అటల్ టన్నెల్: ప్రపంచంలోనే అతి పెద్ద సొరంగ మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

అటల్ టన్నెల్

ఫొటో సోర్స్, BJP/Twitter

హిమాలయాల్లోని రోహ్‌తాంగ్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద సొరంగం మార్గం అటల్ టన్నెల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.

లద్దాఖ్‌ను చేరుకోవడానికి ఉన్న రెండు మార్గాల్లో లేహ్-మనాలి హై వే - రోహ్‌తాంగ్ పాస్ ఒకటి. అయితే, ప్రతి సంవత్సరం ఐదారు నెలల పాటు హిమాచల్‌ప్రదేశ్‌లోని రోహ్‌తాంగ్ పాస్ వద్ద విపరీతమైన మంచు కురుస్తుంది. ఆ సమయంలో రోహ్‌తాంగ్ పాస్‌ను మూసివేస్తారు.

ఈ సమస్యను అధిగమించడానికి మనాలి, లేహ్ లను అనుసంధానిస్తూ భారీ సొరంగం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దీనిని మొదట్లో రోహ్‌తాంగ్ సొరంగం అని పిలిచేవారు. 2019లో వాజ్‌పేయి పేరు మీదుగా ఈ సొరంగానికి "అటల్ టన్నెల్" అని ప్రధాని మోదీ నామకరణం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

'అటల్ టన్నెల్' విశేషాలు

మనాలీ, లాహౌల్, స్పీతీ లోయలను కలుపుకుంటూ పోయే ఈ సొరంగ మార్గం 9.02 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ సొరంగ మార్గంలో ఏడాది పొడవునా ప్రయణించవచ్చు. ఇది మనాలి, లేహ్‌ల మధ్య దూరాన్ని 46 కిలోమీటర్లు తగ్గిస్తుంది.

అటల్ టన్నెల్

ఫొటో సోర్స్, Getty Images

హిమాలయాల్లోని పిర్ పంజల్ పర్వత శ్రేణులవద్ద, సముద్ర మట్టానికి 3,000 మీటర్ల (10,000 అడుగుల) ఎత్తులో, అత్యాధునిక సదుపాయాలతో అటల్ సొరంగాన్ని నిర్మించారు.

ఇది గుర్రపు నాడా ఆకారంలో ఉంటుంది. ఇందులో వచ్చే దారి, పోయే దారులతో రెండు మార్గాలు ఉంటాయి. దీని వెడల్పు 8 మీటర్లు. ఎత్తు 5.525 మీటర్లు. ఇది ఒక సింగిల్ ట్యూబ్ (ఒకటే గొట్టం) టన్నెల్.

అటల్ టన్నెల్

ఫొటో సోర్స్, Getty Images

ఈ సొరంగం నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చు సుమారు 3,300 కోట్ల రూపాయలు. దేశ రక్షణ, భద్రతల దృష్ట్యా ఈ అటల్ టన్నెల్ చాలా ముఖ్యమైనది.

అటల్ టన్నెల్ మార్గంలో 587 మీటర్ల విస్తీర్ణంలో ఉన్న సెరి నలా ఫాల్ట్ జోన్‌లో సొరంగం తవ్వడానికి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక్కడి భౌగోళిక, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ భాగంలో సొరంగం నిర్మించడం కష్టతరమైంది.

అటల్ టన్నెల్

ఫొటో సోర్స్, BJP@Twitter

ఎట్టకేలకు 2017 అక్టోబర్ 15న ఈ ప్రాంతంలో రెండూ వైపుల నుంచీ సొరంగాన్ని తవ్వగలిగారు.

ఈ సొరంగ మార్గంలో ప్రతీ 150 మీటర్లకు టెలిఫోన్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రతీ 60 మీటర్లకు అగ్నిమాపక వ్యవస్థ (ఫైర్ హైడ్రాంట్), ప్రతీ 500 మీటర్లకు అత్యవసర నిష్క్రమణ ద్వారాలు (ఎమెర్జన్సీ ఎగ్జిట్స్) ఉన్నాయి.

అటల్ టన్నెల్

ఫొటో సోర్స్, BJP/Twitter

ఈ సొరంగంలో ప్రతీ 2.2 కిలోమీటర్లకు ఒక మలుపు వస్తుంది. ప్రతీ కిలోమీటరుకు గాలి నాణ్యతను కొలిచే మానిటర్లను అమర్చారు. అంతే కాకుండా, ప్రతీ 250 మీటర్లకు బ్రాడ్‌కాస్టింగ్ వ్యవస్థ, ఏదైనా సంఘటన లేదా ప్రమాదం జరిగిన వెనువెంటనే గుర్తించేందుకు వీలుగా సీసీటీవీ కెమెరాలతో కూడిన వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

ఇటీవల భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, యుద్ధ భయంతో జీవిస్తున్న లేహ్ ప్రజలు అటల్ టన్నెల్ సొరంగం ప్రారంభమయినందుకు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సొరంగం తెరవడంతో లద్దాఖ్ భవిష్యత్తు ఉజ్వలంగా మారబోతోందని నాకు నమ్మకం ఉంది. రెండూ వైపులా కలిపితే దాదాపు 96 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీనివల్ల రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది అని లేహ్‌కు చెందిన ఒక డీలర్ సీఎస్ రాథోడ్ తెలిపారు.

నరేంద్రమోదీ

ఫొటో సోర్స్, @BJP/twitter

ఫొటో క్యాప్షన్, అటల్ టన్నెల్‌ను ప్రధాని మోదీ రిబ్బన్ కత్తరించి ప్రారంభించారు

అటల్ టన్నెల్‌తో లద్దాఖ్‌కు కొత్త జీవితం: మోదీ

హిమాచల్ ప్రదేశ్‌లోని అధిక భాగానికే కాకుండా లద్దాఖ్‌కు కూడా అటన్ టన్నెల్ కొత్త ఊపిరిలూదుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

శనివారం నాడు మోదీ 'అటల్ టన్నెల్' ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ.. "హిమాచల్ ప్రదేశ్‌తో పాటూ గత ఏడాది యూనియన్ టెరిటరీగా మారిన లద్దాఖ్‌కు కూడా అటల్ టన్నెల్ జీవనరేఖగా మారనుందని, ఈ సొరంగం ప్రారంభం కావడంతో లేహ్-లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్ అతి త్వరలో అభివృద్ధి పథంలోకి ప్రయాణిస్తాయి" అని తెలిపారు.

ఈ సొరంగం వలన మనాలి, కెలాంగ్‌ల మధ్య మూడు నాలుగు గంటల ప్రయాణ సమయం తగ్గుతుందని చెప్తూ, దీనివల్ల ఇక్కడి ప్రజలు ఎంతో లాభం పొందుతారని మోదీ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఇకపై ఏడాది పొడువునా లద్దాఖ్‌కు రాకపోకలు సాగించవచ్చని, దేశంలోని మిగతా భాగాలతో సత్సంబంధాలు కొనసాగించవచ్చనీ, కనెక్టివిటీకి, అభివృద్ధికి నేరుగా సంబంధం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు.

ఇదొక 'చారిత్రాత్మకమైన రోజు' అని అభివర్ణిస్తూ మాజీ ప్రధాని వాజ్‌పేయి కలలు నెరవేరాయని, హిమాలయా ప్రజల సుదీర్ఘ నిరీక్షణ ఫలించిందని తెలిపారు.

సరిహద్దుల్లో అత్యాధునిక రీతిలో మౌలిక సదుపాయల నిర్మాణానికి ఈ సొరంగం ఒక ఉదాహరణగా నిలుస్తుందని చెప్తూ, ఈ సొరంగం నిర్మాణంలో పాలుపంచుకున్నవారందరికీ ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)