అరుంధతీ రాయ్‌ పుస్తకాన్ని సిలబస్‌ నుంచి తొలగించిన తమిళనాడు ప్రభుత్వం

అరుంధతీ రాయ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అరుంధతీ రాయ్

ఆరెస్సెస్‌ అనుబంధ విద్యార్ధి సంఘం అఖిల భారతీయ విద్యార్ధి పరిషద్‌ (ఏబీవీపీ) అభ్యంతరాలతో తమిళనాడు తిరునెల్వేలిలోని మనోన్మణియం సుందరనార్‌ యూనివర్సిటీ సిలబస్‌ నుంచి అరుంధతీ రాయ్‌ రచించిన పుస్తకాన్ని తొలగించారు.

2017 సంవత్సరం మాస్టర్ ఆఫ్‌ ఆర్ట్స్‌ ఇంగ్లీషులో అరుంధతీరాయ్‌ ‘వాకింగ్‌ విత్‌ ది కామ్రేడ్స్‌’ పుస్తకాన్ని సిలబస్‌గా పెట్టారు. అరుంధతీ రాయ్‌ తాను మావోయిస్టులతో రహస్య ప్రదేశాలలోజరిపిన సమావేశాల ఆధారంగా ఈ పుస్తకాన్ని రచించారు.

గతవారం ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు వైస్‌ ఛాన్సలర్‌ కె.కె.పిచుమణిని కలిసి ఈ పుస్తకంపై నిరసన తెలిపారు. దాన్ని తొలగించాలని డిమాండ్‌ చేశారు.

“ఈ పుస్తకాన్ని గత మూడేళ్లుగా సిలబస్‌లో కొనసాగించడం దురదృష్టకరం. నక్సలైట్, మావోయిస్టు భావజాలాన్ని విద్యార్ధుల మీద రుద్దుతున్నారు. ఈ పుస్తకాన్ని సిలబస్‌గా కొనసాగించడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని వెంటనే తొలగించాలి. విశ్వవిద్యాలయం క్షమాపణ చెప్పాలి’’ అని వైస్‌ ఛాన్సలర్‌కు రాసిన లేఖలో ఏబీవీపీ పేర్కొంది.

అరుంధతీ రాయ్

ఫొటో సోర్స్, Getty Images

తక్షణమే తొలగింపు

ఈ పుస్తకం స్థానంలో ఎం.కృష్ణన్ రాసిన 'మై నేటివ్ ల్యాండ్: ఎస్సేస్ ఆన్ నేచర్' అనే పుస్తకాన్ని ఎం.ఏ ఇంగ్లీష్‌ సిలబస్‌లో చేర్చింది విశ్వవిద్యాలయం.

“గత మూడేళ్లుగా ఈ పుస్తకం సిలబస్‌లో ఉందన్న విషయం మా దృష్టికి రాలేదు. ఎం.ఏ చదువుతున్న మా కార్యకర్త ఒకరు ఈ సమాచారం ఇచ్చారు. దీంతో మేం దీన్ని తొలగించాలని డిమాండ్‌ చేశాం’’ అని ఏబీవీపీ దక్షిణ తమిళనాడు జాయింట్‌ సెక్రటరీ సి. విఘ్నేశ్‌ బీబీసీతో అన్నారు.

సిలబస్ నుండి ఈ పుస్తకాన్ని తొలగించడాన్ని బీజేపీ స్వాగతించగా, డీఎంకే, సీపీఎం ఖండించాయి. విద్యార్థుల మేలు కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని యూనివర్సిటీ ఛాన్సలర్‌ అన్నారు.

తమిళనాడులోని ఇతర విశ్వవిద్యాలయాలలోని సిలబస్‌లను కూడా పరిశీలించాలని నిర్ణయించామని ఏబీవీపీ వెల్లడించింది.

అరుంధతీ రాయ్ పుస్తకం

‘వాకింగ్ విత్ ది కామ్రేడ్స్’ పుస్తకంలో ఏముంది?

ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌ గతంలో తన రచనలకు బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకున్నారు. 2010లో ఆమె మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో సందర్శించారు. ఆ అనుభవాల ఆధారంగా ‘వాకింగ్‌ విత్‌ ది కామ్రేడ్స్‌’ అనే పుస్తకం రాశారు.

ఈ పుస్తకంలో ఆమె మావోయిస్టుల అనుభవాలను పొందుపరిచారు. మావోయిస్టులు ఆయుధాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఈ పుస్తకం 2011లో తొలిసారి ప్రచురితమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)