విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై సౌరవ్ గంగూలీ: ‘బీసీసీఐకి వదిలేయండి. అన్ని మేం చూసుకుంటాం’ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, facebook/OfficialSCGanguly
వన్డే కెప్టెన్సీ నుంచి తనను తొలగించడం, టీ20 కెప్టెన్సీ నుంచి తాను తప్పుకున్న క్రమంలో జరిగిన ఘటనల గురించి విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించేందుకు నిరాకరించారని సాక్షి కథనం పేర్కొంది.
ఆ కథనం ప్రకారం గంగూలీ ఏకవాక్యంలో తన స్పందనను తెలియజేశాడు.
"ప్రస్తుతం దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. ఎలాంటి మీడియా సమావేశం కూడా నిర్వహించం. ఈ అంశాన్ని బీసీసీఐకి వదిలేయండి. అన్ని మేం చూసుకుంటాం" అని గంగూలీ స్పష్టం చేశాడు.
తాజా పరిణామాలపై బోర్డు ఎలాంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు లేవని తెలుస్తోంది. కీలకమైన దక్షిణాఫ్రికా సిరీస్కు ముందు బోర్డు స్పందిస్తే అది ఆటగాళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మౌనం వహించడమే ఉత్తమమనే ఆలోచనతో బీసీసీఐ ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
సినిమా చూసి.. అచ్చం అలాగే ప్లాన్ చేసి, రూ.1.2 కోట్ల బంగారం, నగదు దోపిడీ
సైబరాబాద్లో నకిలీ ఐటీ అధికారుల పేరుతో దోపిడీ చేసిన కేసును పోలీసులు ఛేదించారని వెలుగు దినపత్రిక ఒక కథనం రాసింది.
దాని ప్రకారం.. 9 మంది సభ్యుల ముఠాలో ఐదుగురిని గురువారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1.2 కోట్ల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.
ఐటీ అధికారులమని చెప్పి నానక్రామ్గూడ జయభేరి ఆరెంజ్ కౌంటీలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో 1,340 గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్, రూ.2 లక్షల క్యాష్ను నిందితులు దోచుకున్నారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. వ్యాపారి దగ్గర పనిచేసే ఆఫీస్ బాయ్ దోపిడీకి ప్లాన్ చేసినట్లు గుర్తించారు. సినీ ఫక్కీలో జరిగిన దోపిడీ వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు.

ఫొటో సోర్స్, facebook/Viacom18Studios
రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట సుబ్రమణ్యం నానక్రామ్గూడ జయభేరి ఆరెంజ్ కౌంటీలో నివాసం ఉంటున్నాడు. బంజారాహిల్స్ లుంబినీ అమృత ఛాంబర్స్ బిల్డింగ్లో భువన తేజ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్వహిస్తున్నాడు.
ఆయన ఆఫీస్లో ఏపీ కృష్ణా జిల్లాకు చెందిన జశ్వంత్ ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నాడు. అదే బిల్డింగ్లో నర్సాపురం శ్రీహరిపేటకు చెందిన మోహన్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అరవింద్, సోమని సందీప్ మాదాపూర్లో కేఫ్ ప్రారంభించారు.
ఈ క్రమంలో సుబ్రమణ్యం ఆఫీస్లో పనిచేసే జశ్వంత్తో పరిచయం ఏర్పడింది. అక్టోబర్లో అందరూ కలిసి అరవింద్ రూమ్లో పార్టీ చేసుకున్నారు. సుబ్రమణ్యం బిజినెస్, మనీ ట్రాన్సాక్షన్స్ గురించి పార్టీలో డిస్కస్ చేశారు. ఐటీ అధికారుల పేరుతో సంపన్నులను దోచుకునే 'స్పెషల్ ఛబ్బీస్' సినిమా చూసి, సినీ ఫక్కీలో స్కెచ్ వేశారు.
ఏపీకి చెందిన నేలపుడి మురళీ శ్రీధర్, పసగాడ వెంకట్రావ్, సాయిబాబా, శ్రీనివాస్, చలకపాటి శ్రీనివాస్లకు ప్లాన్ వివరించారు. ఐటీ ఆఫీసర్స్గా ఫేక్ ఐడీ కార్డ్లు క్రియేట్ చేసుకొని మారుతి ఎర్టిగా కారుకు ఫేక్ నంబర్ ప్లేట్ ఫిక్స్ చేసి శ్రీధర్ సహా మరో నలుగురు ఆదివారం రాత్రి ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చారు.
అరవింద్తో కలిసి సుబ్రమణ్యం ఇంటి చుట్టూ సోమవారం రెక్కీ వేశారు. ఇంటి పరిసరాలు, లాకర్ వివరాలను చెప్పిన జశ్వంత్.. సుబ్రమణ్యం బయటకు వెళ్లగానే అరవింద్ గ్యాంగ్కి సమాచారం ఇచ్చాడు. ఏపీ నుంచి వచ్చిన నలుగురు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సుబ్రమణ్యం ఇంటికి ఐటీ ఆఫీసర్ల మాదిరిగా నీట్గా డ్రెస్సులు వేసుకుని వెళ్లారు. డ్రైవర్ స్వామి నాయుడు, సుబ్రమణ్యం భార్య భాగ్యలక్ష్మితో ఐటీ అధికారులమని నమ్మించారు. ఫేక్ ఐడీ కార్డులు చూపించారు. ఇల్లంతా సెర్చ్ చేశారు. భాగ్యలక్ష్మి వద్ద లాకర్ కీ తీసుకుని అందులో ఉన్న బంగారు నగలు, రూ.2 లక్షలు సీజ్ చేస్తున్నామని చెప్పారు. వైట్ పేపర్స్పై సంతకాలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు ఉపయోగించిన కారును ట్రేస్ చేసిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు.. ఆర్సీపురంలో నిందితులను అరెస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్లో సైబర్ నేరం.. ఎఫ్బీఐ దర్యాప్తు
హైదరాబాద్లో జరిగిన సైబర్ నేరంపై అమెరికా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు ఈనాడు ఒక కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. జంతువులకు వేసే కరోనా టీకా నూనెతో వ్యాపారం చేద్దామంటూ గీతానారాయణ్, బెంజిమన్, లక్ష్మి పేర్లతో ముగ్గురు నైజీరియన్లు తన వద్ద రూ.11.80 కోట్లు స్వాహా చేశారంటూ ప్రవాస భారతీయ వైద్యుడు డాక్టర్ చంద్రశేఖర్ హైదరాబాద్లో నాలుగు నెలల క్రితం ఫిర్యాదు చేశారు.
సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత అమెరికా వెళ్లిన చంద్రశేఖర్ అక్కడ సెయింట్ లూసియానా పోలీసులకూ ఫిర్యాదు చేశారు.
నైజీరియన్లు నగదు కొల్లగొట్టి డబ్బు మళ్లించిన ఖాతాలు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉండడంతో ఎఫ్బీఐ పోలీసులు వేగంగా స్పందించారు.
కొద్దిరోజుల్లోనే దుబయ్, అమెరికాలోని ఆ బ్యాంకు శాఖల నుంచి వేర్వేరు ఖాతాలకు వెళ్లిన రూ.1.80 కోట్లను ఫ్రీజ్ చేశారు.
బాధితుడికి మెయిల్స్ పంపించేందుకు నైజీరియన్లు వాడిన ఐపీ చిరునామాలు దుబాయ్వని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.
ఇలా రెండు దేశాల్లో నమోదైన సైబర్ నేరంపై పోలీసు అధికారులు సమాంతరంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు దుబాయ్లో ఉన్నారా.. లేదా కొద్ది రోజులు అక్కడికి వెళ్లి నేరం చేశారా.. అన్న కోణాల్లో సైబర్ క్రైమ్ పోలీసులు పరిశోధిస్తున్నారు.
ఈ మోసానికి సంబంధించిన సమాచారాన్ని ఎఫ్బీఐకి పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
18 కాదు 21
అమ్మాయిల వివాహానికి చట్టబద్ధమైన కనీస వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
దాని ప్రకారం.. స్త్రీ, పురుషుల వివాహ వయసులో సమానత్వం తీసుకొచ్చే ఈ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు అధికారవర్గాలు గురువారం వెల్లడించాయి.
బాల్య వివాహాల నిరోధక చట్టం-2006 సవరణ బిల్లును ప్రస్తుతం కొనసాగుతున్న శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
'పర్సనల్ లా' ఉన్న వివిధ కులాల్లోనూ స్త్రీ, పురుషుల వివాహ వయసులో సమానత్వం ఉండేలా తగిన సవరణలు ఈ బిల్లులో తీసుకురానున్నట్టు తెలిపాయి.
ప్రస్తుతం కనీస వివాహ వయసు అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 సంవత్సరాలుగా ఉంది.
ఇవి కూడా చదవండి
- తబ్లీగీ జమాత్ను సౌదీ అరేబియా ఏ భయం కారణంగా నిషేధించింది?
- ఇద్దరు మహిళల యధార్ధ గాథ: ‘పోర్న్ చూస్తూ అసహజ సెక్స్ కోసం బలవంతం చేసేవాడు, కాదంటే శిక్షించేవాడు’
- ‘కొన్ని కులాల మహిళలు వక్షోజాలు కప్పుకోరాదని ఆంక్షలు.. ఉల్లంఘిస్తే రొమ్ము పన్ను’
- జేమ్స్ వెబ్: విశ్వ రహస్యాలను వెలుగులోకి తెచ్చే టెలిస్కోప్ ఇదేనా
- ‘పెళ్లి తరువాత అమ్మాయి పేరు, ఇంటి పేరు మార్చాలా? అబ్బాయి పేరూ మారిస్తే’
- ‘భారత సైన్యానికి లొంగిపోకపోతే మరో పాకిస్తాన్ను కూడా కోల్పోవాల్సి ఉండేది’
- భీకర సుడిగాలికి ఎగిరిపోయిన పెళ్లి ఫొటోలు, సర్టిఫికేట్లు 225 కిలోమీటర్ల అవతల దొరికాయి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)










