యెమెన్ యుద్ధం: 'వేలాది సౌదీ సైనికులను పట్టుకున్నాం... టీవీలో పరేడ్ చేయిస్తాం' - హౌతీ తిరుగుబాటుదారులు

హూతీ తిరుగుబాటుదారులు

ఫొటో సోర్స్, Reuters

సౌదీ అరేబియా సైనికులను భారీ సంఖ్యలో పట్టుకున్నామని యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు చెప్పారు.

"సౌదీ అరేబియా నాజరాన్ పట్టణం దగ్గర సౌదీ అరేబియా సైన్యంలోని మూడు బ్రిగేడ్లు మాకు లొంగిపోయాయి" అని హౌతీ తిరుగుబాటుదారుల ప్రతినిధి బీబీసీకి చెప్పారు.

"పట్టుబడ్డ సైనికుల సంఖ్య వేలల్లో ఉంది. హౌతీ తిరుగుబాటుదారుల మూడు రోజుల ఆపరేషన్‌లో సౌదీ అరేబియా సంకీర్ణ సైన్యంలోని చాలా మంది సైనికులు మరణించారు" అని ఆయన చెప్పారు.

హౌతీ తిరుగుబాటుదారుల వాదనను సౌదీ అరేబియా అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.

హూతీ తిరుగుబాటుదారులు

ఫొటో సోర్స్, Reuters

టీవీలో పెరేడ్ చేయిస్తాం

హౌతీ తిరుగుబాటుదారుల ప్రతినిధి కల్నల్ యాహియా సారియా బీబీసీతో "యెమెన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ మా అతిపెద్ద ఆపరేషన్ ఇదే" అన్నారు.

"సౌదీ సైన్యం లొంగిపోయింది. ఆయుధాలు, యంత్రాలు కోల్పోవడంతోపాటు వారికి భారీ ప్రాణనష్టం జరిగింది. మాకు పట్టుబడిన సైనికులతో ఆదివారం హౌతీ నియంత్రణలో ఉన్న అల్ మసీరాహ్ నెట్‌వర్క్‌ చానల్లో పెరేడ్ చేయిస్తాం" అని చెప్పారు.

హౌతీ తిరుగుబాటుదారులు మొదట సౌదీ అరేబియాలోని రెండు చమురు ప్లాంట్లపై దాడి చేశామని చెప్పారు. ఈ దాడి సెప్టెంబర్ 14న జరిగింది. ఆ దాడులతో అంతర్జాతీయ స్థాయిలో చమురు మార్కెట్‌పై ప్రభావం పడింది.

కానీ, ఈ దాడికి ఇరాన్ కారణమని సౌదీ అరేబియా, అమెరికా ఆరోపించాయి. ఇరాన్ వాటిని ఖండించింది. హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతు ఉందని భావిస్తున్నారు.ట

హూతీ తిరుగుబాటుదారులు

ఫొటో సోర్స్, AFP

2015 నుంచి సంఘర్షణ

2015లో యెమెన్ రాజధాని సనాను హౌతీ తిరుగుబాటుదారులు ఆక్రమించినప్పటి నుంచి ఈ యుద్ధం నడుస్తోంది. దేశ అధ్యక్షుడు అబ్దరబూ మన్సూర్ హాదీ యెమెన్ వదిలి పారిపోవాయాడు. తర్వాత హౌతీ తిరుగుబాటుదారులు ఉత్తర యెమెన్‌లోని చాలా ప్రాంతాలపై పట్టు సాధించారు.

అధ్యక్షుడు హాదీకి సౌదీ అరేబియా మద్దతు ఉంది. సౌదీ నేతృత్వంలో సంకీర్ణ సేనలు 2015లో హౌతీ తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు ప్రారంభించాయి. ఈ సైన్యం ఇప్పటికీ దాదాపు రోజూ వైమానిక దాడులు చేస్తూనే ఉంది. హౌతీ తిరుగుబాటుదారులు కూడా సౌదీ అరేబియాపై క్షిపణి దాడులు చేస్తున్నారు.

ఈ అంతర్యుద్ధం వల్ల యెమెన్ తీవ్ర మానవతా సంక్షోభంలో చిక్కుకుపోయింది. సుమారు 80 శాతం దేశ జనాభా అంటే సుమారు రెండు కోట్ల 40 లక్షల మంది ప్రజలు మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సుమారు కోటి మంది ఆకలితో అల్లాడిపోతున్నారు.

ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం 2016లో యుద్ధం వల్ల 70 వేల మందికి పైగా మృతిచెందారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)