బాలీవుడ్ ఎందుకు దక్షిణాది సినిమాల వెంట పడుతోంది?

ఫొటో సోర్స్, RRR/INSTAGRAM
- రచయిత, జోయా మతీన్
- హోదా, బీబీసీ న్యూస్
బాలీవుడ్ హిట్ సినిమాలను నిర్మించేందుకు దక్షిణాది వైపు చూస్తోంది. అయితే, విస్తృతంగా అందుబాటులో ఉన్న స్ట్రీమింగ్ సేవలు, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు రీమేక్ల పై ఎటువంటి ప్రభావం చూపిస్తాయి?
తమిళంలో హిట్ అయిన విక్రమ్ వేద సినిమాను హిందీలో రీమేక్ చేశారు. సెప్టెంబరులో విడుదల అయిన ఈ సినిమాకు మంచి రివ్యూలు లభిస్తున్నాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించిన సినిమాల్లో ఇదొకటి.
విక్రమ్ వేద సినిమా రిలీజ్ అయ్యేందుకు ముందు బాలీ వుడ్ కొత్త సినిమా కథలతో ముందుకు రాలేకపోతోందనే చర్చ కూడా మొదలయింది. బాలీవుడ్ సినిమాల కోసం దక్షిణాది పై ఆధారపడుతోందనే వాదనలు ఇంటర్ నెట్ లో వినిపించాయి.
పాత పద్ధతులను మార్చుకోవడం, కొత్త నటీ నటులతో సినిమాలు తీయడం, ఇతర భాషల్లో విజయవంతమైన సినిమాలను తిరిగి నిర్మించడం సినీ పరిశ్రమలో సాధారణమే. ఈ ఏడాది ఆస్కార్కు నామినేట్ అయిన 10 ఉత్తమ చిత్రాల్లో 4 రీమేక్ చిత్రాలు ఉన్నాయి.
ఆస్కార్ గెలుచుకున్న 'కోడా' కూడా 2014 ఫ్రెంచ్ సినిమా ఆధారంగా తీసిన చిత్రమే.
బాలీవుడ్ కూడా రీమేక్ చిత్రాలను ఇష్టపడుతోంది. 2000 - 2019 మధ్యలో విజయవంతమైన ప్రతీ మూడు సినిమాల్లో ఒకటి రీమేక్ లేదా సినిమా సిరీస్లో భాగంగా నిర్మించినదే" అని మింట్ పత్రిక విశ్లేషించింది. రీమేక్ చేసిన దక్షిణాది చిత్రాల్లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి నటులు కూడా నటించారు.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ మహమ్మారి తర్వాత కుదేలవుతున్న సినీ పరిశ్రమ రీమేక్ ల విషయంలో పరుగు పెడుతున్నట్లు కనిపిస్తోందని పరిశ్రమ విశ్లేషకులు అంటున్నారు. మహమ్మారి సమయంలో ఓటీటీ వేదికలైన నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్లు పెరిగాయి. దీంతో ఇతర భాషల్లో సినిమాలు చూడాలనుకునేవారికి ఈ వేదికలు ద్వారాలు తెరిచాయి.
"దక్షిణాది సినిమాలు ఓటీటీ వేదికల పై చూసేందుకు అందుబాటులో ఉండటంతో బాలీవుడ్ రీమేక్లకు ఎక్కువ మార్కెట్ ఉండటం లేదు" అని వాణిజ్య విశ్లేషకులు కోమల్ నహతా అన్నారు.
దక్షిణాది చిత్ర నిర్మాతలు కూడా తమ పరిధిని విస్తృతం చేసుకుని జాతీయ స్థాయి ప్రచారం చేయడం,పాన్ ఇండియా సినిమాను కూడా విడుదల చేయడం ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులను చేరాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.
ఈ ఏడాది విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్ సినిమాలను కన్నడ, తెలుగులో నిర్మించారు. కానీ, హిందీ వెర్షన్లో డబ్బింగ్ చేసిన ఈ సినిమాలు ఉత్తర భారతదేశంలో భారీ విజయాన్ని సాధించాయి.
స్ట్రీమింగ్ వేదికలు కూడా ఇతర భాషా చిత్రాలకు టైటిల్స్, డబ్బింగ్ జత చేయడం పై ఎక్కువ దృష్టిని పెడుతున్నాయి.
ఒరిజినల్ సినిమా ఓటీటీలో లభిస్తుండటంతో రీమేక్ చేసే అవసరం కూడా ఉండటం లేదు" అని నహతా అన్నారు.
బాలీవుడ్లో ఎటువంటి సినిమా పని చేస్తుందో అర్ధం చేసుకోవడానికి నిపుణులు కష్టపడుతుంటే దక్షిణాదిలో మాత్రం కొత్త కథలు, నటులతో చిత్రాలను నిర్మిస్తున్నారు.
పెద్ద పెద్ద ఆశయాల కోసం పని చేసే పరాక్రమవంతమైన హీరోల కథలతో తీసిన సినిమాలు భారీ విజయాలు తెచ్చిపెట్టాయి. ఈ కథల్లో అతిశయం కూడా ఎక్కువగానే ఉంటోంది. అపోహలను హాస్యంతో, ప్రేమ కథలతో, యాక్షన్ పాత్రలతో కలిపి కథలను రాస్తున్నారు.
బాలీవుడ్ ప్రేక్షకుల కోసం కన్నడ కాలేజీ ప్రేమ కథ కిరిక్ పార్టీ, మలయాళం సూపర్ హీరో సినిమా మిన్నల్ మురళి కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, KABIR SINGH/INSTAGRAM
బాలీవుడ్ నిర్మాతలు కేవలం సృజనాత్మకత కోసం మాత్రమే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా దక్షిణాది సినిమాల వైపు చూస్తారని నహతా అన్నారు.
"సినీ నిర్మాణ ఖర్చు పెరిగిపోవడంతో కొత్త కథలతో ప్రయోగం చేయడానికి కూడా నిర్మాతలు భయపడుతున్నారు" అని అన్నారు.
ప్రాంతీయ భాషల్లో విజయవంతమైన సినిమాల ద్వారా డబ్బును సంపాదించాలని దర్శకులు కూడా ఇతర భాషల్లో వాటిని తిరిగి రీమేక్ చేస్తున్నారని అన్నారు.
"ఏ విషయాన్ని కచ్చితంగా చెప్పలేం. ప్రాంతీయ భాషల్లో హిట్ అయిన చిత్రాలను తిరిగి నిర్మించడం వల్ల హిందీలో కూడా విజయవంతమవుతాయని భావిస్తారు" అని నహతా చెప్పారు.
అయితే, ఈ ఫార్ములా ఒకేలా పని చేస్తుందని చెప్పలేం.
ఈ ఏడాదిలోనే కనీసం బాలీవుడ్లో రీమేక్ చేసిన రెండు దక్షిణాది సినిమాలు జెర్సీ, బచ్చన్ పాండే బాక్స్ ఆఫీసు దగ్గర ఫెయిల్ అయ్యాయి. ఓటీటీలో విడుదలైన గుడ్ లక్ జెర్రీ, కట్పుత్లీకి ఒక మోస్తరు సమీక్షలు వచ్చాయి.
కొన్నేళ్ల క్రితం వరకు ఇతర భాషా చిత్రాలను నిర్మించడం లేదా చూడటం ద్వారా ఇతర భాషా చిత్రాలకు ద్వారం తెరిచేందుకు ఒక అవకాశాన్ని కల్పించేవి.
"కానీ, భవిష్యత్తులో ఏదైనా విషయాన్ని కొత్తగా చూపించాలనుకుంటే తప్ప సినిమాను తిరిగి నిర్మిస్తారని చెప్పలేం" అని అన్నారు.
విక్రమ్ వేద ఒరిజినల్ సినిమాను కూడా యూట్యూబ్, స్ట్రీమింగ్ చానెల్స్లో చాలా మంది చూసేశారు.
హిందీ వెర్షన్ కూడా తమిళ సినిమా మాదిరిగానే ఉంది. కానీ, కొత్త సినిమాలో నటీ నటులు మారారు. హిందీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ నటించారు.

ఫొటో సోర్స్, HRITHIK ROSHAN/INSTAGRAM
"కథ కోసం సినిమా చూసేవారికి రెండు సినిమాలు ఒకటే" అని రంగన్ అన్నారు. "ముందే చూసేసిన సినిమా కోసం డబ్బులెందుకు ఖర్చుపెడతారు" అని ప్రశ్నించారు.
దక్షిణాది సినిమాలకు ఉత్తరాదిలో లభిస్తున్న ప్రాచుర్యం చూస్తుంటే దక్షిణాది నటీనటులను ఆమోదిస్తున్నట్లు తెలుస్తోంది.
కన్నడ నటుడు యష్, తెలుగు నటుడు అల్లు అర్జున్కు ఇతర రాష్ట్రాల్లో కూడా అభిమానులున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, బాలీవుడ్ ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ రీమేక్ను చూసేందుకు ఆసక్తి చూపిస్తారని సినీ విమర్శకులు అనుపమ చోప్రా అన్నారు.
"సినీ దర్శకులు కాపీ పేస్ట్ జాబ్ మానుకుని సినిమాను విశ్లేషించి కొత్తగా నిర్మించగలగాలి" అని అన్నారు.
బాలీవుడ్ ముందు ఇంకా చాలా అవకాశాలున్నాయి. కొన్ని దక్షిణాది సినిమాలను రీమేక్ చేసే పనిలో ఉన్నాయి. నిర్మాణ ప్రక్రియలో ఉన్న సూరరైపొట్రు, దృశ్యం-2 నవంబరులో విడుదల కానున్నాయి.
"ఓటిటీకున్న పరిధి వల్ల ప్రేక్షకుల్లోకి సినిమా వెళ్లడం పై ప్రభావం చూపిస్తుందని చెప్పలేం" అని చోప్రా అన్నారు.
"సినిమాను మెరుగ్గా రీమేక్ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. చాలా మంది ఆ పనిని చేయలేకపోతున్నారు" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కర్ణాటకలో హిజాబ్ వివాదం ఎంతో మంది విద్యార్థుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపించిందంటే...
- Income Tax: ఆదాయ పన్నును మ్యాగ్జిమం తగ్గించుకోవడం ఎలా?
- 'స్పామ్ కాల్స్ గోలేంట్రా బాబూ' అని మీకెప్పుడైనా అనిపించిందా... దీనికి విరుగుడు ఏంటి?
- ప్రశ్న పత్రంలో ఇస్లాంను దూషించారంటూ టీజే జోసెఫ్ చేయి నరికారు, ఇప్పుడు ఆ ప్రొఫెసర్ ఎలా ఉన్నారు?
- ‘హిందీని రుద్దుతున్నారు’ అంటూ ఎందుకు విమర్శలు పెరుగుతున్నాయి,అమిత్ షా కమిటీ సిఫారసుల్లో ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)













