నిర్భయ దోషులకు డెత్ వారెంట్, జనవరి 22న ఉరిశిక్ష

నిర్భయ దోషులు

ఫొటో సోర్స్, DELHI POLICE

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు దిల్లీలోని పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు నలుగురు దోషులకూ మరణశిక్షను అమలుచేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.

దీనికి ముందు నలుగురు దోషులనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు ప్రవేశపెట్టారు.

జడ్జి వారి పేర్లు అడుగుతూ, వారే దోషులని నిర్థరించుకున్నారు.

ఆ తర్వాత మీడియాను కోర్టు హాల్ నుంచి బయటకు పంపేశారు.

నిర్భయ కేసులో దోషులు నలుగురికీ శిక్షను అమలు చేయాలని, డెత్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ నిర్భయ తల్లి ఆశాదేవి పటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఈరోజు తన నిర్ణయాన్ని వెల్లడించింది.

జనవరి 22 లోపు (అంటే 14 రోజుల్లోపు) వారు క్యూరేటివ్ పిటిషన్, రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

అయితే, సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ వెల్లడించారు.

"ఒకట్రెండు రోజుల్లో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తాం. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్లైన ఐదుగురు జడ్జిలు దానిపై విచారణ జరుపుతారు. మొదటి నుంచి ఈ కేసు విషయంలో మీడియా, ప్రజలు, రాజకీయ నాయకుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఈ కేసులో నిష్పాక్షిక విచారణ జరగలేదు" అని ఏపీ సింగ్ అన్నారు.

నిర్భయ తల్లి ఆశాదేవి

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, నిర్భయ తల్లి ఆశాదేవి

"నా కుమార్తెకు న్యాయం జరిగింది. ఈ నలుగురు దోషులనూ ఉరితీస్తే దేశంలోని మహిళలకు ధైర్యం కలుగుతుంది. ఈ నిర్ణయంతో న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం మరింత పెరుగుతుంది" అని నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు.

"నాకు చాలా సంతోషంగా ఉంది. జనవరి 22 ఉదయం 7 గంటలకు దోషులను ఉరితీస్తున్నారు. ఈ నిర్ణయంతో ఇలాంటి నేరాలు చేయాలనుకునేవారిలో భయం పుడుతుంది" అని నిర్భయ తండ్రి బద్రీనాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని దిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ వ్యాఖ్యానించారు.

"ఇది ఈ దేశంలోని నిర్భయలందరి విజయం. ఏడేళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేసిన నిర్భయ తల్లిదండ్రులకు శాల్యూట్ చేస్తున్నా, అసలు వీరిని శిక్షించడానికి ఏడేళ్లు ఎందుకు పట్టింది? ఈ సమయాన్ని ఎందుకు తగ్గించకూడదు?" అని ఆమె ప్రశ్నించారు.

"ఇప్పుడు నిర్భయ ఆత్మ శాంతిస్తుంది. ఈ రోజు దేశంలోని ప్రతి అమ్మాయికి న్యాయం జరిగినట్లైంది" అని పంజాబ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ మనీషా గులాటీ అన్నారు.

క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం లేదా క్షమాభిక్ష దరఖాస్తు పెట్టుకుంటే చాలు.. డెత్ వారెంట్‌పై ఆటోమేటిగ్గా స్టే వస్తుందని మాజీ ఏఎస్జీ, సీనియర్ న్యాయవాది కేసీ కౌశిక్ బీబీసీకి తెలిపారు.

ప్రస్తుతం నలుగురు దోషులూ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఒకవేళ దాన్ని సుప్రీం కోర్టు తిరస్కరిస్తే, అప్పుడు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరవచ్చు.

అసలు ఆ రోజు ఏం జరిగింది?

దిల్లీలో 2012 డిసెంబర్ 16 రాత్రి 11 గంటల తర్వాత ఒక యువతి తన స్నేహితుడితో కలిసి బస్సు ఎక్కింది. బస్సులో అయిదుగురు పురుషులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెతో ఉన్న స్నేహితుడిని కొట్టారు.

చావుబతుకుల మధ్య ఉన్న వారిద్దరినీ రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఇది చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్చారు.

తీవ్రంగా గాయపడిన నిర్భయ మరణించింది. ఆ భయంకరమైన అనుభవం నుంచి కోలుకోలేకపోయినా గాయాల నుంచి కోలుకున్న ఆ స్నేహితుడు బతికాడు.

దేశవ్యాప్తంగా స్పందన

నిర్భయకు జరిగిన అన్యాయానికి యావద్దేశం తల్లడిల్లింది. నిందితులకు న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది.

వారిని ఎప్పుడు ఉరి తీస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రానప్పటికీ అందుకోసం ఉరితాళ్లు సిద్ధమవుతున్నాయి.

తీహార్ జైలు

ఫొటో సోర్స్, Getty Images

ఈ కేసులో ఎప్పుడేం జరిగింది?

2012 డిసెంబర్ 16: 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థినిపై నడుస్తున్న బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. విద్యార్థిని, ఆమె పురుష స్నేహితుడిని తీవ్రంగా కొట్టారు. ఇద్దరినీ రోడ్డు పక్కన విసిరేశారు.

2012 డిసెంబర్ 17: ప్రధాన నిందితుడు, బస్ డ్రైవర్ రామ్ సింగ్‌ను అరెస్టు చేశారు. తర్వాత కొన్ని రోజులకే అతడి తమ్ముడు ముకేశ్ సింగ్, జిమ్ ఇన్‌స్ట్రక్టర్ వినయ్ శర్మ, పండ్లు అమ్మే పవన్ గుప్తా, బస్ హెల్పర్ అక్షయ్ ఠాకూర్, 17 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు.

2012 డిసెంబర్ 29: సింగపూర్‌లోని ఒక ఆస్పత్రిలో బాధితురాలి మృతి. శవాన్ని తిరిగి దిల్లీకి తీసుకొచ్చారు.

2013 మార్చి 11: నిందితుడు రామ్ సింగ్ తీహార్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు అతడు అత్మహత్య చేసుకున్నాడని చెబితే, అతడి తరఫు వకీలు, కుటుంబ సభ్యులు మాత్రం అది హత్య అని ఆరోపించారు.

2013 ఆగస్టు 31: జువైనల్ జస్టిస్ బోర్డ్ మైనర్ నిందితుడిని దోషిగా తేల్చింది. మూడేళ్లపాటు జువైనల్ హోంకు పంపింది.

2013 సెప్టెంబర్ 13: ట్రయల్ కోర్టు నలుగురు నిందితులను దోషిగా ఖరారు చేస్తూ, ఉరిశిక్ష విధించింది.

2014 మార్చి 13: దిల్లీ హైకోర్టు ఉరిశిక్షను సమర్థించింది.

ఉరిశిక్ష

ఫొటో సోర్స్, Getty Images

2014 మార్చి-జూన్: నిందితులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ ఉరిశిక్షపై స్టే విధించింది.

2017 మే: హైకోర్టు, ట్రయల్ కోర్టు ఉరిశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది.

2018 జులై: సుప్రీంకోర్టు ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్ కొట్టివేసింది.

2019 డిసెంబర్ 6: కేంద్ర ప్రభుత్వం ఒక దోషి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి దగ్గరకు పంపింది. మంజూరు చేయవద్దని సిఫారసు చేసింది.

2019 డిసెంబర్ 12: తలారిని పంపించాలని ఉత్తరప్రదేశ్ జైలు అధికారులను తీహార్ జైలు అధికారులు కోరారు.

2019 డిసెంబర్ 13: ఉరిశిక్ష తేదీని నిర్ణయించాలని నిర్భయ తల్లి తరఫున పటియాలా హౌస్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దాంతో, నలుగురు దోషులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పటియాలా కోర్టులో హాజరుపరిచారు.

2020 జనవరి 7: డెత్ వారెంట్ జారీ చేసిన పటియాలా కోర్టు, జనవరి 22 ఉదయం 7 గంటలకు మరణశిక్ష అమలుచేయాలని ఆదేశం.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)