కేరళ ఎన్నికలు: పోటీ ఎవరెవరి మధ్య.. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేంటి

కేరళ

ఫొటో సోర్స్, RAMESH PATHANIA / MINT VIA GETTY IMAGES

ఈసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కేరళ కూడా ఉంది.

ఇక్కడ వామపక్ష కూటమి ప్రభుత్వం తమ అధికారాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే... కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి పాలన పగ్గాలను తమ చేతుల్లోకి తెచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇక బీజీపీ రాష్ట్రంలో తమ బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది.

మొత్తానికి ఈ పార్టీలన్నింటి ప్రచారంతో కేరళలో ఎన్నికల వేడి పెరిగింది.

ఎన్నికలు ఎప్పుడు?

కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 6న జరగబోతున్నాయి.

ఈసారి ఎన్నికలను ఒకే దశలో నిర్వహించనున్నారు.

కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచారు.

మిగతా రాష్ట్రాలతో పాటే కేరళ ఎన్నికల ఫలితాలను కూడా మే 2న ప్రకటిస్తారు.

సీట్లు ఎన్ని?

కేరళ అసెంబ్లీలో మొత్తం 140 సీట్లు ఉన్నాయి.

అధికారం దక్కాలంటే 71 సీట్లు కావాలి.

ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ఈ జూన్ 1తో ముగుస్తుంది.

ఎన్నికల కమిషన్ వెల్లడించిన సమాచారం ప్రకారం కేరళలో దాదాపు 2.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

వీరిలో సుమారు 1.37 కోట్ల మంది మహిళలు.

1.29 కోట్ల మంది పురుషులు. 221 మంది ట్రాన్స్‌జెండర్లు.

కేరళ ఎన్నికలు

ఫొటో సోర్స్, ARUN SANKAR / AFP VIA GETTY IMAGES

ఏయే పార్టీలు పోటీలో ఉన్నాయి?

ప్రస్తుతం రాష్ట్రంలో సీపీఎం నేతృత్వంలోని వామపక్ష పార్టీల కూటమి ఎల్‌డీఎఫ్ అధికారంలో ఉంది.

డిసెంబర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాల తర్వాత ఎల్‌డీఎఫ్‌పై అంచనాలు పెరిగాయి.

కేరళ ఎన్నికల చరిత్రలో అధికారం నిలుపుకున్న తొలి ప్రభుత్వంగా చరిత్ర సృష్టించాలని ఈ కూటమి ఆరాటపడుతోంది.

మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ రక్షణమంత్రి, మూడుసార్లు కేరళకు సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న ఏకే ఆంటోనీ... తమ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఈసారి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం బీజేపీ నాయకత్వం వహిస్తున్న ఎన్డీయే కూటమికి కేరళ అసెంబ్లీలో ఉన్నది ఒకే సీటు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తాము భారీ విజయం సాధిస్తామని బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు ఎంటీ రమేశ్ అంటున్నారు.

కేరళ ఎన్నికలు

ఫొటో సోర్స్, @SHASHITHAROOR

ప్రముఖ అభ్యర్థులు వీళ్లే...

లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్)

పినరయి విజయన్ (సీపీఎం) – ధర్మదం, కన్నూర్ జిల్లా

కేకే శైలజా (సీపీఎం) – మత్తానూర్, కన్నూర్ జిల్లా

కె. సురేంద్రన్ (సీపీఎం) – కలహాకూట్టం, తిరువనంతపురం

ఎంబీ రాజేశ్ (సీపీఎం) – థ్రిథలా, పాలక్కడ్ జిల్లా

మర్సికుట్టీ అమ్మ (స్వతంత్ర అభ్యర్థి) – కుందారా, కొల్లాం జిల్లా

కేటీ జలీల్ (స్వతంత్ర అభ్యర్థి) – థావనూర్, మలప్పురం జిల్లా

యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)

ఓమన్ చాండీ (కాంగ్రెస్) – పుట్టుపల్లీ, కొట్టాయం జిల్లా

రమేశ్ చెన్నిథలా (కాంగ్రెస్) – హరిపద్, అలాపుళా జిల్లా

ముల్లపల్లీ రామచంద్రన్ - వటాకారా

కే మురళీధరన్ (కాంగ్రెస్) – నెమోం, తిరువనంతపురం

పీకే కున్హాలీకుట్టీ (ఐయూఎంఎల్) – వెంగారా, కోళీకోడ్

నూర్బీనా రషీద్ (ఐయూఎంఎల్) – దక్షిణ కోళీకోడ్, కోళీకోడ్ జిల్లా

నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎన్‌డీఏ)

కె. సురేంద్రన్ (బీజేపీ) – మంజేశ్వర్, కాసర్‌గోడ్ జిల్లా & కోన్నీ, పఠానంథిట్టా జిల్లా

కుమ్మనం రాజశేఖరన్ (బీజేపీ) – నెమోం, తిరువనంతపురం జిల్లా

శోభా సురేంద్రన్ (బీజేపీ) – కళహాకూట్టం, తిరువనంతపురం జిల్లా

ఎన్నికల్లో ప్రధాన అంశాలు ఇవే...

తుపాను, వరదలు, నిఫా వైరస్, కోవిడ్... ఇలా రకరకాల సంక్షోభాలను ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం ఎదుర్కొంది.

అయితే, ఎన్నికల్లో ఇప్పుడు బంగారం స్మగ్లింగ్ వ్యవహారం లాంటి అంశాలు తీవ్ర చర్చనీయాంశాలు అయ్యాయి.

ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి.

శబరిమల కూడా ఈ ఎన్నికల్లో కీలకాంశంగా ఉంది.

మధ్య, దక్షిణ కేరళ ప్రాంతాల్లో ఈ అంశం ప్రభావం చూపించవచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక బీజేపీ... ఎల్‌డీఎఫ్ ఓట్లు చీల్చుతుందా? యూడీఎఫ్ ఓట్లు చీల్చుతుందా అన్న చర్చ కూడా జరుగుతోంది.

గత ఎన్నికల్లో...

2016 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం 58 సీట్లు గెలిచింది.

కాంగ్రెస్ 22, సీపీఐ 19, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) 18, కేరళ కాంగ్రెస్ (ఎం) 6, జనతాదళ్ (సెక్యులర్) 3, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2, బీజేపీ ఒకటి చొప్పున గెల్చుకున్నాయి. ఇతరులు మరో 11 సీట్లు గెలిచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)