తెలంగాణ ఆర్టీసీ సమ్మె: ‘షరతులు లేకుండా ఆహ్వానిస్తే... సమ్మె విరమించి విధుల్లో చేరతాం’ - జేఏసీ..

ఆర్టీసీ

ఫొటో సోర్స్, TSRTC JAC

ప్రభుత్వం షరతులేవీ లేకుండా ఆహ్వానించి, సమ్మెకు ముందు ఉన్న పరిస్థితులను, విధులు నిర్వర్తించేందుకు అనుకూల వాతవరణాన్ని కల్పిస్తే.. సమ్మె విరమించి కార్మికులు విధుల్లో చేరతారని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.

బుధవారం సాయంత్రం జేఏసీ నేతలు తాజా పరిణామాలపై చర్చించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

రెండు రోజుల క్రితం వచ్చిన హైకోర్టు ఆదేశాలు ఆర్టీసీ జేఏసీకి అనుకూలంగా లేకపోవడంతో ఆర్టీసీ సమ్మెపై సందిగ్ధత మరింత పెరిగింది. ఈ క్రమంలోనే దీక్ష విరమించిన నాయకులు, సడక్ బంద్‌ను కూడా వాయిదా వేసుకున్నారు.

ఆర్టీసీ

ఫొటో సోర్స్, TSRTC JAC

మంగళవారం ప్రధాన కార్మిక సంఘాలు టీఎంయూ, ఈయూలు అంతర్గత సమావేశాలు నిర్వహించుకున్నాయి. బుధవారం జేఏసీ సమావేశం జరిగిన తరువాత ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

హైకోర్టు జేఏసీ నోటీసులోని సమ్మె అంశాలను లేబర్ కమిషనర్‌కి నివేదించడానికి నిర్ణయం తీసుకునేందుకు 2 వారాలు గడువు ఇచ్చిందని, ప్రభుత్వం వెంటనే సమస్యలను లేబర్ కోర్టుకు నివేదించాలని కోరుతున్నామని జేఏసీ నేతలు అన్నారు.

ప్రభుత్వం ఆర్టీసీని ఒక ఆదర్శ ఉద్యోగ సంస్థగా చూడాలని హైకోర్టు తెలిపింది.

ఆర్టీసీ

ఫొటో సోర్స్, FB/JANGAONDEPOT

కార్మికుల సమ్మె ఉద్దేశం సమస్యల పరిష్కారానికే తప్ప విధులను విడిచిపెట్టడం కాదని.. ప్రభుత్వం, యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామంటూ ప్రకటన విడుదల చేసింది జేఏసీ.

ఈ విషయంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రభుత్వానికి షరతుతో కూడిన విజ్ఞాపన చేసినట్టుగా అనిపించినా, వాస్తవానికి ఇక దాదాపు సమ్మె విరమించినట్టే భావించాలి. అయితే దీనిపై ఇంకా ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన రాలేదు.

ఇప్పటి వరకూ మొత్తం 48 రోజుల పాటు సమ్మె సాగింది. ఈ సమ్మె కాలంలో మొత్తం 29 మంది కార్మికులు లేదా వారి సమీప బంధువుల మరణించినట్టుగా కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అందులో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.

ఆర్టీసీ

‘‘షరతులు ఉండకూడదు. చర్యలు ఉండకూడదు. అక్టోబరు 4న ఏ పరిస్థితి ఉందో, అదే పరిస్థితి ఉండాలి. ప్రభుత్వం ఆ దిశగా స్పందిస్తే, మేమూ స్పందించి సమ్మె విరమిస్తాం. ప్రభుత్వం లేదా యాజమాన్యం నుంచి ఆహ్వానం వచ్చి సానుకూలంగా స్పందిస్తే మేం విధుల్లో చేరతాం. కోర్టు తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ఇద్దరికీ ఉంది. గౌరవిస్తారని భావిస్తున్నాం’’ అని జేఏసీ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి అన్నారు.

‘‘చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటాం. డిమాండ్ల గురించి లేబర్ కోర్టులో తేల్చుకుంటాం. కార్మికులెవరూ డ్యూటీ చార్టులు, అటెండన్స్ రిజష్టర్లు తప్ప వేరే పేపర్లపై సంతకం పెట్టరు’’ అని మీడియా ముందు చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

గీత

వారి వినతిని మన్నించండి: పవన్ కల్యాణ్

ఆర్టీసీ కార్మికులపై సానుభూతితో, వారిపై ఎలాంటి ఆంక్షలూ పెట్టకుండా ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

కార్మిక సంఘాల నేతల వినతిని సీఎం మన్నించాలని ఆయన ట్విటర్ వేదికగా కోరారు.

కార్మికులకు కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రి భరోసా ఇస్తారని ఆశిస్తున్నానని, వారి సమస్యలను సానుకూలంగా అర్థం చేసుకొని పరిష్కరించాలని కోరుతున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)