అక్కడ సముద్రంలో చేప పిల్లల కంటే ప్లాస్టిక్ ఏడు రెట్లు ఎక్కువ

ప్లాస్టిక్ వ్యర్థాలతో చేసిన చేప బొమ్మ

ఫొటో సోర్స్, Getty Images

మహాసముద్రాల్లో చేపలకు ఎక్కువగా ఆహారం దొరికే, అవి పెరిగే ప్రాంతాల్లో ప్లాస్టిక్ తిష్ఠ వేస్తోందని తాజా అధ్యయనమొకటి వెల్లడించింది.

హవాయి సమీపంలో సముద్రంలో చేప పిల్లల కంటే ప్లాస్టిక్కే ఎక్కువ ఉందని.. చేప పిల్లల కంటే అక్కడి జలాల్లో ప్లాస్టిక్ రేణువుల సంఖ్య ఏడు రెట్లు ఎక్కువ ఉందని ఆ అధ్యయనం తెలిపింది.

చేప పిల్లల తినే ఆహారాన్ని ప్రోది చేసే సముద్ర ప్రక్రియే నీటిపైన తేలియాడే ప్లాస్టిక్‌నూ అదే ప్రాంతంలో పోగు చేస్తోంది.

సముద్ర జీవుల్లో ప్లాస్టిక్ ఆనవాళ్లు బయటపడుతున్నా ఆరోగ్యంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.

చేప లార్వా

ఫొటో సోర్స్, JONATHAN L. WHITNEY

''మత్స్య రాశిపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందనడానికి మా వద్ద డాటా ఏమీ లేదు'' అని బ్రిటన్‌లోని బంగోర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెషర్ గారెత్ విలియమ్స్ 'బీబీసీ'తో చెప్పారు.

''కానీ, చేప పిల్లలు జన్మించిన మొదటి కొద్దిరోజుల్లో అవి తమ చుట్టూ ఉండే ప్లాస్టిక్ రేణువులనూ ఆహారంగా తీసుకుంటున్నాయి. ఇది ప్రమాదకర పరిణామం'' అన్నారు గారెత్.

చిన్న చేప లార్వాలు అధికంగా ఉన్న చోట ప్లాంక్టన్ తెట్టు వాటి మనుగడపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక సూక్ష్మజీవులతో కూడిన ఈ తెట్టు చేప పిల్లలకు ప్రధాన ఆహార వనరు.

పరిశోధకులు హవాయి తీరంలో ప్లాంక్టన్‌పై అధ్యయనం చేస్తున్నప్పుడు వలల్లో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ దొరకడం చూసి ఆశ్చర్యపోయారు.

చేప లార్వా కంటే ప్లాస్టిక్కే ఎక్కువ ఉందని డాక్టర్ విలియమ్స్ చెప్పారు.

సముద్రంలో ప్లాస్టిక్

ఫొటో సోర్స్, Getty Images

పసిఫిక్ మహాసముద్రంలో వ్యర్థాలు అధికంగా పోగుపడిన 'గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్' వద్ద కంటే హవాయి వద్ద సముద్రంలో ప్లాస్టిక్ సాంద్రత ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంది.

ఇక్కడ ప్లాంక్టన్‌పై అధ్యయనం చేసే క్రమంలో తాము సేకరించిన శాంపిళ్లలో ఎక్కువగా ప్లాస్టిక్ ఉందని నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన మెరైన్ ఎకాలజిస్ట్ డాక్టర్ జొనాథన్ విట్నీ చెప్పారు.

వందలాది చేప లార్వాలలో ప్లాస్టిక్ అవశేషాలను గుర్తించినట్లు చెప్పారు. మార్కెట్లో విక్రయానికి పట్టే చేపల పొట్టల్లోనూ ప్లాస్టిక్ అవశేషాలు కనిపిస్తున్నాయని చెప్పారు.

ట్యూనా చేపలు, సముద్ర పక్షులు ఆహారంగా తీసుకునే ఫ్లయింగ్ ఫిష్‌లను కోసినప్పుడు వాటి పొట్టలోనూ ప్లాస్టిక్ రేణువులను గుర్తించినట్లు పరిశోధకులు చెప్పారు.

''ఇంతవరకు వాతావరణ మార్పులు, ఆవాసాలు కోల్పోవడం, మితిమీరిన చేపల వేట వంటి కారణాల వల్లే జీవ వైవిధ్యం, మత్స్య సంపద వృద్ధికి ముప్పు ఏర్పడుతుందని అనుకునేవాళ్లం. ఇప్పుడు లార్వా దశలోనే చేపల్లో ప్లాస్టిక్ చేరడం కూడా పెను ముప్పని పరిశోధనలు తేల్చాయ'ని హోనోలులులోని పసిఫిక్ దీవుల మత్స్య విజ్ఞాన కేంద్రానికి చెందిన డాక్టర్ జామిసన్ గోవ్ చెప్పారు.

'ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా'(పీఎన్ఏఎస్)లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)