పీకాక్ జనరేషన్: దేశ సైన్యంపై వ్యంగ్య కవితలు.. ఫేస్‌బుక్‌లో లైవ్.. అయిదుగురు కవులకు జైలు శిక్ష

అరెస్టయిన కవులు

ఫొటో సోర్స్, PEACOCK GENERATION

మయన్మార్‌కు చెందిన అయిదుగురు వ్యంగ్య కవుల బృందాన్ని అక్కడి ప్రభుత్వం జైలులో పెట్టింది. ఆ దేశ సైన్యంపై వ్యంగ్య కవితలు రాయడంతో వారికీ శిక్ష విధించారు.

పీకాక్ జనరేషన్ అనే ఈ బృందం వాడుక మాటల్లో వ్యంగ్య కవితలు రాసి వాటిని నృత్య రూపకాలుగా ప్రదర్శిస్తారు. అయితే, వీరు తమ కళాప్రదర్శనల్లో సైన్యంపై వ్యంగ్యం సృష్టించడంతో ఏప్రిల్‌లో అరెస్ట్ చేశారు. తాజాగా వారికి శిక్షలు ఖరారయ్యాయి. ఒక్కొక్కరికి ఏడాది జైలు శిక్ష విధించారు.

వీరిలో ముగ్గురిపై ఆ వ్యంగ్య ప్రదర్శనను ఫేస్‌బుక్‌లో లైవ్ ఇచ్చారన్న అదనపు అభియోగాలు నమోదు చేశారు.

కే ఖైన్, జే యార్ ల్విన్, పైంగ్ ప్యో మిన్, జా లిన్ తుట్ అనే ఈ అయిదుగురు వ్యంగ్య కవులపై ఆరోపణలు రుజువు కావడంతో యాంగూన్‌లోని న్యాయస్థానం శిక్ష విధించింది.

వారు తమ ప్రదర్శనలో దేశ పార్లమెంటులో ఆర్మీ అధికారాన్ని విమర్శించారు. ప్రదర్శనలో భాగంగా వారు మిలటరీ యూనిఫాం వేసుకున్న కుక్క ఫొటోలను ప్రేక్షకులకు చూపించారు. దీనిపై కేసులు నమోదయ్యాయి.

కోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తి తున్ క్వే 'వారు ఉద్దేశపూర్వకంగా చేయనప్పటికీ ప్రజల ముందు సైన్యాన్ని అవమానించి ప్రదర్శన ఇవ్వడం నేరమే' అన్నారు.

కాగా తీర్పు అనంతరం అయిదుగురు కవులు మాట్లాడుతూ తాము తప్పేమీ చేయలేదన్నారు.

సూచీ

ఫొటో సోర్స్, Reuters

మయన్మార్‌లో కొద్దికాలంగా భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతోంది. జర్నలిస్టులు, కళాకారులు సహా ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడినవారిని జైళ్లలో పెడుతున్నారు.

అయిదు దశాబ్దాల సైనిక పాలనలో చేసిన చట్టాలకు ప్రస్తుత పౌర ప్రభుత్వాధినేత ఆంగ్ సాన్ సూచీ పెద్దగా ఏమీ మార్పులు చేయలేదు.

పీకాక్ జనరేషన్ బృందానికి శిక్ష విధించడం భయంగొలిపే చర్య అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అభిప్రాయపడింది.

ఈ ఏడాది ప్రథమార్థంలో 26 మందిని ఇలాంటి ఆరోపణలతోనే అరెస్టులు చేశారని మయన్మార్‌లో వాక్ స్వేచ్ఛ కోసం పోరాడే సంస్థకు చెందని అథాన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)