రజనీకాంత్: తమిళనాడులో అన్ని సీట్లలో పోటీచేస్తాం

రజనీకాంత్

ఫొటో సోర్స్, RAJINIKANTH

సినీ నటుడు రజనీ కాంత్ వచ్చే ఏడాది జనవరిలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. పార్టీకి సంబంధించి డిసెంబర్ 31న చేయబోతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

"మనం మార్పేస్తాం. అన్నింటినీ మార్చేస్తాం", "ఇప్పుడు కాకుంటే, ఎప్పుడూ కాదు" అనే హ్యాష్‌టాగ్స్‌తో రజనీకాంత్ సోషల్ మీడియాలో ఈ విషయం వెల్లడించారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని, అవినీతిలేని స్వచ్ఛమైన, ఆధ్యాత్మిక విలువలతో కూడిన రాజకీయాలకు బాటలు వేస్తామని కూడా రజనీ అన్నారు.

సినీ నటుడిగా ఉంటూ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రజనీ కాంత్ గతంలోనే రజనీ మక్కల్ మండ్రం (ఆర్ఎంఎం) పేరుతో తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు.

ఈ ట్వీట్‌ను రజనీ తన బాబా చిత్రంతో సుపరిచితమైన ఎమోజీతో ముగించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

తమిళనాడులో రాజకీయ మార్పు వస్తుంది - రజనీకాంత్

తమిళనాడులో రాజకీయ మార్పు తప్పనిసరిగా వస్తుందని సినీనటుడు రాజనీకాంత్ చెప్పారు. తన జీవితాన్ని రాష్ట్ర ప్రజలకు అంకితం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వివరించారు.

తన పోయెస్‌ గార్డెన్ నివాసంలో రిపోర్టర్లతో గురువారం ఆయన మాట్లాడారు.

ఆయన ఇంకా ఏం మాట్లాడారు?

''వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లు ఇదివరకే నేను చెప్పాను. తమిళనాడు మొత్తం పర్యటించాలని నేను భావించాను. అయితే, కరోనావైరస్ వ్యాప్తి నడుమ అది కూదరడం లేదు''అని రజనీకాంత్ చెప్పారు.

''తమిళనాడులోని భిన్న ప్రాంతాల్లో ప్రచారం చేపట్టేందుకు వెళ్లొద్దని వైద్యులు నాకు సూచించారు. ఇప్పుడు నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. మీ అందరి ప్రార్థనల వల్ల నేను కోలుకున్నాను''

''ఈ పోరాటంలో నా ప్రాణాలు కోల్పోయినా నాకు సంతోషమే. కానీ... వెనకడుగు మాత్రం వేయను''.

''తమిళనాడులో రాజకీయ మార్పు రావాల్సిన అవసరముంది. అన్నీ మారాలి. చాలా అంశాల్లో మార్పు రావాలి''.

''నేను ఇలా ఉన్నానంటే మీరే కారణం. నాకు ప్రజలే సర్వస్వం. నేను గెలిస్తే ప్రజలు గెలిచినట్టే. నేను విఫలమైతే, ప్రజలు విఫలమైనట్లే. అందుకే అందరూ నా వెనుక నిలబడాలి''.

''ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న సినిమా షూటింగ్ ఒక 40 శాతం మిగిలి వుంది. దాన్ని పూర్తి చేయడం నా బాధ్యత''.

''అది పూర్తిచేసిన తర్వాత.. పార్టీ కార్యకలాపాలపై పూర్తి దృష్టి కేంద్రీకరిస్తాం. ఇప్పటికే చాలా పనులు మొదలయ్యాయి. తమిళ్‌రువి మణియన్‌ను పార్టీ వ్యవహారాల బాధ్యుడిగా నియమించాను. నాతో కలిసి పనిచేయడానికి ఆయన అంగీకారం తెలిపారు. పార్టీ చీఫ్ కో ఆర్డినేటర్‌గా అర్జునమూర్తిని నియమించాను''.

''ఈ పోరాటంలో విజయం సాధిస్తానని నమ్మకముంది. తమిళనాడు మారేందుకు సమయం ఆసన్నమైంది. రాజకీయ, ప్రభుత్వ మార్పు కచ్చితంగా వస్తుంది''అని రజనీ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)