నారా లోకేశ్, అఖిలప్రియ, గంటా, దేవినేనిలపై బెట్టింగులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసా: ప్రెస్ రివ్యూ

గంటా

ఫొటో సోర్స్, facebook/gantasrinivasarao

ఏపీలో పోలింగ్ ముగిసిన తరువాత అభ్యర్థులు, బెట్టింగ్ రాయుళ్లు పోస్ట్ పోల్ సర్వేలు చేస్తున్నారని 'ఆంధ్రజ్యోతి' పత్రిక కథనం రాసింది.

'ఈ ఎన్నికల్లో దాదాపు ప్రతి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ప్రీ-పోల్‌ సర్వే చేయించుకుని బరిలోకి దిగారు.. ఇప్పుడు పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ప్రధాన పార్టీల భవిష్యత్‌, అభ్యర్థుల విజయావకాశాలపై ఎవరూ ఒక అంచనాకు రాలేకపోగా.. ఏ పార్టీకి ఆ పార్టీ తమదే విజమమని ప్రకటించుకుంటున్నాయి.

దీంతో అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. విజయంపై ధీమా కోసం పోస్ట్‌ పోల్‌ సర్వేపై దృష్టి పెట్టారు. తమ తమ నియోజకవర్గాల ప్రజలకు ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారు. 'మీ ఓటు ఎవరికి వేశారు' అని తెలుసుకోగోరడంతో పాటు తమకు ప్రధాన పోటీ అనుకున్న అభ్యర్థుల పేర్లు కూడా ప్రస్తావిస్తూ సర్వే చేయించుకుంటున్నారు.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. పార్టీలు కూడా ఇదే పద్ధతి ఎంచుకున్నాయి.

ప్రజలకు ఫోన్‌చేసి.. అభ్యర్థుల పేర్లు ప్రస్తావించకుండా నేరుగా టీడీపీ, వైసీపీ, జనసేనల్లో దేనికి వేశారని అడుగుతున్నారు.

ఇంకోవైపు.. బెట్టింగ్‌రాయుళ్లూ బరిలోకి దిగారు. కోట్ల డబ్బు పందేల్లో తగలబడి పోకుండా చూసుకోవడానికి వారి పోస్ట్‌పోల్‌ సర్వేకు ఉపక్రమించారు. దీనిద్వారా బెట్టింగ్‌ ధరను నిర్ణయిస్తున్నారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

బీరు

ఫొటో సోర్స్, Getty Images

ఐపీఎల్, ఎలక్షన్ల దెబ్బకు బీరు జోరు

తెలంగాణ రాష్ట్రంలో బీర్ల విక్రయాలు అనూహ్యంగా పెరిగాయని 'సాక్షి' పత్రిక తన కథనంలో తెలిపింది.

''అమ్మకాలు ఏకంగా రెండింతలు పెరిగాయని.. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబర్, జనవరి నెలల విక్రయాల కన్నా.. మార్చిలో రెండు రెట్లు అధికంగా బీర్ల విక్రయాలు జరిగాయి.

వేసవి మొదలైనప్పటి నుంచి బీరు బాటిళ్ల విక్రయాలు పెరగడం అత్యంత సహజం. కానీ, ఈసారి మార్చిలో రెండింతలు పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయి.

వీటిలో మొదటిది ఐపీఎల్‌ మ్యాచ్‌లు కాగా, రెండోది పార్లమెంటు ఎన్నికలు. మార్చి రెండో వారంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు మొదలుకావడంతో బీర్ల కొనుగోళ్లు ఊపందుకుంది. దీనికితోడు అదే సమయంలో పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. దీంతో అటు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, పబ్‌లు ఓ వైపు, రాజకీయ పార్టీలు మరోవైపు భారీగా బీర్లను కొనుగోలు చేశాయి.

ఈ కొనుగోళ్లలో రాజకీయ పార్టీల వాటానే అధికంగా ఉందని సమాచారం. తమ కార్యకర్తలకు, యువతకు పంచేందుకు కేసుల కొద్దీ బీర్లను పంచారు. వేసవి కావడంతో మద్యం బాటిళ్లకు బదులుగా బీర్లను ఎంచుకోవడమే దీనికి కారణం. ఫలితంగా బీర్ల కేసులు రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు.

సాధారణంగా ఎక్సైజ్‌ శాఖ విక్రయాల ప్రకారం.. ఐఎమ్‌ఎల్‌ (ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌) అంటే బ్రాండీ వైన్‌ తదితరాలతో కలపకుండా బీర్లను ప్రత్యేకంగా గణిస్తారు. సాధారణంగా తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ మద్యం విక్రయాలు నెలకు సగటున రూ.1,500 నుంచి రూ.1,700 కోట్లుగా ఉంటుంది. వివిధ కాలాల్ని బట్టి వీటిలో మద్యం, బీర్ల విక్రయాలు మారుతుంటాయి. గత 4 నెలల మద్యం విక్రయాలను పరిశీలిస్తే.. బీర్ల కేసులు పెరిగినట్లు తేలింది'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

గవర్నరు, కేసీఆర్ భేటీ

ఫొటో సోర్స్, facebook/kcr

గవర్నర్‌తో కేసీఆర్ భేటీ

తెలంగాణ ప్రజల కోణంలో పాలనా సంస్కరణలను చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌కు తెలిపారని 'ఈనాడు' తన కథనంలో వెల్లడించింది.

''ప్రతి శాఖలోనూ ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేస్తాం. ఎవరైనా లంచాలు అడిగినా, సేవలు సరిగా అందించకున్నా సత్వర చర్యలు ఉంటాయి. దళారులు, లంచాల బెడద లేకుండా ప్రజలు నేరుగా సేవలు పొందేలా చేస్తాం.

పౌరసేవలు అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. అనుమతులు, ఇతర అంశాలకు సంబంధించి ఏ మాత్రం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. పాలనాపరమైన ఆటంకాలు లేకుండా అధికారిక వ్యవస్థలోనూ మార్పులు చేయబోతున్నాం.

ప్రతి జిల్లాలో ఆరుగురు అధికారుల బృందానికే అన్ని బాధ్యతలు అప్పగించి, వారి ద్వారా సేవలందిస్తాం' అని వివరించారు. ముఖ్యమంత్రి ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు వీరి మధ్య సమావేశం జరిగింది. రాష్ట్రంలో చేపట్టనున్న పాలనా సంస్కరణల గురించి కేసీఆర్‌ ఆయనతో చర్చించారు.

''అధికారంలోకి వచ్చిన వెంటనే పాలనా సంస్కరణలు చేపట్టాలని భావించాం. అధికారుల కొరత, ఇతర సమస్యలకు తోడు కొత్త జిల్లాలను ప్రారంభించడం వంటి కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఇప్పుడు సమయం ఆసన్నమయింది.

ఇప్పటికే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, కొత్త పాస్‌ పుస్తకాల పంపిణీ, సత్వర రిజిస్ట్రేషన్‌ వంటివి చేపట్టాం. ఇవి సంపూర్ణం కాలేదు. ఇంకా క్షేత్ర స్థాయి సమస్యలున్నాయి. ప్రధానంగా లంచాలు అడుగుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఒక్క రెవెన్యూయే గాక రాష్ట్రంలోని ఏ ఒక్క శాఖలోనూ అవినీతి ఉండరాదు. దీనికి అనుగుణంగా కొత్త చట్టాలు రూపొందించాలని నిర్ణయించాం. పట్టణాలకు, నగరాలకు సంబంధించి పురపాలక శాఖ ముఖ్యమైంది. దీనిలోనూ ఎన్నో సమస్యలున్నాయి. ప్రజలకు సేవలు, అనుమతులు, అభివృద్ధికి సంబంధించిన వాటికి జవాబుదారీ తనం ఉండాలి. ఇందుకోసం కొత్త పురపాలక చట్టాన్ని తేవాలనుకుంటున్నాం. దీనిపైనా కసరత్తు జరుగుతోంది. రెవెన్యూ, పురపాలక చట్టాలు దేశంలోనే ఆదర్శమైనవిగా పేరు పొందేలా వాటిని రూపొందిస్తున్నాం.

పురపాలక బిల్లు రూపొందించిన తర్వాత ఆమోదం కోసం సత్వరమే శాసనసభ సమావేశాలను నిర్వహించాలనే యోచన ఉంది. దీని కోసం ఎన్నికల సంఘం అనుమతి కోరతాం. ఎన్నికల నియామావళి అమల్లో ఉన్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకాలు లేకుండా చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నాం'' అని సీఎం గవర్నర్‌కు వివరించారు. సీఎం ఆలోచనల వెల్లడి సందర్భంగా గవర్నర్‌ పలు సూచనలు చేసినట్లు తెలిసింది'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

బొత్స

ఫొటో సోర్స్, Getty Images

కోడెల శివప్రసాద్ బూత్ క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నించారు: బొత్స సత్యనారాయణ

ఏపీలో పోలింగ్ రోజున టీడీపీ తమ కార్యకర్తలపై దాడులు చేసిందంటూ వైసీపీ నేతలు గుంటూరు ఎస్పీకి ఆదివారం ఫిర్యాదు చేశారని 'నమస్తే తెలంగాణ' పత్రిక వార్త ప్రచురిందచింది.

''ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ శ్రేణులపై టీడీపీ నేతలు దాడులకు దిగారు. టీడీపీ నేతలను వదిలేసి మా పార్టీ నేతలపై కేసులు పెట్టారు.

స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ పోలింగ్‌ బూత్‌ను క్యాప్చర్‌ చేసేందుకు ప్రయత్నించారు. కోడెల చేసిన తప్పును వదిలేసి మా పార్టీ నేతలపై కేసులు పెట్టారు. కోడెలకు ఒక న్యాయం.. అంబటికి ఒక న్యాయమా..? ఇప్పటికైనా కోడెల తన ప్రవర్తన మార్చుకోవాలి.

జిల్లాలో శాంతి భద్రతల బాధ్యత పోలీసులదే. మా పార్టీ నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. మేరుగ నాగార్జునపై హత్యాయత్నం జరిగింది. కారు అద్దాలు పగలగొట్టారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశామని బొత్స చెప్పార''ని ఆ వార్తలో వివరాలు అందించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)