జేఎన్‌యూ క్యాంపస్‌లో దాడి: భారతదేశం తన యువతరాన్ని దెబ్బతీస్తోందా...

జేఎన్‌యూ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నోబెల్ పురస్కారం అందుకున్న ఆర్థికవేత్త, లిబియా, నేపాల్ దేశాల మాజీ ప్రధానమంత్రులు, భారతదేశంలోని చాలా మంది ప్రముఖ రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, కళాకారులు, విద్యావేత్తలు ఎందరో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) పూర్వవిద్యార్థుల్లో ఉన్నారు. బోధన, పరిశోధనలకు అంతర్జాతీయంగా పేరున్న విద్యాసంస్థ జేఎన్‌యూ. భారత్‌లోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో ఇది ఒకటి.

ఈ నెల 5న ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించిన దుండగులు కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో జేఎన్‌యూ క్యాంపస్‌లో విద్యార్థులపై, అధ్యాపకులపై దాడికి తెగబడ్డారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు గంటకు పైగా ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. క్యాంపస్ బయట మరో గుంపు జాతీయవాద నినాదాలు చేస్తూ, జర్నలిస్టులను, అంబులెన్సులను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడింది. ఈ హింసలో దాదాపు 40 మంది గాయపడ్డారు.

ఈ హింసపై వామపక్ష, మితవాద విద్యార్థి సంఘాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. దాడికి పాల్పడ్డ గుంపులో ప్రధానంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కి చెందినవారు, బయటివారు ఉన్నారని ప్రత్యక్షసాక్షులు జర్నలిస్టులకు చెప్పారు.

విద్యార్థుల మీద పోలీసుల బలప్రదర్శన

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, జేఎన్‌యూ ఫీజుల పెంపు ప్రతిపాదన వివాదం గత కొన్ని నెలలుగా క్యాంపస్‌ను ఉద్రిక్తంగా మార్చింది

హాస్టల్ ఫీజు పెంపుపై వివాదమే ఈ హింసకు దారితీసిందని చెబుతున్నారు. ఈ వివాదంతో గత కొన్ని నెలలుగా విశ్వవిద్యాలయం అట్టుడుకుతోంది.

ప్రవేశాల ప్రక్రియను వ్యతిరేకిస్తున్న విద్యార్థుల గ్రూపే ఈ దాడికి పాల్పడిందని విశ్వవిద్యాలయ అధికారులు చెబుతున్నారు. ఫీజు పెంపును నిరసిస్తున్న వామపక్ష విద్యార్థులను దృష్టిలో ఉంచుకొనే వారు ఈ వ్యాఖ్యలు చేశారని చాలా మంది భావిస్తున్నారు.

అయితే, వామపక్ష రాజకీయాలకు కేంద్రంగా ఉన్న జేఎన్‌యూలో అసమ్మతిని అణచివేయాలని బీజేపీ యత్నిస్తోందనే భయాందోళనలు పెరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జేఎన్‌యూ నిరంతరం లక్ష్యంగా మారుతోంది. కొందరు విద్యార్థులు చేసిన ప్రసంగాలను తప్పుబడుతూ పోలీసులు వారిపై రాజద్రోహం కేసులు మోపారు. బీజేపీ, దాని అనుకూల మీడియా సంస్థలు జేఎన్‌యూను 'దేశ వ్యతిరేకి'గా చిత్రిస్తూ వస్తున్నాయి. 'పట్టణ ప్రాంత నక్సలైట్లు (అర్బన్ నక్సల్స్)' అంటూ జేఎన్‌యూ విద్యార్థులపై ముద్ర వేస్తూ వస్తున్నారు.

ఆదివారం నాటి దాడి దేశ రాజధానిలో శాంతిభద్రతలు ఎంతగా క్షీణించాయో స్పష్టం చేసింది. దిల్లీ శాంతిభద్రతల సంరక్షణ బాధ్యత దేశంలో ఇప్పుడు ఎంతో శక్తిమంతమైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాదే. దుండగులు భారత్‌లోని ఒక అత్యుత్తమ విశ్వవిద్యాలయంలోకే ప్రవేశించగలిగారు, విద్యార్థులను, అధ్యాపకులను పోలీసులు రక్షించలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నగరంలో సామాన్యులకు రక్షణ ఉందా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

జేఎన్‌యూ వద్ద పోలీసులు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఆదివారం నాడు హింస మరింత పెరగకుండా ఉండటానికి పోలీసులు క్యాంపస్‌ను మూసివేశారు

బీజేపీ తరహా రాజకీయాలు ముందే అనుకున్నట్లు విపరిణామాలకు దారితీస్తున్నాయని బీజేపీ వ్యతిరేకులు చెబుతున్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ, అమిత్ షాలు తమ రాజకీయ ప్రత్యర్థులను, విమర్శకులను 'దేశ వ్యతిరేకులు', 'అర్బన్ నక్సల్స్' అని ఆరోపిస్తూ వారిని ప్రజాకంటకులుగా చిత్రీకరిస్తున్నారు.

అన్ని నిరసనలనూ దేశ వ్యతిరేకమైనవిగా వ్యాఖ్యానించడం వల్ల (జేఎన్‌యూ దాడి) లాంటి హింసాత్మక చర్యలను సమర్థించే వాతావరణం ఏర్పడుతోందని రాజనీతి శాస్త్రవేత్త సుహాస్ పాల్షికర్ అభిప్రాయపడ్డారు. అవతలి మనిషిపై అనుమానం, విద్వేషం కలిగించే వాతావరణాన్ని ఒక ప్రణాళిక ప్రకారం కల్పిస్తున్నారని చెప్పారు.

ఇలాంటి వాతావరణం కల్పించడం వల్ల అసమ్మతిని, భిన్నాభిప్రాయాన్ని సహించలేకపోతున్నారు.

''విద్యాకేంద్రాల్లో సైద్ధాంతిక విభేదాలను క్రూరమైన బలప్రయోగంతో అణచివేసే, ఈ అణచివేత పట్ల రాజ్యం ప్రేక్షకపోత్ర పోషించే కాలంలో మనం బతుకుతున్నామని ఆదివారం నాటి జేఎన్‌యూ ఘటన చాటుతోంది'' అని సీనియర్ జర్నలిస్టు, జేఎన్‌యూ పూర్వవిద్యార్థి రోషన్ కిశోర్ వ్యాఖ్యానించారు.

జేఎన్‌యూ వద్ద పోలీసులు

ఫొటో సోర్స్, Reuters

'జేఎన్‌యూ: ద మేకింగ్ ఆఫ్ ఎ హిస్టరీ' రచయిత రాకేష్ బటాబ్యాల్, ''ఈ యూనివర్సిటీ విద్యార్థుల్లో అద్భుతమైన భిన్నత్వం ఉంది. అన్ని కులాల, మతాల, లింగాల, తరగతుల వాళ్లూ వీరిలో ఉన్నారు. పేదలు - సంపన్నులు, ప్రముఖులు - అనామకులు, నగరంలో పెరిగిన పిల్లలు - గ్రామాల నుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ కలుస్తారు. కలిసి చదువుకుంటారు. కలిసి నివసిస్తారు. ఈ క్యాంపస్ ఒక రకమైన విప్లవం'' అని అన్నారు.

''ఆదివారం జరిగిన ఘటన ఈ క్యాంపస్ ఎన్నడూ కనీ విరుగని సంఘటన'' అని అధ్యాపకుడు అతుల్ సూద్ పేర్కొన్నారు.

అయితే.. హింసాత్మక ఘర్షణ జేఎన్‌ఏకి కొత్త కాదు. 1980ల్లో ప్రవేశాల విధానాన్ని మార్చే ప్రణాళికల విషయమై.. అధ్యాపకులు - విద్యార్థులు ఘర్షణ పడ్డారు. క్యాంపస్‌లో ''అరాచకం'' గురించి వార్తాపత్రికలు పతాక శీర్షికల్లో రాశాయి. అధ్యాపకుల ఇళ్ల మీద విద్యార్థులు దాడి చేశారు. చాలా కథనాల ప్రకారం.. విద్యార్థులను పోలీసులు చితకబాదారు. అనేక మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. వారిలో దాదాపు 40 మందిని క్యాంపస్ నుంచి బహిష్కరించారు. ''క్యాంపస్‌లో రాజకీయాలకు 'బలప్రయోగం' అనేది కొత్త లక్షణంగా మారింది'' అని బటాబ్యాల్ పేర్కొన్నారు.

విద్యార్థుల ఆందోళన

ఫొటో సోర్స్, AFP

ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. హింస పట్ల ప్రభుత్వ స్పందన ఉదాసీనంగా ఉంది: నిరసన తెలుపుతున్న విద్యార్థులతో మాట్లాడటానికి ప్రభుత్వం నిరాకరించింది. క్యాంపస్‌లలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు లక్ష్యంగా దాడులు జరగటం.. గత డిసెంబర్ నుంచి జేఎన్‌యూ ఘటన మూడోది. దిల్లీ, అలీగఢ్‌లలోని రెండు ప్రముఖ యూనివర్సిటీల్లోని విద్యార్థులు పోలీసుల క్రూరత్వాన్ని చవిచూశారు.

''ప్రభుత్వం నిరంతరం విద్యార్థులను దుష్టులుగా చిత్రీకరిస్తుండటం వల్ల వారి మీద ఇటువంటి దాడులు జరిగే ముప్పు పెరుగుతూ పోతోంది. దాడిచేసిన వారికి ఎలాంటి శిక్షా ఉండటం లేదు. ప్రభుత్వం తన పౌరుల గొంతు వినటం అనివార్యం'' అంటారు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రతినిధి అవినాష్ కుమార్.

మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, భారతదేశ ప్రతిపక్షం విద్యార్థుల తరఫున పోరాటం అందుకోవటంలో విఫలమైంది. ''సొంత విశ్వవిద్యాలయాల మీద హింసను ఆమోదించే సమాజం. తన భవిష్యత్తు విధ్వంసాన్ని ఆమోదిస్తోందని భావించాలి'' అని కిషోర్ అన్నారు.

భారతదేశం విస్పష్టంగా తన యువతను దెబ్బతీస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)