వలస విధానంపై వెనక్కు తగ్గిన డొనాల్ట్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ చివరికి వెనక్కు తగ్గారు. అక్రమ వలసదారులను, వారి పిల్లలకు దూరం చేయకూడదనే ఆర్డర్పై సంతకం చేశారు. ఇక దేశంలోని వలస కుటుంబాల వారంతా ఒకే చోట ఉండవచ్చని భరోసా ఇచ్చారు.
తాజా ఆదేశాల ప్రకారం అక్రమంగా వలస వచ్చిన కుటుంబాలను ఇక ఒకేసారి అదుపులోకి తీసుకుంటారు. అమ్మ నాన్నలను అరెస్ట్ చేయడం వల్ల పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని అనిపిస్తే మాత్రం, వారిని విడిగా ఉంచుతారు.
కానీ, పిల్లలను వాళ్ల అమ్మనాన్నల నుంచి ఎంత కాలం పాటు దూరంగా ఉంచుతారు అనేది ఈ ఆదేశాలలో చెప్పలేదు. ట్రంప్ ఆదేశాలు ఎప్పటి నుంచి అమలవుతాయి అనేదానిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు.
ఇమిగ్రేషన్ కేసులను పరిష్కరించేందుకు ఒకే కుటుంబానికి చెందిన సభ్యులందరినీ అదుపులోకి తీసుకుంటామని ట్రంప్ ఆదేశాలలో తెలిపారు.

పిల్లల ఫొటోలు చూసి మనసు కరిగింది
అమ్మ-నాన్నలకు దూరమైన పిల్లల ఫొటోలను చూసి తన మనసు కరిగిందని, అందుకే ఈ ఆదేశాలు జారీ చేశానని ట్రంప్ చెప్పారు.
కుటుంబాల్లో ఉన్న వారు విడిపోతుంటే తను చూడలేనన్నారు.
తన భార్య మెలానియా ట్రంప్, కూతురు ఇవాంక ట్రంప్ కూడా కుటుంబాలు ఒక్కటిగా ఉండాలనే విధానాన్ని సమర్థించారని ట్రంప్ తెలిపారు.
వలసదారులపై చేసిన వివాదాస్పద చట్టాన్ని సరళతరం చేయాలని భార్య మెలనియా, కుమార్తె ఇవాంక ట్రంప్పై ఒత్తిడి తెచ్చినట్టు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ తాజా ఆదేశాలపై సంతకాలు చేసిన కాసేపటికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ఫేస్బుక్లో.. శరణార్థులు, వలసదారులకు స్వాగతం పలికే ఆలోచనను కనుగొనడమే అమెరికా సంప్రదాయం అయ్యిందంటూ పోస్ట్ చేశారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ట్రంప్ మొదట ఏం అనుకున్నారు
ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ సభ్యులు తన పనికి అడ్డు తగులుతున్నారంటూ అంతకు ముందు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
వలసదారుల కోసం రూపొందించిన తన 'జీరో టాలరెన్స్ పాలసీ'ని ఆయన సమర్థించుకున్నారు.
లక్షల మంది వలసదారులకు చోటిచ్చి యూరోపియన్ దేశాలు చాలా పెద్ద తప్పు చేశాయని కూడా ట్రంప్ అన్నారు.

ట్రంప్ చట్టంపై ఎందుకీ వివాదం?
ట్రంప్ పాలనలోని వివాదాస్పద చట్టం ప్రకారం అమెరికా సరిహద్దుల్లో అక్రమంగా చొరబడ్డ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. వారికి జైలు శిక్ష విధిస్తారు. అలాంటి వలసదారులు వారి పిల్లలను కూడా కలవనీయకుండా విడిగా ఉంచుతారు.
తల్లిదండ్రులకు దూరమైన ఈ పిల్లలను అమెరికాలోని 'డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్' చూసుకుంటుంది. అంతకు ముందు ఏ పత్రాలూ లేకుండా మొదటిసారి సరిహద్దులు దాటిన వలసదారులను కోర్టులో నిలబెట్టేవారు.
సమన్లు పంపినా అక్రమ వలసదారులు కోర్టుకు హాజరు కాలేదని అందుకే వారిపై క్రిమినల్ కేసులు పెట్టామని అమెరికా అధికారులు చెప్పేవారు.
కొత్త చట్టం ప్రకారం అక్రమంగా సరిహద్దులు దాటిన వారిని అదుపులోకి తీసుకుని, జైల్లో పెడతారు. కానీ కుటుంబంలో అందరినీ కలిపే ఉంచుతారు.
ట్రంప్ కొత్త ఆదేశాలతో, అక్రమ వలసదారులపై అమెరికా 'జీరో టాలరెన్స్ పాలసీ' ముందు లాగే అమలవుతుందనేది కూడా స్పష్టమవుతోంది.

పిల్లల ఫొటోలతో రాజుకున్న వివాదం
గొలుసులు వేసిన తలుపు వెనక వలసదారుల పిల్లలున్న కొన్ని ఫొటోలు మీడియాలో రావడంతో ట్రంప్ పాలనలోని వలస చట్టాలు మరింత వివాదాస్పదమయ్యాయి.
ఈ ఫొటోలు బయటికి రావడంతో పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ సంరక్షణ కేంద్రాలను నాజీ నిర్బంధ శిబిరాలతో పోల్చారు.
అమెరికా ప్రభుత్వం గణాంకాల ప్రకారం మే 5 నుంచి 9 జూన్ మధ్య 2,342 మంది వలసదారుల పిల్లలు వారి తల్లిదండ్రులకు దూరమయ్యారు.
పిల్లలను వారి కుటుంబాలకు దూరం చేయడం క్రూరమైన, అమానవీయ చర్యగా మెక్సికో విదేశాంగ మంత్రి లూయిస్ విదేగరా కాసో వర్ణించారు.
ఇవి కూడా చదవండి:
- 'పోర్న్ స్టార్ నోరు మూయించడానికి ట్రంప్ లక్షా 30 వేల డాలర్లు చెల్లించారు'
- పాస్పోర్టు రంగు మార్చాలనుకోవడం వివక్ష అవుతుందా!
- పాపకు జన్మనిచ్చిన న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్
- కళ్లు లేకపోయినా.. కలెక్టర్ అయ్యారు: ప్రాంజల్ విజయగాథ
- గ్రౌండ్ రిపోర్ట్: 'ఇది ఎలాంటి జిహాద్' అని ప్రశ్నిస్తున్న ఔరంగజేబ్ తండ్రి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








