిబ్బంది చెప్పారు.

ప్రజలు భయంతో పోంగ్యాంగ్ డిపార్ట్మెంటల్ స్టోర్లలో అధిక మొత్తంలో సరుకులు కొనుక్కుంటున్నట్లు తెలిసింది.

సరుకులు లేకపోవడంతో షాపులలో అరలన్నీ ఖాళీ అయిపోయాయి.

ఎప్పుడూ లేని విధంగా ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో దక్షిణ కొరియాకి వెళ్లిన వారిలో కేవలం 12 మంది ఫిరాయింపుదారులే ఉన్నారు.

ఉత్తర కొరియా లో ప్రజలు వైరస్ బారిన పడి ఉండకపోవచ్చు. కానీ, వీరికి బయట ప్రపంచంతో సంబంధాలు మాత్రం పూర్తిగా తెగిపోయాయి.

ఉత్తర కొరియా కరోనా

ఫొటో సోర్స్, AFP

ఉత్తర కొరియాలో తప్పని సరిగా మాస్క్లు ధరిస్తున్నారు

జనవరి ఆఖరి వారంలో ఉత్తర కొరియా సరిహద్దుల్ని మూసేసి, రాజధాని పోంగ్యాంగ్లో వందలాది మంది విదేశీయులను క్వారంటైన్ కి పంపించి వైరస్ కి వ్యతిరేకంగా సత్వరం స్పందించింది.

ఉత్తర కొరియా పౌరులను కూడా ఐసొలేషన్ లో పెట్టింది. పాఠశాలలను మూసేసింది.

ఉత్తర కొరియా లో ఇప్పుడు స్కూళ్ళు తెరుచుకున్నాయి. కానీ, బహిరంగ సమావేశాల పై నిషేధం విధించారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలనే నిబంధనను జారీ చేసినట్లు, రోయఁటర్స్ రిపోర్ట్ తెలిపింది.

ఉత్తర కొరియా ఇప్పటి వరకు 922 మందికి మాత్రమే వైరస్ పరీక్షలు చేసినట్లు, వీరందరికి పరీక్షల్లో నెగిటివ్ అని తేలినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఉత్తర కొరియా చైనాతో సరిహద్దుని కలిగి ఉన్నప్పటికీ, ఒక్క వైరస్ కేసు కూడా నమోదు కాలేదని చెబుతోంది.

ఇది నిజం కాకపోవచ్చని ఎన్ కే న్యూస్ మేనేజింగ్ ఎడిటర్ ఒలివర్ హోథమ్ ఈ సంవత్సరం మొదట్లో బీబీసీ కి చెప్పారు.

"చైనా , దక్షిణ కొరియా లతో సరిహద్దు ఉన్న లతో కొరియాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే నమ్మశక్యంగా లేదని ఆయన అన్నారు. ఈ దేశం వైరస్ రాకుండా ఎలా అడ్డుకోగలిగిందో ఇప్పటికీ అర్ధం కాలేదని”, ఆయన అన్నారు.

"కానీ, సత్వరమే చర్యలు తీసుకోవడం వలన వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపగలిగారేమో “ అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)