అండర్-19 ప్రపంచకప్: ఫైనల్లో యువ భారత్, సెమీస్లో పాకిస్తాన్పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం

ఫొటో సోర్స్, Getty Images
అండర్-19 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో భారత జట్టు పాకిస్తాన్పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
32.2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 176 పరుగులు చేసింది.
ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ సెంచరీ, దివ్యాంశ్ సక్సేనా అర్థ సెంచరీతో జట్టును విజయం వైపు నడిపించారు.
జైశ్వాల్ 113 బంతుల్లో 105 పరుగులు చేయగా, సక్సేనా 99 బంతుల్లో 59 పరుగులు చేశాడు.
99 పరుగుల దగ్గరున్న జైశ్వాల్ విజయానికి 3 పరుగులు కావల్సిన సమయంలో సిక్స్ కొట్టి జట్టును గెలిపించడంతోపాటు తన సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.
అండర్-19 ప్రపంచకప్లో తొలి సెంచరీ చేసిన యశస్వి జైశ్వాల్ ఇన్నింగ్స్లో 4 సిక్సులు, 8 ఫోర్లు ఉన్నాయి.


పాక్ బౌలర్లు ఓపెనర్ల వికెట్లు తీయడానికి మొదటి నుంచీ కష్టపడ్డారు.
ఈ విజయంతో భారత్ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లోకి ప్రవేశించింది.
ఫిబ్రవరి 6న న్యూజీలాండ్ బంగ్లాదేశ్ మధ్య రెండో సెమీ పైనల్ జరగనుంది.
ఈ మ్యాచ్లో విజయం సాధించే జట్టుతో భారత్ ఫైనల్లో తలపడుతుంది.
ఇండియా వరసగా మూడో సారి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ చేరడం విశేషం.
92 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.

ఫొటో సోర్స్, Getty Images
మొదటి నుంచీ తడబడ్డ పాకిస్తాన్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ భారీ స్కోరు చేయడంల విఫలమైంది.
భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో 43.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
పాక్ బ్యాట్స్మెన్లలో ఓపెనర్ హైదర్ అలీ 56, కెప్టెన్ రోహైల్ నజీర్ 62 పరుగులు చేశారు.
మహమ్మద్ హారిస్ 21 పరుగులు చేసి స్కోరు పెంచే క్రమంలో అవుట్ అయ్యాడు.
మిగతా ఆటగాళ్లందరూ సింగిల్ స్కోరుకే పెవిలియన్ చేరారు.
ఒకవైపు కెప్టెన్ రోహైల్ ఆడుతున్నా, అతడితో కలిసి స్కోరుబోర్డును పరిగెత్తించే వారు కరువయ్యారు.
భారత బౌలర్లలో ఎస్.ఎస్.మిశ్రా 3 వికెట్లు పడగొట్టగా, కార్తీక్ త్యాగి, రవి బిష్ణోయ్ చెరి రెండు వికెట్ల తీశారు. అంకొలేకర్, జైశ్వాల్కు ఒక్కో వికెట్ దక్కాయి.

ఫొటో సోర్స్, Getty Images
టాస్ గెలిచి పాక్ బ్యాటింగ్
టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
"ఇది సెమీ ఫైనల్ మ్యాచ్ కాబట్టి మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. మంచి స్కోరు సాధించాలి. భారత్తో మ్యాచ్ అంటే ఎప్పుడూ గొప్పదే. అఫ్ఘానిస్తాన్తో ఆడిన టీమ్తోనే ఈ మ్యాచ్లో కూడా బరిలోకి దిగుతున్నాం" అని పాకిస్తాన్ కెప్టెన్ నజీర్ టాస్ అనంతరం వ్యాఖ్యానించాడు.
మరోవైపు భారత్ కూడా టీంలో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంచనాలు ఎప్పుడూ భారీగానే ఉంటాయని ఇండియా కెప్టెన్ ప్రియమ్ గార్గ్ అన్నాడు.
భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగడం ఈ మధ్య కాలంలో అరుదుగా మారింది. 2019 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా ఇంగ్లండ్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో ఈరెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ చేసిన 140 పరుగులతో భారత్ ఘనవిజయం సాధించింది.

ఫొటో సోర్స్, Getty Images
డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్.. శ్రీలంక, జపాన్, న్యూజీలాండ్లను ఓడించి క్వార్టర్ ఫైనల్కు చేరింది.
క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై 74 పరుగులతో ఘన విజయం సాధించి అజేయంగా సెమీస్లో అడుగుపెట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
మరోవైపు, పాకిస్తాన్ తన తొలి లీగ్ మ్యాచ్లో స్కాట్లాండ్ను, తర్వాత జింబాబ్వేను ఓడించింది. మూడో మ్యాచ్ బంగ్లాదేశ్తో జరిగింది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
ప్రస్తుత వరల్డ్ కప్లో భారత్ సాధించిన అత్యధిక స్కోరు 297, పాకిస్తాన్ అత్యధిక స్కోరు 294. భారత బౌలర్లు 40 వికెట్లు పడగొడితే, పాకిస్తాన్ బౌలర్లు 39 వికెట్లు తీశారు.
ప్రస్తుతం పాకిస్తాన్ తరపున ఆడుతున్న 11మంది ఆటగాళ్లలో కెప్టెన్ రోహైల్ నజీర్ ఒక్కడే 2018 వరల్డ్ కప్లో భారత్-పాక్ సెమీ ఫైనల్ మ్యాచ్లో కూడా ఆడాడు. ఆ మ్యాచ్లో భారత బ్యాట్స్మన్ శుభమ్ గిల్ క్యాచ్ను నజీర్ వదిలేశాడు. ఆ తర్వాత గిల్ సెంచరీ చేసి భారత్ను గెలిపించాడు.
ఈ టోర్నీలో భారత్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడు అర్థ సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్లో యశస్వి విఫలమైతే భారత బ్యాటింగ్ లైనప్ ఎలా నిలబడుతుందో ఇంతవరకూ ఈ సిరీస్లో చూసే అవకాశం రాలేదు.
మరోవైపు, పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ తాహిర్ హుసేన్ గురించి ఇంతవరకూ భారత్కు అవగాహన లేదు. నసీమ్ షా స్థానంలో జట్టులోకి వచ్చిన అతడిని ఇటీవలే అండర్-19 జట్టులోకి ఎంపిక చేశారు.

ఇవి కూడా చదవండి.
- అమెరికా సాయం చేయాల్సిందిపోయి భయాన్ని పెంచుతోంది: చైనా
- భారత్లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
- "నాకు కరోనావైరస్ సోకలేదు.. నన్ను భారత్కు తీసుకెళ్లండి"- చైనాలో చిక్కుకుపోయిన తెలుగు యువతి
- కోనసీమలో కలకలం రేపిన బ్లో అవుట్, మూడోరోజు అదుపు చేసిన ఓఎన్జీసీ
- బడ్జెట్ 2020: నిర్మలా సీతారామన్ పద్దు సామాన్యుడి ప్రశ్నలకు బదులిచ్చిందా?
- కరోనావైరస్ బాధితుల కోసం 8 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి నిర్మించిన చైనా.. ఇదెలా సాధ్యమైంది?
- కరోనావైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









