జియో: ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాల బాటలోనే మొబైల్ డేటా రేట్లు పెంచేస్తుందా...

జియో డిజిటల్

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచం మొత్తం మీద మొబైల్ డేటా అత్యంత చౌకగా పొందుతున్నది భారతీయులే. కానీ, ఇప్పుడు ఆ ధరలు కాస్త పెరుగుతున్నాయి.

వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ సంస్థలు రెండూ కలిసి ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దాదాపు రూ. 71 వేల కోట్ల నష్టాన్ని చవిచూశాయి.

మార్కెట్‌లో ఆదాయపరంగా ఈ రెండు కంపెనీల వాటా సగానికిపైనే ఉంది.

భారత్ ధరల పట్ల సున్నితంగా ఉండే మార్కెట్ కావడంతో టారిఫ్‌లు విపరీతంగా పెరిగే అవకాశాలు తక్కువేనని నిపుణులు అంటున్నారు.

''పశ్చిమ దేశాలతో లేదా కొరియా, జపాన్, చైనా లాంటి దేశాలతో పోల్చి చూస్తే భారత్‌లో మొబైల్ టారిఫ్‌లు చాలా తక్కువ. ఒక వేళ ధరలు పెరిగినా, ఆ దేశాల దరిదాపుల్లోకి మాత్రం రావు'' అని ప్రశాంతో కే రాయ్ బీబీసీతో చెప్పారు.

''వినియోగదారులు మరింత ఖర్చు చేసే పరిస్థితి తెచ్చి, ఒక్కో వినియోగదారుడిపై వచ్చే సగటు ఆదాయం పెంచుకోవడం ఆ ఆపరేటర్ల ఉద్దేశం. తాము పెద్ద మొత్తాల్లో చెల్లించాల్సిన లైసెన్సు ఫీజులను మాఫీ చేయమని కూడా ప్రభుత్వాన్ని అవి కోరతాయి'' అని ఆయన చెప్పారు.

తమ వ్యాపారాన్ని నిర్వహించుకునేందుకు ప్రభుత్వానికి టెలికాం సంస్థలు చెల్లించాల్సిన రుసుమే లైసెన్స్ ఫీజు.

Presentational grey line

భారతదేశంలో అత్యంత చౌకగా మొబైల్ డేటాను అందిస్తున్న సంస్థగా గుర్తింపు పొందిన రిలయన్స్ జియో.. తన పోటీ సంస్థలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాల బాటలోనే ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఈ ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారీగా నష్టాలు చవిచూడటంతో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించాయి.

‘‘తక్కువ ధరలతో వినియోగదారుల్ని ఆకట్టుకునే వ్యూహం బాగానే పనిచేసింది. ఇప్పుడు తమ వ్యాపారాన్ని చక్కదిద్దుకునేందుకు డబ్బు వసూలు చేయడం ప్రారంభించాయి’’ అని టెలికాం ప్రొవైడర్ల చర్యల గురించి టెక్నాలజీ నిపుణుడు ప్రశాంతో కె రాయ్ బీబీసీతో అన్నారు.

కాగా, ధరల్ని ఏ మేరకు పెంచుతున్నదీ జియో స్పష్టం చేయలేదు.

Presentational grey line
వొడాఫోన్, ఎయిర్‌టెల్, జియో

ఫొటో సోర్స్, Reuters

ఎందుకు పెరుగుతున్నాయి?

అత్యంత చౌకగా డేటాను అందిస్తూ మూడేళ్ల క్రితం రిలయన్స్ జియో మార్కెట్‌లోకి ప్రవేశించడంతో ఈ రంగంలో విపరీత పోటీ మొదలైంది. ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లపై దీని ప్రభావం తీవ్రంగా పడింది.

టెలికాం ఆపరేటర్లకు ఆదాయాన్ని ప్రభుత్వం పంచుకునే విధానం కూడా నష్టాలకు ఓ కారణం.

చౌక ధరల వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకునేందుకు సంస్థలకు ఉపయోగపడే నాన్-టెలికాం ఆదాయాలపైనా ప్రభుత్వం పన్నులు విధిస్తోంది. అంటే ఆస్తుల అమ్మకం, డిపాజిట్లపై వచ్చే వడ్డీ లాంటివి.

టెలికాం సంస్థలు ఈ విధానంపై అభ్యంతరం చెబుతున్నాయి. టెలికాం సేవలపై వచ్చే ఆదాయంలో మాత్రమే ప్రభుత్వం వాటాను తీసుకోవాలని వాదిస్తున్నాయి.

ఈ విషయానికి సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

వొడాఫోన్, ఎయిర్‌టెల్, జియో

ఫొటో సోర్స్, Getty Images

డిసెంబర్ 1 నుంచి పెంచుతున్న టారిఫ్‌లను అమలు చేస్తామని వొడాఫోన్ ఐడియా గురువారం ప్రకటించింది.

''భారత్‌లో మొబైల్ డేటాకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్నా, ధరలు ప్రపంచంలోకెల్లా అత్యంత చవగ్గా ఉన్నాయి. ప్రపంచ స్థాయి డిజిటల్ అనుభవాలను వినియోగదారులు ఇలాగే ఆస్వాదించే విధంగా టారిఫ్‌ల్లో తగిన మార్పులు చేస్తాం'' అని పేర్కొంది.

ఎయిర్‌టెల్ కూడా ఇలాంటి ప్రకటననే విడుదల చేసింది.

కొత్త టారిఫ్ రేట్లు ఎంత వరకూ ఉంటాయన్నది మాత్రం స్పష్టం చేయలేదు.

''జియో ఇలాంటి ప్రణాళికలేవీ ప్రకటించలేదు. కాబట్టి ధరలు మరీ అధికంగా మారకుండా ఈ రెండు సంస్థలు చూసుకోవాల్సి ఉంటుంది'' అని ప్రశాంతో కే రాయ్ అన్నారు.

''ధరలు పెరగడం చెడ్డ పరిణామమేమీ కాదు. నిజానికి ఇది మంచిదే. మార్కెట్లో కొంత పోటీ ఉండాలంటే అదే మార్గం. భారత్‌లో టెలికాం సంస్థలు మనుగడ సాగించాలంటే ఇది తప్పదు'' అని వివేక్ కౌల్ అనే ఆర్థికవేత్త బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)