రైల్వే ప్రైవేటీకరణ- ఈ ఒప్పందం వల్ల ఎవరికి ఎంత ప్రయోజనం, ఎంత లాభం?

ముంబయి రైల్వే

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతీయ రైల్వే 109 మార్గాల్లో రైళ్లు నడిపేందుకు ప్రైవేటు కంపెనీల నుంచి ‘రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్’(ఆర్ఎఫ్‌క్యూ) ఆహ్వానించింది. 2023 ఏప్రిల్‌లో ప్రైవేటు రైలు సేవలు ప్రారంభిస్తామని రైల్వే బోర్డు చైర్మన్ చెప్పారు.

ఈ ప్రాజెక్టు కింద ప్రైవేటు రంగం నుంచి రైల్వేలోకి రూ.30 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని రైల్వే తరఫున విడుదలైన ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ రైల్వే నెట్‌వర్కులో ఇలా ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ కోసం ప్రైవేటు పెట్టుబడులకు ప్రయత్నించడం మొదటిసారి జరుగుతోంది.

“ఈ ప్రాజెక్టు ద్వారా రైల్వేలో కొత్త టెక్నాలజీ తీసుకురావడం, మరమ్మతుల ఖర్చు, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ఉద్యోగాలు, భద్రత మరింత పెంచడం, ప్రయాణికులకు అత్యున్నత స్థాయి సౌకర్యాలు కల్పించడమే మా ఉద్దేశం” అని రైల్వే తమ ప్రకటనలో చెప్పింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ ప్రైవేటీకరణ ప్రయత్నాల కింద 109 రైలు మార్గాల్లో అధునాతన రైళ్లను ప్రారంభిస్తారు. ఈ రైళ్లలో ప్రతి రైలుకూ కనీసం 16 బోగీలు ఉంటాయని ఇండియన్ రైల్వే చెబుతోంది.

ఈ రైళ్లన్నింటినీ భారత్‌లోనే తయారు చేస్తారు. వాటికి నిధులు అందించడం, నడిపించడం, పర్యవేక్షణ బాధ్యతలను ప్రైవేటు కంపెనీలకు ఇస్తారు. ఈ ప్రాజెక్టు గడువు 35 ఏళ్లు ఉంటుందని రైల్వే చెబుతోంది.

నిర్ధరిత మార్గాల్లో రైళ్లు ప్రారంభించే ప్రైవేటు కంపెనీలు, రైల్వే నిర్ధరించిన హాలేజ్ చార్జ్, ఇంధన చార్జీలతోపాటూ మొత్తం ఆదాయంలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ధరలను టెండర్ల ద్వారా నిర్ణయిస్తారు.

భారతీయ రైల్వే దేశంలోని రైల్వే నెట్‌వర్కును 12 క్లస్టర్లుగా విభజించింది. ఈ క్లస్టర్లలోని 109 మార్గాల్లో అన్ని జతల ప్రైవేటు రైళ్లను నడిపించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.

ఈ ప్రైవేటు రైళ్ల కోసం ఇండియన్ రైల్వే తమ తరఫున గార్డ్, డ్రైవర్‌ను మాత్రమే ఇస్తుంది. మిగతా అన్ని ఏర్పాట్లూ ప్రైవేటు కంపెనీలే చేసుకోవాల్సి ఉంటుంది.

రైల్వే ప్రైవేటీకరణ

ఫొటో సోర్స్, getty images

విపక్షాల నుంచి ప్రశ్నలు

ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్‌లో ప్రశ్నలు సంధించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

“పేదలకు ఉన్న ఒకే ఒక జీవనాధారం రైలు. ప్రభుత్వం వారి నుంచి వాటిని కూడా లాక్కుంటోంది. ఏం లాక్కుంటారో, లాక్కోండి. కానీ, దేశ ప్రజలు దీనికి తగిన సమాధానం ఇస్తారని గుర్తుంచుకోండి” అని ట్వీట్ చేశారు.

లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరి కూడా దీనిపై ట్విటర్ ద్వారా స్పందించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

“109 జతల రైళ్లను ప్రైవేటీకరణ చేయడం సులభమే. కానీ ఎవరి ప్రయోజనం కోసం. ఆదాయం సంపాదించడానికి జాతీయ సంపద అయిన రైల్వేను ఇలా ప్రైవేటీకరణ చేయకూడదు. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలపై మరోసారి ఆలోచించాలి” అన్నారు.

“ఇప్పుడు ప్రభుత్వం మన అతిపెద్ద జాతీయ సంపదలో ఒక పెద్ద భాగాన్ని విక్రయించాలని తహతహలాడుతోంది. రైల్వే దుస్థితికి ప్రైవేటీకరణ పరిష్కారం కాదు. అది రైల్వేల అసమర్థత. దేశం ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో సతమతం అవుతోంది. ఇప్పుడు 109 రైళ్ల ప్రైవేటీకరణ అంటే, ప్రజలకు పుండుమీద కారం చల్లడమే అవుతుంది” అన్నారు.

ఐఆర్‌సీటీసీ ఈ మోడల్ రైళ్లు నడుపుతోంది.

భారతీయ రైల్వే క్యాటరింగ్ కంపెనీ ఐఆర్‌సీటీసీ ఇదే మోడల్లో మూడు మార్గాల్లో ఎక్స్ ప్రెస్ రైళ్లను నడుపుతోంది.

దిల్లీ-లఖ్‌నవూ, ముంబయి-అహ్మదాబాద్ మధ్య నడిచే రెండు తేజస్ ఎక్స్ ప్రెస్‌ రైళ్లు, దిల్లీ-వారణాసి మధ్య నడిచే మహాకాల్ ఎక్స్ ప్రెస్ నిర్వహణ ఐఆర్‌సీటీసీ చేతుల్లో ఉంది.

తేజస్ ఎక్స్ ప్రెస్ ప్రారంభమైనప్పుడు దానిని రైల్వే ప్రైవేటీకరణలో ఒక ప్రయోగంగా చెప్పారు. ఇప్పుడు మిగతా మార్గాల్లో కూడా ప్రైవేటు రైళ్లను నడిపించాలనే ఈ ప్రయత్నంతో రైల్వే ప్రైవేటీకరణ దిశగా మరో అడుగు పడింది.

దిల్లీ నుంచి లఖ్‌నవూ వెళ్లే తేజస్ ఎక్స్ ప్రెస్ టికెట్ ధర అదే రూట్‌లో నడిచే రాజధాని ఎక్స్ ప్రెస్ కంటే ఎక్కువగా ఉంటుంది.

రైల్వే ప్రైవేటీకరణ

ఫొటో సోర్స్, getty images

ప్రయాణికులపై మరింత భారం

ఐఆర్‌సీటీసీ ఉద్యోగ సంఘానికి చెందిన సుర్జీత్ శ్యామలా రైల్వే ప్రైవేటీకరణ ప్రస్తావన గురించి బీబీసీతో మాట్లాడారు.

“ఇది రైల్వే సిబ్బందినే కాదు, ప్రయాణికుల జేబుపై కూడా దెబ్బ కొడుతుంది. రైలు చార్జీల్లో ప్రయాణికులకు 43 శాతం సబ్సిడీ లభిస్తుంది. ప్రైవేటు కంపెనీలు ఆ రాయితీలను ప్రయాణికులకు ఇవ్వవు. అలాంటప్పుడు పేద, మధ్యతరగతి ప్రయాణికుల జేబులపై ఆ భారం పడుతుంది” అన్నారు.

“ప్రైవేటీకరణ చేస్తే మెరుగైన సేవలు లభిస్తాయని ఇప్పుడు జనాలకు అనిపిస్తోంది. కానీ నిజానికి అలా జరిగేది సందేహమే. రైల్వేలో క్యాటరింగ్ మొదటి నుంచీ ఐఆర్‌సీటీసీ చేతుల్లోనే ఉంది. రైల్వేలో అది కూడా ప్రైవేటు కంపెనీనే. దాని క్యాటరింగ్ పట్ల జనం సంతృప్తిగా ఉన్నారా?” అని సుర్జీత్ ప్రశ్నించారు.

“ఈ ప్రతిపాదనలతో దేశంలోని కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ఉద్యోగులను దోపిడీ చేసే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది” అని ఆరోపించారు.

“ప్రభుత్వానికి ఆదాయం వచ్చినపుడు, ఆ నిధులను దేశాభివృద్ధికి ఉపయోగిస్తుంది. స్కూళ్లు తెరుస్తుంది. ఆరోగ్య సేవలు మెరుగవుతాయి. కానీ రైల్వే సంపాదన ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతే దానివల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు” అంటారు సుర్జీత్.

వీడియో క్యాప్షన్, వీడియో: భారత్‌లో డైనింగ్ కారున్న ఏకైక రైలు దక్కన్ క్వీన్

రైల్వేకు లాభాలు తెచ్చిపెడుతుందా?

ఈ ప్రైవేటీకరణ ప్రతిపాదన వల్ల రైల్వేలోకి 30 వేల కోట్ల రూపాయల వరకూ ప్రైవేటు పెట్టుబడులు వస్తాయని, ప్రయాణికులకు మెరుగైన సేవలు లభిస్తాయని రైల్వే ఆశిస్తోంది. రైల్వేకు ఇది నిజంగా లాభసాటి ఒప్పందమేనా?

రైల్వే ఈ ప్రతిపాదన విజయవంతం కావడంపై రైల్వే బోర్డు నుంచి రిటైరయిన అధికారి శ్రీప్రకాష్‌కు సందేహాలు ఉన్నాయి.

“రైల్వే ప్రయోగం విజయవంతం అవుతుందని నాకు అనిపించడం లేదు. ప్రైవేట్ రైళ్ల ఆపరేటర్లు, భారతీయ రైల్వే మధ్య వివాదాలు కూడా రావచ్చు. ఇప్పుడు ఆ వివాదాలు పరిష్కరించడానికి ఎలాంటి మెకానిజం లేదు. రైల్వే దగ్గర ఎలాంటి రెగ్యులేటర్ కూడా లేదు. రైల్వేను ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటే, మొదట రెగ్యులేటర్ నియమించాల్సి ఉంటుంది. వివాదాలు పరిష్కరించే వ్యవస్థ లేనంతవరకూ ఏ ప్రైవేటీకరణ ప్రతిపాదనా విజయవంతం కాదు” అన్నారు.

ప్రైవేటీకరణ వల్ల, ప్రైవేటు రైళ్లలో ప్రయాణికులకు విస్తృత సౌకర్యాలు లభిస్తాయని రైల్వే చెబుతోంది.

శ్రీప్రకాష్‌కు దానిపై కూడా సందేహాలు ఉన్నాయి.

“ప్యాసింజర్ రైళ్ల ప్రైవేటీకరణ ప్రయత్నం రైల్వే ఇంతకు ముందు కూడా చేసింది. ఐఆర్‌సీటీసీ తన ప్రత్యేక పర్యటక రైళ్లను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వాలని ప్రయత్నించింది. అవేవీ విజయవంతం కాలేదు. మహారాజా ఎక్స్ ప్రెస్‌ను ప్రైవేటు కంపెనీకి ఇచ్చారు. కానీ, తర్వాత దాన్ని రైల్వే స్వయంగా నడపాల్సి వచ్చింది. ఒకవేళ ఏదైనా కంపెనీ వచ్చినా, డబ్బులు పెట్టినా, ఆ ప్రయత్నం విజయవంతం కాలేదంటే తర్వాత రైల్వేనే దాన్ని టేకోవర్ చేయాల్సుంటుంది. ప్రైవేటీకరణ గురించి ఇంకా పెద్దగా స్పష్టత రాలేదు” అంటున్నారు.

“ఇప్పుడు ఐఆర్‌సీటీసీ తేజస్ ఎక్స్ ప్రెస్ నడిపిస్తోంది. అందులో కూడా ప్రయాణికులకు లభించే రాయితీలు అందించడం లేదు. ప్రైవేటు కంపెనీలు రైళ్లు నడిపిస్తే, ప్రయాణకులకు రాయితీ లభించదు. బదులుగా ప్రైవేటు కంపెనీలకు లాభాలు వస్తాయి” అని శ్రీప్రకాష్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, వీడియో: నిరుపేదల బతుకు బండి ఇది!

ప్రైవేటు రైళ్లకు మిగతా ప్యాసింజర్ రైళ్లతో పోటీ ఉంటుందని శ్రీప్రకాష్ భావిస్తున్నారు. అలాంటప్పుడు ప్రస్తుతం ఉన్న రైళ్లలో లేనంతగా, ప్రైవేటు రైళ్లలో వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి సేవలు అందిస్తారు అనే ప్రశ్నలు వస్తాయని అన్నారు.

ప్రైవేటీకరణ చేసిన తర్వాత కూడా రైల్వే టైంటేబుల్ నిర్ధరించే హక్కు భారతీయ రైల్వే దగ్గరే ఉంటుంది.

”రైలు ప్రయాణాల ముఖ్య ఉద్దేశం ఒక చోటు నుంచి ఇంకో చోటుకు చేరుకోవడమే. ప్రైవేటు రైళ్లు వచ్చినపుడు, వాటికి అదే రూట్‌లో ఉన్న మిగతా రైళ్ల నుంచి పోటీ ఉంటుంది. వాటి చార్జీలు చాలా ఎక్కువగా ఉంటే, వాటికి విమాన సేవలతో కూడా పోటీ వస్తుంది. అలాంటప్పుడు ప్రైవేటు రైళ్లు ప్రయాణికులను ఆకర్షించేలా ఎలాంటి కొత్త రకం సేవలు అందించగలవు అనే ప్రశ్న వస్తుంది. ప్రైవేటీకరణ ప్రతిపాదన వల్ల ప్రయాణికులకు ఏదైనా వాస్తవిక ప్రయోజనం ఉంటుందని నాకైతే అనిపించడం లేదు” అంటారు శ్రీవాస్తవ.

ఉద్యోగ సంఘాల హెచ్చరిక

ఇటు రైల్వే ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.

ప్రభుత్వ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్(సీటూ) కార్మిక సంస్థల యూనియన్ హెచ్చరించాయి. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పాయి. ఈ నిర్ణయం తీసుకోడానికి లాక్‌డౌన్ సమయాన్ని ఎంచుకోవడం, ప్రభుత్వ ఆలోచనలకు అద్దం పడుతోందని అవి ఆరోపించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)