పాకిస్తాన్‌ మాజీ సైనిక నియంత జియా ఉల్-‌హక్‌పై వ్యంగ్య నవలను స్వాధీనం చేసుకున్న 'ఐఎస్ఐ ఏజెంట్లు'

జియా ఉల్-హక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జియా ఉల్-హక్

పాకిస్తాన్ మాజీ సైనిక నియంత జనరల్ జియా ఉల్-హక్, సైనిక బలగాల్లోని ఇతర అధికారులపై రాసిన తన వ్యంగ్య నవల 'ఎ కేస్ ఆఫ్ ఎక్స్‌ప్లోడింగ్ మ్యాంగోస్'ను ఐఎస్ఐ ఏజెంట్లు స్వాధీనం చేసుకున్నారని ప్రముఖ రచయిత, బీబీసీ మాజీ జర్నలిస్టు మొహమ్మద్ హనీఫ్ చెప్పారు.

ఈ రచన దశాబ్దం క్రితం ఇంగ్లిష్‌లో వెలువడినప్పుడు విమర్శకుల ప్రశంసలు అందుకొంది. విశేష పాఠకాదరణ పొందిన ఈ నవల ఇటీవలే ఉర్దూలోకి అనువాదమైంది.

1988లో అంతుచిక్కని విమాన ప్రమాదంలో చనిపోయిన జియా ఉల్-హక్ చివరి రోజులను కేంద్రంగా చేసుకొని ఈ నవల సాగుతుంది. ప్రమాదంలో అమెరికా రాయబారి కూడా చనిపోయారు. కేసు దర్యాప్తు వివరాలను ఇప్పటివరకు బయటపెట్టలేదు. ప్రమాదం వెనక కుట్ర ఉందనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

జియా ఉల్-హక్‌కు బహూకరించిన మామిడి పండ్ల బుట్టలో బాంబు ఉందని, అది పేలి విమానం కూలిపోయిందని చెప్పే వదంతి ప్రధానాంశంగా ఈ నవల సాగుతుంది.

రచయిత హనీఫ్‌కు గత నెల్లో జియా ఉల్-హక్ కుమారుడు పరువు నష్టం నోటీసు పంపించారు.

హనీఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రచయిత మొహమ్మద్ హనీఫ్ వైమానికదళంలో పైలట్‌గా పనిచేశారు. తర్వాత జర్నలిస్టు అయ్యారు. 'ఎ కేస్ ఆఫ్ ఎక్స్‌ప్లోడింగ్ మ్యాంగోస్' ప్రచురితమైనప్పుడు ఆయనకు ఎంతో పేరొచ్చింది.

కరాచీలోని ప్రచురణ సంస్థ 'మక్తబ్-ఎ-దన్యాల్' నుంచి, రాజధాని ఇస్లామాబాద్, లాహోర్ నగరాల్లోని పుస్తక దుకాణాల నుంచి నవల ప్రతులను ఐఎస్‌ఐ ఏజెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు హనీఫ్ చెప్పారు.

కరాచీలోని ప్రచురణ సంస్థ కార్యాలయంలో సోమవారం నవల ప్రతులను స్వాధీనం చేసుకున్న వ్యక్తులు తాము పాకిస్తాన్ నిఘా సంస్థ 'ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్‌ఐ)' ఏజెంట్లమని చెప్పారని ఆయన తెలిపారు.

"వాళ్లు ఐఎస్‌ఐ నుంచి వచ్చామన్నారు. ఎలాంటి అధికారిక గుర్తింపు కార్డూ చూపించలేదు. నవల ప్రతులన్నీ తీసుకెళ్లిపోయారు" అని హనీఫ్ బీబీసీతో చెప్పారు.

ప్రచురణ సంస్థ మేనేజర్‌ను వారు బెదిరించారని, తన వివరాలు అడిగారని, ఈ నవలను ఎక్కడెక్కడికి తరలించిందీ తెలిపే జాబితాలు తీసుకొనేందుకు తాము మళ్లీ వస్తామని చెప్పారని ఆయన పేర్కొన్నారు. పాత పుస్తకాలు చదవాలనుకొనేవారు కొంత మందే ఉంటారని, ఆ వ్యక్తులు వారిని భయపెట్టాలనుకొంటున్నారని అభిప్రాయపడ్డారు.

ఇస్లామాబాద్‌లోని ప్రముఖ పుస్తక దుకాణం సయీద్ బుక్ బ్యాంక్‌లో, లాహోర్‌లోని ఫిక్షన్ హౌస్‌ దుకాణంలోనూ ఇలాగే తన నవల ప్రతులను స్వాధీనం చేసుకున్నారని రచయిత చెప్పారు.

జియా ఉల్-హక్ విమాన ప్రమాదానికి కారణాలేమిటనేది ఇప్పటివరకు వెల్లడించలేదు.
ఫొటో క్యాప్షన్, జియా ఉల్-హక్ విమాన ప్రమాదానికి కారణాలేమిటనేది ఇప్పటివరకు వెల్లడించలేదు.

ఐఎస్‌ఐ ఏజెంట్లు ఈ పనిచేశారనే ఆరోపణలపై స్పందన కోసం పాకిస్తాన్ సైన్యాన్ని బీబీసీ సంప్రదించింది. అయితే సైన్యం నుంచి ఏ స్పందనా రాలేదు.

తన నవల 11 ఏళ్లుగా చదువుతున్నారని, ఎన్నడూ ఎవరూ తనను ఇబ్బంది పెట్టలేదని, ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారని హనీఫ్ ట్విటర్లో ప్రశ్నించారు. ఐఎస్‌ఐ ప్రపంచంలోనే నంబర్ 1 నిఘా సంస్థ అని, ఇలాంటి పనుల కన్నా పెద్ద బాధ్యతలు దానికి ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ప్రాచుర్యం కోసం ఒక జాతీయ సంస్థపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇదో చౌకబారు యత్నమని ఐఎస్‌ఐ అధికారి ఒకరు వార్తాసంస్థ అసోసియేటెడ్ ప్రెస్‌తో చెప్పారు.

హనీఫ్ వైమానికదళంలో పైలట్‌గా పనిచేశారు. తర్వాత జర్నలిస్టు అయ్యారు. 'ఎ కేస్ ఆఫ్ ఎక్స్‌ప్లోడింగ్ మ్యాంగోస్' తొలిసారిగా 2008లో ప్రచురితమైనప్పుడు ఆయనకు ఎంతో పేరొచ్చింది.

నవల

ఫొటో సోర్స్, Twitter/mohammedhanif

ఫొటో క్యాప్షన్, 'ఎ కేస్ ఆఫ్ ఎక్స్‌ప్లోడింగ్ మ్యాంగోస్' అనేక భాషల్లోకి అనువాదమైంది. ఉర్దూ అనువాదం మాత్రం 2019 నవంబరు వరకు విపణిలోకి రాలేదు.

ఈ నవలపై అప్పట్లో అంతర్జాతీయంగా ప్రశంసల వర్షం కురిసింది. 2008లో ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ పురస్కారానికి పరిశీలించిన రచనల ప్రాథమిక జాబితాలో ఇది స్థానం సంపాదించింది. తర్వాత పాకిస్తాన్ అంశాలపై ప్రముఖ కాలమిస్టుగా హనీఫ్ మరింత పేరుపొందారు. పాక్ సైన్యంపై ఆయన విమర్శనాత్మకంగా రాస్తుంటారు.

'ఎ కేస్ ఆఫ్ ఎక్స్‌ప్లోడింగ్ మ్యాంగోస్' అనేక భాషల్లోకి అనువాదమైంది. ఉర్దూ అనువాదం మాత్రం 2019 నవంబరు వరకు విపణిలోకి రాలేదు.

తర్వాత ఉర్దూ అనువాదాన్ని పాకిస్తాన్ వ్యాప్తంగా అనేక పుస్తక ఉత్సవాల్లో పెట్టి బాగా ప్రచారం కల్పించారు. దీనిని పాకిస్తాన్లో చాలా మంది చదివే అవకాశముంది. ఇది సైన్యానికి ఒక సమస్యలా అనిపించింది.

సైనిక తిరుగుబాట్ల చరిత్ర ఉన్న పాకిస్తాన్‌లో, గత దశాబ్దంలో సైన్యంపై విమర్శను సహించలేని పరిస్థితులు పెరిగిపోయాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)