సర్కారు వారి పాట: మహేశ్ బాబు నోట వైఎస్ జగన్ డైలాగ్.. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’పై సోషల్ మీడియాలో చర్చ

ఫొటో సోర్స్, facebook/14ReelsPlus
- రచయిత, బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహేశ్ బాబు కొత్త సినిమా 'సర్కారు వారి పాట' ట్రైలర్ విడుదల అయ్యింది.
పెట్ల పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలు నిర్మించాయి.
పెట్ల పరశురామ్ది ఉమ్మడి విశాఖపట్నం జిల్లా. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్కు శిష్యుడు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కీర్తి సురేశ్ కథానాయికగా నటించగా, థమన్ సంగీతం అందించారు.
మే 12వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.

2.36 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్లో మహేశ్ బాబు చెప్పిన ఒక డైలాగ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
చదువుకునేందుకు తనకు లోన్ కావాలని స్టూడెంట్గా నటించిన హీరోయిన్ కీర్తి సురేశ్ అడగ్గా.. దానికి బ్యాంకు అధికారి పాత్రలో నటించిన మహేశ్ బాబు 'నేను విన్నాను, నేను ఉన్నాను' అని అంటారు.
మహేశ్ బాబు నుంచి విభిన్న తరహా అభినయాన్ని అభిమానులు కోరుకుంటే అందుకు ఆయన స్పందిస్తూ ఈ డైలాగ్ చెప్పినట్లు కొందరు పోస్టులు పెడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన డైలాగ్ ఇది. కొందరు అభిమానులు ఆ వీడియోను, మహేశ్ బాబు డైలాగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

మహేశ్ బాబు తండ్రి కృష్ణ కాంగ్రెస్ పార్టీ అభిమాని. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి, ఏలూరు నియోజకవర్గం నుంచి 1989లో లోక్సభకు పోటీ చేసి గెలిచారు.
1991 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి ఓడిపోయారు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకున్నారు.
2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు.
ఎన్నికలకు ముందు హైదరాబాద్లోని లాల్బహదూర్ శాస్త్రి స్టేడియంలో నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భారీగా నిర్వహించింది.
సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు, నాగార్జున తదితరులు రాజకీయంగా వైఎస్ రాజశేఖరరెడ్డికి మద్దతు ఇచ్చేలాగా ప్రసంగించారు. 2005వ సంవత్సరానికి గాను అతడు చిత్రానికి ఉత్తమ నటుడు అవార్డును వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి స్వీకరించిన మహేశ్ బాబు మాత్రం ముఖ్యమంత్రిని ఉద్దేశించి.. ‘నేను మీ నుంచి రెండు సార్లు నంది అవార్డు తీసుకున్నాను. మీరు నాకు లక్కీ అనుకుంట సర్’ అని మాత్రమే అన్నారు.
మహేశ్ బాబు బావ గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరి, గుంటూరు నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు.
అయితే, గల్లా జయదేవ్ ఎన్నికల ప్రచారంలో కూడా మహేశ్ బాబు పాల్గొనలేదు. 2014 ఎన్నికల సందర్భంగా ట్విటర్ ద్వారా తన బావకు మద్దతు ఇస్తూ అభిమానులకు సందేశం ఇచ్చారు.
‘నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగానే ఉన్నాను’ అని ఆయన ఆ సందేశంలో పేర్కొన్నారు.

తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కొందరు నటులు, దర్శకులు ఫిబ్రవరి 10వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు.
ఈ సమావేశంలో చిరంజీవితో పాటు దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు కూడా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్లకు సంబంధించి అప్పట్లో కొంత వివాదం నడిచింది. ఈ భేటీ తర్వాత ఆ వివాదం ముగిసింది.
భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ల ధరలు పెంచుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

మహేశ్ నోట ఈ డైలాగ్ జగన్కు మద్దతా, ట్రోలింగా?
కాగా, మహేశ్ బాబు నోట వైఎస్ జగన్ డైలాగ్ రావడంపై సోషల్ మీడియాలో మీమ్స్ పెరుగుతున్నాయి.

ఇది వైఎస్ జగన్కు మద్దతుగా చెప్పిన డైలాగేనని కొందరు యూజర్లు పోస్టులు పెడుతున్నారు.

మరికొందరు యూజర్లు మాత్రం ఇది వైఎస్ జగన్పై సెటైర్ అని పోస్టులు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్లో ఉద్యోగాల్లో మహిళలు తగ్గిపోతున్నారా? కారణాలు ఏంటి?
- ఎలాన్ మస్క్: ట్విటర్ కొత్త యజమానిని ఇబ్బందుల పాలు చేసిన ఆరు సొంత ట్వీట్లు
- ఏపీ: ‘సీఎంఓ నుంచి అంటూ ఎమ్మెల్యేలకు టోకరా.. 80 లక్షలతో గాజువాకలో ప్రియురాలికి ఇల్లు’
- హీట్వేవ్: తెలంగాణకు ఎల్లో అలర్ట్.. వడదెబ్బ తగిలిందని ఎలా తెలుస్తుంది
- నాన్న ఆఫీస్కు వెళ్లాడని అమ్మ కారు తాళాలు తీసుకుని ఈ నాలుగేళ్ల పిల్లాడు ఏం చేశాడంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)













