పాకిస్తాన్‌తో చర్చలను రద్దు చేసుకున్న భారత్

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Reuters

పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపే ప్రతిపాదనను భారత్ విరమించుకుంది. ముగ్గురు జమ్ము కశ్మీర్‌ పోలీసుల కిడ్నాప్, హత్య అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది.

భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... "పాకిస్తాన్ కొత్త ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి నుంచి వచ్చిన లేఖలో కనిపించిన స్ఫూర్తికి స్పందనగా ఈ నెలాఖరులో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు న్యూయార్క్‌లో సమావేశం అవ్వాలన్న ప్రతిపాదనకు భారత్ అంగీకరించింది. పాకిస్తాన్ ప్రధాని తన లేఖలో రెండు దేశాల మధ్య శాంతి, సామరస్యతతో పాటు, తీవ్రవాదంపై చర్చించేందుకు పాకిస్తాన్ సిద్ధమని అన్నారు. ఇప్పుడు ఈ ప్రతిపాదిత చర్చల వెనకున్న పాక్ దురాలోచన బయటపడింది. పాకిస్తాన్ కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిజస్వరూపం ఏమిటో అతను బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలల్లోనే ప్రపంచానికి తెలిసిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్‌తో చర్చలు జరపడం అర్ధరహితమే అవుతుంది. మారిన పరిస్థితుల కారణంగా భారత్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల సమావేశం ఉండబోదు" అని అన్నారు.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, EPA

మోదీకి రాసిన లేఖలో ఇమ్రాన్ ఖాన్ ఏం చెప్పారంటే..

భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలను పునరుద్ధరించాలంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి సెప్టెంబర్ 14వ తేదీన లేఖ రాశారు.

పాక్ ప్రధానిగా బాధ్యతలు అందుకున్న నెలరోజుల్లోనే భారత్‌తో చర్చలకు చొరవ చూపిన ఆయన.. రెండు దేశాల మధ్య నిలిచిపోయిన చర్చలను మళ్లీ ప్రారంభించాలని లేఖలో పేర్కొన్నారు.

సెప్టెంబర్ నెలాఖరులో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ భేటీ కావాలని ఇమ్రాన్ కోరారు.

రెండు దేశాల మధ్య అర్థవంతమైన, నిర్మాణాత్మక చర్చలకు సిద్ధమని మోదీ ప్రకటించిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ మొట్టమొదటిసారి అధికారికంగా స్పందించారు.

2015 డిసెంబర్లో నిలిచిపోయిన రెండు దేశాల ద్వైపాక్షిక చర్చలు ముందుకు కొనసాగాలని ఇమ్రాన్ లేఖలో కోరినట్టు దౌత్య అధికారుల చెబుతున్నారు. పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ పై దాడితో ఈ చర్చలకు బ్రేక్ పడింది.

తీవ్రవాదం, జమ్ముకశ్మీర్ సహా అన్ని ప్రధాన సమస్యలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కారించుకోవడంపై భారత్-పాక్ దృష్టి పెట్టాలని ఇమ్రాన్ లేఖలో కోరారు.

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో శుభాకాంక్షలు తెలిపిన మోదీకి ధన్యవాదాలు తెలిపిన ఇమ్రాన్ ఖాన్, ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ఇమ్రాన్ ఖాన్ లేఖకు సానుకూలంగా స్పందించిన భారత్.. చర్చలకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే, కశ్మీర్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో చర్చలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)