పెట్రోలు, డీజిల్: ధరలు ఎప్పుడు తగ్గుతాయి.. తగ్గాలంటే మోదీ ప్రభుత్వం ఏం చేయాలి

పెట్రోలు పంప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

దేశంలో తొలిసారిగా కొన్ని నగరాల్లో పెట్రోల్ ధర లీటరు రూ.100కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరతో పోలిస్తే భారత్‌లో పెట్రోలు ధరలు చాలా ఎక్కువనే చెప్పాలి.

మరి చమురు ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం ఎప్పుడు లభిస్తుంది? పెట్రోలు, డీజిల్‌లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే దీనిక మార్గమా ? అటు ప్రభుత్వం, ఇటు నిపుణులు ఏమనుకుంటున్నారు ?

ఆయిల్‌ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌లపై వేసిన అదనపు పన్నులను వెంటనే తొలగించాలని కాంగ్రెస్‌ నేత అభిషేక్ మను సింఘ్వి కొద్ది రోజుల కిందట విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనివల్ల ఇంధన ధరలు తగ్గుతాయని ఆయన అన్నారు.

ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య పెట్రోలు ధరల విషయంలో విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్రంగా సాగుతున్నాయి. అయితే ఎవరి వాదన ఎలా ఉన్నా సామాన్యులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఇటు రైతులు కూడా సంతోషంగా లేరు. పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాల్సిందేనని మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

పెట్రోలు పంప్ వద్ద వినియోగదారు

ఫొటో సోర్స్, Getty Images

ధర తగ్గించడం సాధ్యమేనా ?

ఎక్సైజ్‌ సుంకం తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోందన్న మాట వినిపిస్తోంది. అయితే ఆర్థిక, చమురు మంత్రిత్వ శాఖల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, అందువల్ల టాక్స్ తగ్గింపు నిర్ణయం తుది దశకు రాలేదని తెలుస్తోంది.

అయితే ఎక్సైజ్ సుంకం తగ్గించినా, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ‌ధరలు నిరంతరం పెరుగుతుండటంతో వినియోగదారులకు పెద్ద ఊరట ఏమీ ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.

రాబోయే కొన్ని వారాలు, నెలల్లో పెట్రోల్‌, డీజిల్ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయని, రేట్లు మరింత పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం ముడి చమురు బ్యారెల్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 66 నుంచి 67 డాలర్లు ఉంది. మరి అది ఈ సంవత్సరం 100 డాలర్లకు చేరుకుంటుందా ? అన్న ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నారు నిపుణులు.

సింగపూర్‌లోని భారత సంతతికి చెందిన వందన హరి గత 25 ఏళ్లుగా చమురు పరిశ్రమ తీరుతెన్నులను గమనిస్తున్నారు. ‘‘100 డాలర్లు కాదు ఇంకా ఎక్కువే పెరుగుతుంది.’’ అన్నారామె.

చమురు ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ ఆర్థిక వ్యవహారాల జాతీయ ప్రతినిధి గోపాల్‌కృష్ణ అగర్వాల్ అన్నారు.

‘‘ప్రభుత్వానికి రాబడి 14.5 శాతం తగ్గింది. వ్యయం 34.5 శాతం పెరిగింది. అయినా ప్రభుత్వం పన్నులు పెంచలేదు. ద్రవ్యలోటు 9.5 శాతంగా ఉంది. జీడీపీలో 87శాతం స్థూల రుణాలే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రంకన్నా రాష్ట్ర ప్రభుత్వాలే పన్నులు తగ్గించాలి’’ అన్నారు గోపాల్‌కృష్ణ అగర్వాల్

ఇలా కేంద్రం చేతులెత్తేస్తే రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరుగుతుంది. కానీ చమురు మీద వచ్చే ఆదాయంలో కేంద్రానిదే పెద్ద వాటా. ఆయిల్ మీద వచ్చే ప్రతి వంద రూపాయల పన్నులో రూ.37 కేంద్రానికి, రూ.23 రాష్ట్రాలకు చేరతాయి.

లాక్‌డౌన్‌ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర బ్యారల్‌ 20 డాలర్లకు పడిపోయినప్పుడు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుతాయని ప్రజలు ఊహించారు. కానీ పెరుగుతూనే ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? ‘‘భారత ప్రభుత్వం చమురుపై పన్నును పెంచింది. అందుకే ధరలు తగ్గలేదు’’ అన్నారు వందనా హరి.

దేశంలో పెట్రోల్‌ బంకుల్లో అమ్మే పెట్రోలు, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలతో ముడిపడి ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర తగ్గినా, పెరిగినా హెచ్చు తగ్గులు కనిపించాలి. కానీ గత ఆరేళ్లలో భారతదేశంలో అది జరగలేదు.

‘‘2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్‌ 106 డాలర్లు ఉంది. అప్పటి నుంచి ధరలు తగ్గుతూ వచ్చాయి. ‘నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చమురు ధరలు తగ్గుతుండటం నా అదృష్టం’ అని అప్పట్లో ప్రధాని అన్నారు.

ఏడేళ్ల కిందట పెట్రోలు ధర రూ.72 ఉంది. కానీ ప్రభుత్వం చమురు ధరలు తగ్గించకుండా ఎక్సైజ్ ‌సుంకాన్ని పెంచింది’’ అని ఓఎన్‌జీసీ మాజీ ఛైర్మన్ ఆర్.ఎస్.శర్మ అన్నారు.

పెట్రో ధరల పెరుగుదలపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పెట్రో ధరల పెరుగుదలపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

సామాన్యులకు ఊరట కలిగేదెలా ?

భవిష్యత్తులో ధరలు పెరగడమే తప్ప తగ్గడం ఉండదని నిపుణులు చెబుతున్నారు. దాని నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలు కూడా చెబుతున్నారు. కానీ అవన్నీ జరుగుతాయా అన్నది ఇక్కడ పెద్ద సమస్య.

మొదటిది సూచన.. ధరలు తగ్గాలంటే మొదట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురుపై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలి. కానీ రెండు ప్రభుత్వాలు అందుకు సిద్ధంగా లేవు.

రెండోది మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలకు విరుద్ధమైన సబ్సిడీని ఇవ్వడం. ఇందుకు కేంద్రం సిద్దంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ‘‘ రాయతీలు ఇవ్వడం తిరోగమనం. అలా రాయితీలు ఇవ్వడంవల్ల ధనికులు కూడా లాభపడతారు. గ్యాస్ విషయంలో ఇలా జరక్కుండా జాగ్రత్తపడ్డాం.’’ అని బీజేపీ జాతీయ ప్రతినిధి గోపాల్‌కృష్ణ అగర్వాల్‌ అన్నారు.

అలాంటప్పుడు ‘‘టూ వీలర్లు నడిపే వారికి, పేదలకు మాత్రమే పెట్రోలు, గ్యాస్‌లలో రాయితీలు ఇవ్వాలి. భారీ రెస్టారెంట్లకు సబ్సిడీ ఇవ్వకూడదు’’ అని వందనా హరి సూచించారు.

ప్రజలకు ఉపశమనం కలిగించడానికి మూడవ ఆప్షన్ కూడా ఉందన్నారు ఓఎన్‌జీసీ మాజీ ఛైర్మన్‌ ఆర్.ఎస్.శర్మ. పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం అన్నది ఆయన చెప్పిన పరిష్కారం. అయితే ఇదొక రాజకీయ సమస్య అని, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అంగీకరించవని, మద్యం, చమురులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోమన్న హామీతోనే రాష్ట్రాలు జీఎస్టీ బిల్లును అంగీకరించాయని శర్మ అన్నారు.

పెట్రోలు పోయించుకుంటున్న వాహనదారులు

ఫొటో సోర్స్, Getty Images

చమురు ధర తగ్గించే మరో మార్గం

ఇరాన్, వెనిజువెలా నుంచి ముడి చమురును కొనడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కానీ అమెరికా ఆంక్షల కారణంగా దిగుమతులు సందిగ్థంలో పడ్డాయని గోపాల్‌కృష్ణ అగర్వాల్ అన్నారు.

ఇక భారతదేశం తన వ్యూహాత్మక చమురు నిల్వలను పెంచాలని కొందరు నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. దేశంలోకి దిగుమతి ఆగిపోతే ఇక్కడున్న చమురు నిల్వలు 10 రోజులకు మాత్రమే సరిపోతాయి. ప్రైవేట్ సంస్థల వద్ద పెద్ద మొత్తంలో చమురు నిల్వలు ఉన్నాయి.

ఈ నిల్వలను 10 నుంచి 90 రోజులకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. అత్యవసర సమయాల్లో, అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదొడుకులు, యుద్ధాల వల్ల ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఈ వ్యూహాత్మక చమురు నిల్వలను ఉపయోగిస్తారు.

అమెరికా వద్ద ప్రపంచంలో అత్యధిక మొత్తంలో నిల్వలున్నాయని, అమెరికా, చైనాల తర్వాత అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే దేశం భారతదేశమే కాబట్టి రిజర్వ్‌లను పెంచుకోవాలని నిపుణులు అంటున్నారు.

డబ్బు

ఫొటో సోర్స్, Getty Images

దిగుమతిపై ఆధారపడటం తగ్గించాలి

భారతదేశంలో పెట్రోలియం, గ్యాస్ నిక్షేపాల పరిమాణం తక్కువ. అందువల్ల దిగుమతి చేసుకోక తప్పదు.

గత నెల 17న తమిళనాడులో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘‘ఇంధన వనరులను వైవిధ్యంగా మార్చాలి. చమురు మీద ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి’’ అని అన్నారు.

చమురు మీద ఆధారపడకుండా ఉండాలంటే భారతదేశం 10-15 సంవత్సరాల ముందుకు వెళ్లి ప్రణాళికలు రచించాలని వందనా హరి సూచించారు.

‘‘చమురు వాడకం తగ్గించి ఎలక్ట్రికల్, హైడ్రోజన్, నేచురల్ గ్యాస్‌వైపు దృష్టిపెట్టాలి. ఇప్పటికే ఆ దిశగా నడుస్తున్నాం. కానీ 2030-35నాటి వరకు ఇది సాధ్యం కాదు’’అన్నారామె. ప్రజారవాణా వ్యవస్థలను విస్తరించాలని ఆమె సూచించారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులనుబట్టి చూస్తే భవిష్యత్తులో ఎప్పటికో ఉపశమనం లభించవచ్చేమోగానీ, రాబోయే కొద్ది నెలల్లో మాత్రం చమురు భారం కొనసాగక తప్పదని నిపుణులు చెబుతున్నారు.

భారతదేశ భారీ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి చమురు ఇంధనంగా ఉపయోగపడుతుంది. చమురు ధరలు పెరుగుతూ ఉంటే, ద్రవ్యోల్బణం, జీడీపీ, కరెంట్ అకౌంట్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది డిమాండ్‌పై ప్రభావం చూపి ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)