సార్వత్రిక ఎన్నికలు 2024: ఎన్నికల నియమావళి అంటే ఏమిటి, పాటించకపోతే ఏమవుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
లోక్ సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. దీంతో 2024 జనరల్ ఎలక్షన్స్కు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రక్రియ మొదలుపెట్టినట్లయింది. ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికల్లో కోట్లమంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల నియమావళి(ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్) కూడా అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది.
దేశంలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధనలనే ‘‘ఎన్నికల నియమావళి’’గా పిలుస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల నియమావళిని అమలుచేసిన తర్వాత ప్రభుత్వ పరిపాలన యంత్రాంగంలో కొన్ని కీలకమైన మార్పులు చోటుచేసుకుంటాయి.
- కొందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు ఎన్నికల కమిషన్ (ఈసీ) సిబ్బందిగా పనిచేస్తారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వీరు ఈసీ కోసమే పనిచేస్తారు.
- ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత, ఒక పార్టీకి ప్రయోజనాలు చేకూర్చేలా ప్రజాధనాన్ని ఉపయోగించకూడదు. ఒకసారి కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వ పథకాలు, భూమిపూజలు, శంకుస్థాపనలు, ప్రకటనలు చేయకూడదు.
- ప్రభుత్వ వాహనాలు, విమానాలు, ప్రభుత్వ భవనాలను ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకోకూడదు.
- ఎన్నికల ర్యాలీలు, పాదయాత్రలు, బహిరంగ సభలు లాంటి ప్రజా కార్యక్రమాలు నిర్వహించే పార్టీలు, అభ్యర్థులు, వారి మద్దతుదారులు ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి.
- మతం, కులం పేరుతో ఏ రాజకీయ పార్టీ ఓట్లు వేయాలని అభ్యర్థించకూడదు.
- మత ఘర్షణలు రెచ్చగొట్టేలా లేదా కులాల మధ్య చిచ్చు పెట్టేలా లేదా భాష పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేలా అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రకటనలు లేదా వ్యాఖ్యలు చేయకూడదు.
- పార్టీలు లేదా అభ్యర్థుల విమర్శలు.. విధాన నిర్ణయాలు, పథకాలు, కార్యక్రమాలు, గతంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావాలి. అభ్యర్థుల వ్యక్తిగత అంశాలు, ప్రజా జీవితంతో సంబంధంలేని అంశాల జోలికి పోకూడదు. నిరూపించలేని ఆరోపణలను చేయకూడదు.
- ఎన్నికల ప్రచారంలో భాగంగా మసీదులు, చర్చ్లు, దేవాలయాలు ఇతర ప్రార్థనా స్థలాలను ఉపయోగించుకోకూడదు.
- ఎన్నికల చట్టంలో నేరాలుగా పరిగణించే ‘‘అవినీతి‘’ విధానాల జోలికి అభ్యర్థులు, పార్టీలు వెళ్లకూడదు. ఓటర్లకు డబ్బులు లేదా బహుమతులు ఇచ్చి ప్రలోభ పెట్టడం, భయపెట్టడం, దొంగ ఓట్లు వేయడం లాంటివి చేయకూడదు.
- పార్టీలు ఓటర్లకు లంచం ఇవ్వడం/బెదిరించడం/అవమానించడం లాంటవి చేయకూడదు. ఓటర్లను పోలింగ్ స్టేషన్లకు, అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు కల్పించకూడదు. పోలింగ్ రోజున మద్యం సేవించడం/పంపిణీ చేయడం నిషేధం.
- పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో ఎలాంటి ప్రచార బోర్డులు ఏర్పాటుచేయకూడదు. పోలింగ్కు ముందు 48 గంటల సమయంలో ఎలాంటి ప్రచార కార్యక్రమాలూ నిర్వహించకూడదు.
- ఎన్నికల కార్యక్రమాలను దగ్గరుండి పరిశీలించేందుకు ఎన్నికల కమిషన్ ఎన్నికల పరిశీలకులను నియమిస్తుంది.

ఫొటో సోర్స్, AFP
ప్రవర్తనా నియమావళి ఎప్పుడు ప్రారంభమైంది?భారత్లో 1960లో కేరళ అసెంబ్లీ ఎన్నికలతో ప్రవర్తనా నియమావళి (కోడ్ ఆఫ్ కండక్ట్) తీసుకొచ్చారు. రాజకీయ పార్టీల అంగీకారంతో వారితో సంప్రదింపులు జరిపి ప్రవర్తనా నియమావళిని రూపొందించారు. పార్టీలు, అభ్యర్థులు ఏ నియమాలను అనుసరించాలో నిర్ణయించుకున్నారు.1967 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలలో ప్రవర్తనా నియమావళి అమలు చేశారు. దానికి కొన్ని కొత్త విషయాలు, నియమాలు పొందుపరిచారు. కోడ్ ఆఫ్ కండక్ట్ ఏ చట్టంలోనూ భాగం కాదు. కానీ దానిలోని కొన్ని నిబంధనలు ఐపీసీలోని సెక్షన్ల ఆధారంగా అమలవుతాయి.
ఎన్నికల సంఘం సెప్టెంబర్ 1979లో రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రవర్తనా నియమావళిని సవరించింది. 1979 అక్టోబరులో జరిగిన సాధారణ ఎన్నికల నుంచి దీన్ని అమలుచేశారు.
ప్రవర్తనా నియమావళి విషయంలో 1991 జనరల్ ఎలక్షన్స్ అత్యంత ముఖ్యమైనవి. ఈ సమయంలో ప్రవర్తనా నియమావళిని విస్తరించారు. దీనిని అమలుపరచడంలో ఎన్నికల సంఘం అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిచింది.
తేదీలు(షెడ్యూల్) ప్రకటించిన రోజు నుంచే ప్రవర్తనా నియమావళి అమల్లోకి తెచ్చేలా చూడాలని ఎన్నికల కమిషన్ భావించగా, నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది.
ఈ వ్యవహారం చివరకు కోర్టుల వరకు వెళ్లింది. కానీ, అక్కడి నుంచి స్పష్టత రాకపోవడంతో చివరకు 2001 ఏప్రిల్ 16 రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘం మధ్య జరిగిన చర్చల తర్వాత, షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి ప్రవర్తనా నియమావళి (కోడ్ ఆఫ్ కండక్ట్)ను అమలు చేయడానికి ఇరువర్గాలు అంగీకారానికి వచ్చాయి. అయితే, ఎన్నికల తేదీకీ, నోటిఫికేషన్కు మధ్య కనీసం మూడు వారాల (21రోజుల) గడువు ఉండాలన్న షరతు పెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
కోడ్ను ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సక్రమంగా అమలు చేసేందుకు ఎన్నికల సంఘం పరిశీలకుల సహాయం తీసుకుంటుంది. ఈ పనిలో అతను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ మరియు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల సహాయం తీసుకుంటుంది. వీరితో పాటు, ఎన్నికల సంఘం ఈ సేవల నుండి పదవీ విరమణ పొందిన అధికారులను కూడా పరిశీలకులుగా నియమిస్తుంది.
- ఏదైనా పార్టీ లేదా అభ్యర్థి ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంటుంది.
- నేరాలు తీవ్రమైనవి అయితే, ఎన్నికల్లో పోటీ చేయకుండా అభ్యర్థులపై నిషేధం విధించే అవకాశముంది.
- ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే, జైలుకు కూడా పంపేలా నిబంధనలు ఉన్నాయి.
అయితే తరచూ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కోడ్ ఆఫ్ కండక్ట్ సీరియస్గా తీసుకోవడం లేదు. అందువల్ల, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ప్రతిసారీ ఏదో ఒక రాజకీయ పార్టీ లేదా అభ్యర్థిపై విచారణ జరుగుతూనే ఉంది.
ఇవి కూడా చదవండి:
- సెక్స్ ట్రేడ్ కోసం యూరప్కు మహిళల అక్రమ రవాణా... తప్పించుకున్న ఓ బాధితురాలి కథ
- 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- నీళ్లపైనే నగరాలు.. భవిష్యత్తు ఇదేనా? యూరప్ దేశాల్లో ఈ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి?
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














