ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది?

- రచయిత, ప్రొఫెసర్ హాల్ సొసబౌస్కి
- హోదా, ది కన్వర్జేషన్
సాధారణంగా చాలామంది మానసిక ఉల్లాసం కోసం మద్యం సేవిస్తుంటారు. ఆల్కహాల్ మితంగా తీసుకున్నప్పుడు మెదడు ఉత్తేజితమవుతుంది, శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. అప్పుడు శరీరంలో ఉత్పత్తయ్యే డోపమైన్, ఎండార్ఫిన్ లాంటి హార్మోన్లు మెదడును తాత్కాలికంగా ఉత్తేజపరుస్తాయి.
మరి, ఆల్కహాల్ ఎక్కువగా తాగితే ఎందుకు శరీరం అంత మత్తుగా ఉంటుంది? ఏ పనీ చేయాలనిపించదు ఎందుకు?
తినేదైనా, తాగేదైనా... ప్రతిదానికీ ఒక పరిమితి అంటూ ఉంటుంది. ఆల్కహాల్ విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, అతిగా ఆల్కహాల్ తీసుకుంటే మెదడులో క్రియాశీలత తగ్గిపోతుంది. నాడులు దెబ్బతింటాయి. గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. శ్వాస క్రియ కూడా నెమ్మదిస్తుంది. అది కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయవచ్చు.
ఆల్కహాల్ ప్రభావం వివిధ దశలుగా ఉంటుంది. ఆఖరి దశ మరణం. మద్యం ఎంత ఎక్కువగా తీసుకుంటే దుష్ప్రభావాల తీవ్రత అంతగా పెరుగుతుంది.
రక్తంలో ఆల్కహాల్ మెతాదు ఒక పరిమితి వరకు చేరుకున్నాక మొదట మాటల్లో తేడా వస్తుంది. నడకలోనూ మార్పు వస్తుంది. శరీర అవయవాల మధ్య సమన్వయం తగ్గుతుంది. తను చాలా తెలివిగల వ్యక్తినని అన్న భావన కలిగిస్తుంది. ఇంకా మద్యం తీసుకుంటూ ఉంటే కొంతసేపయ్యాక సోయి లేకుండా కిందపడిపోతారు. ఆలోచించే విచక్షణ కోల్పోతారు. అంటే, మెదడులో క్రియాశీలత బాగా తగ్గిపోతుంది.
ఆల్కహాల్ పరిమితి అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి కిక్కు చాలా తొందరగా, కొందరికి కాస్త ఆలస్యంగా రావచ్చు.
ఆల్కహాల్ రక్తనాళాలను వెడల్పు చేస్తుంది. శరీరంలోని ప్రతి అణువుకూ వెళ్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతి అవయవానికీ చేరుతుంది
ఇతర పదార్థాల కంటే ఆల్కహాల్ చాలా వేగంగా శరీరంలోకి వెళ్తుంది. జీర్ణాశయంలోకి వెళ్లిన మద్యం సరిగా జీర్ణం కాదు. కొంత ఆల్కహాల్ నేరుగా జీర్ణాశయం నుంచే (సాధారణంగా మిగతా పదార్థాలు చిన్నపేగు నుంచి వెళ్తాయి) రక్తంలో కలుస్తుంది. ఆ రక్తం ద్వారా మెదడు, కాలేయం సహా శరీరంలోని ప్రతి అవయవానికీ వెళ్తుంది.
ఆ తర్వాత ఆల్కహాల్ కణాలను విరిచేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుంది. అందుకోసం ఎంజైములను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. ఆ ఎంజైములు ఇతర పదార్థాల అణువులను విడగొడతాయి. అలా ఆల్కహాల్ (ethanol- C2H5OH) మొదట ఎసిటాల్డిహైడ్ (ethanal- C2H4O)గా విడిపోతుంది. ఎసిటాల్డిహైడ్ ఆ తర్వాత ఎసిటిక్ ఆమ్లంగా, ఆ తర్వాత కార్బన్డయాక్సైడ్గా విడిపోతుంది.
ఈ విచ్ఛన్న ప్రక్రియలోని దశల్లో కొంత శక్తి కూడా విడుదల అవుతుంది. బాగా మద్యం తాగేవారు కొందరు బరువు పెరగడానికి ఆ శక్తి (కెలోరీలు) కూడా ఒక కారణం.
మద్యం అతిగా తాగేవారికి ఎక్కువ శక్తి ఆల్కహాల్ నుంచి వస్తుంది కాబట్టి, తక్కువ ఆహారం తీసుకుంటారు. అప్పుడు వారికి కెలొరీలు మాత్రమే అందుతాయి తప్పితే కీలకమైన ఇతర పోషకాలు అందవు. అందుకే బరువు పెరుగుతారు, నీరసంగా... అనారోగ్యానికి గురైనట్లుగా కనిపిస్తుంటారు. పనులను చురుగ్గా చేయలేకపోతారు.
మద్యం అతిగా తాగేవారికి ఆల్కహాల్ నుంచి ఎక్కువ మొత్తంలో కెలొరీలు అందుతాయి. మొదట మద్యం మితంగానే తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. కానీ, స్వీయ నియంత్రణ లేకపోతే, క్రమంగా వ్యసనంగా మారే ప్రమాదం ఉంటుంది.
ఎసిటాల్డిహైడ్ వల్ల కాలేయం దెబ్బతింటుంది. హెపటైటిస్, కాలేయ క్యాన్సర్ లాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వాంతులు ఎందుకొస్తాయి?
ఆల్కహాల్ మొదటి దశ విచ్ఛిన్న ప్రక్రియలో ఏర్పడిన ఎసిటాల్డిహైడ్ అనే రసాయన పదార్థమే వాంతులకు కారణం. అంటే, ఆ రసాయనం మన శరీరంలో విడుదలైనప్పుడు వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది.
మద్యం ఎంత ఎక్కువ తాగితే, మీకు అంత ఎక్కువ వాంతులు రావచ్చు.
ఏదైనా పదార్థం తినగానే మీకు వాంతులు, వీరేచనాలు వస్తున్నాయంటే.. దాని అర్థం మీ శరీరం నుంచి ఆ పదార్థాన్ని బయటకు పంపించాలంటూ మెదడు ఇచ్చిన ఆఖరి సూచనగా భావించాలి. ఆల్కహాల్ విషయంలోనూ అలాగే అర్థం చేసుకోవాలి.
వాంతులు వస్తున్నా ఆగకుండా అదే పనిగా మద్యం తాగడం అంటే సముద్రంలో ఆటుపోట్లను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు లెక్క.

ఫొటో సోర్స్, Getty Images
హ్యాంగోవర్ దిగేదెలా?
దురదృష్టం ఏంటంటే... హ్యాంగోవర్ను తగ్గించేందుకు ప్రస్తుతం మందులు లేవు.
మత్తు దిగేదాకా తాగకుండా విరామం ఇవ్వడమే ఉత్తమైన మార్గం. కాలేయం ఒక గంటలో 8 నుంచి 12 గ్రాముల ఆల్కహాల్ను విచ్ఛిన్నం చేయగలదు. హ్యాంగోవర్ నుంచి బయటపడాలంటే మరింత ఆల్కహాల్ తాగకుండా ఉండాలి.
రెడ్ వైన్ తీవ్రమైన హ్యాంగోవర్కు కారణమవుతుంది. అందులో ఉండే రసాయ పదార్థం రక్త నాళాలు కుంచించికుపోయేలా చేస్తుంది. దాంతో తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
వోడ్కాతో అలాంటి సమస్యలు కాస్త తక్కువ. ఎందుకంటే "స్వచ్ఛమైన" వోడ్కాలో ఆల్కహాల్ మద్యం, నీరు మాత్రమే ఉంటాయి.
పడుకునే ముందు ఓ గ్లాసు నీళ్లు తాగితే హ్యాంగోవర్ను కాస్త తగ్గించేందుకు వీలుంటుంది.
ఆల్కహాల్ పీయూష గ్రంథిని నిలువరించి, వాసోప్రెసిన్ హార్మోన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. సాధారణంగా ఈ హార్మోన్ మూత్ర ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అప్పుడు... మీరు తాగే నీళ్ల కంటే ఎక్కువ నీరు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుంది. అది డీహైడ్రేషన్కు దారితీస్తుంది. రక్తంలో నీరు తగ్గడం వల్ల తలనొప్పి వస్తుంది.
- ప్రొఫెసర్ హాల్ సొసబౌస్కి, యూనివర్శిటీ ఆఫ్ బ్రింగ్టన్లో పబ్లిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సైన్స్ అధ్యాపకులు. ది కన్వర్జేషన్లో ప్రచురితమైన ఈ వార్తను క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కింద మీకు అందిస్తున్నాం.
ఇవి కూడా చదవండి:
- "మా అమ్మను ఎందుకు చంపారు... ఎంతోకాలంగా వాళ్లను అడగాలనుకున్న ప్రశ్న ఇది"
- శవాన్ని ఎరువుగా మారిస్తే ఇలా ఉంటుంది
- 'అనాథ' పాపకు పాలిచ్చి కాపాడిన మహిళా కానిస్టేబుల్
- తెలంగాణ: 'కోతుల బాధితుల సంఘం'... పొలం కాపలాకు లక్ష జీతం
- అరటిపండు తింటే హ్యాంగోవర్ దిగిపోతుందా
- రోబో చేతి మద్యం తాగాలంటే ఆ బార్కు వెళ్లాల్సిందే
- దక్షిణాది పురుషుల్లో తగ్గుతున్న వీర్య కణాలు.. ఏపీలో 5శాతం మందికి సంతాన లేమి
- మద్యపానం.. మితంగా తాగినా ముప్పే
- ‘దేశంలో ఎక్కువగా తాగేది తెలుగువాళ్లే’
- వర్జినిటీ కోల్పోవడానికి సరైన వయసంటూ ఒకటి ఉంటుందా?
- వైద్య పరీక్షల కోసం దానమిచ్చిన శవాన్ని ఏం చేస్తారు...
- 2020 నాటికి నేనేమవుతాను? ప్రపంచం ఏమవుతుంది? అని 29 ఏళ్ల కిందట ఊహించిన బాలుడు
- ఇరాన్కు అమెరికాపై ప్రతీకారం తీర్చుకోగల సత్తా ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








