‘ఈవీఎంలు మానేసి మళ్లీ బ్యాలట్ పేపర్ వాడుతున్నారు ఆ దేశాల్లో... కనీసం ఇక్కడ వీవీప్యాట్ స్లిప్పుల్లో 50 శాతం లెక్కించండి’

చంద్రబాబు

ఫొటో సోర్స్, tdp.ncbn.official/facebook

ప్రపంచంలోని 18 దేశాలు మాత్రమే ఇప్పటివరకు ఈవీఎంలను ఉపయోగించాయని.. వాటిలో అత్యధికం వెనుకబడిన, వర్ధమాన దేశాలేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.

జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలూ ఈవీఎంలను ఉపయోగించినప్పటికీ తరువాత మళ్లీ బ్యాలట్ విధానాన్నే ఆశ్రయించాయని ఆయన అన్నారు.

ఈవీఎంలలో ఎన్నో లోపాలు ఉండడం.. పారదర్శకత లోపించడం, ఫలితాలు తారుమారు చేసే ప్రమాదం ఉండడం వల్ల జర్మనీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్ వంటి దేశాలు ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం మానుకుని ఎప్పటిలా బ్యాలట్ విధానానికి మారాయని చెప్పారు.

అభిషేక్ సింఘ్వి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అభిషేక్ సింఘ్వి

వీవీప్యాట్ స్లిప్పుల్లో 50 శాతం లెక్కించాలి.. సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేస్తాం

దిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో చంద్రబాబు నేతృత్వంలో ప్రతిపక్ష నేతలు సమావేశమయ్యారు. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి, ఇతర పార్టీల నేతలు హాజరై వీవీప్యాట్ స్లిప్పుల్లో 50 శాతం లెక్కించాలన్న చంద్రబాబు డిమాండ్‌కు మద్దతు పలికారు. దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు.

ఈ సందర్భంగా ప్రతిపక్షాల నేతలంతా విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయని, కానీ, తన పోరాటం దేశం కోసమని.. దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ కోసమని చెప్పారు.

ఈవీఎంలు హ్యాక్‌ చేయడం, రిమోట్ సహాయం ఆపరేట్ చేయడం వంటి ప్రమాదాలున్నాయనే జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఆ విధానం నుంచి పాత విధానానికి మారాయన్నారు.

తెలంగాణలో సాంకేతికత దుర్వినియోగపరుస్తూ ను దుర్వినియోగం చేస్తూ 25 లక్షల ఓట్లను తొలగించారని.. ఎన్నికల తరువాత అధికారులు క్షమాపణ చెప్పారని చంద్రబాబు గుర్తుచేశారు.

తెల్లవారుజామున 4 వరకు పోలింగా?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగిన తీరును వివరించిన ఆయన ఏప్రిల్ 11న పోలింగ్ మొదలైతే 12వ తేదీ వేకువన 4 గంటల వరకు ఓటేసే అవకాశం కల్పించారని ఆయన ఆరోపించారు.

పోలింగ్ ప్రారంభంలో చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించడం వల్ల ఆయా కేంద్రాల్లో 2 నుంచి 6 గంటలు ఆలస్యంగా పోలింగ్ మొదలైందని.. సాంకేతికత సరిగా తెలియని ఒప్పంద సిబ్బందిని ఈవీఎంల నిర్వహణకు వినియోగించారని.. వీవీప్యాట్ స్లిప్‌లు 7 సెకన్లకు బదులు 3 సెకన్లే ఉన్నాయని.. ఇలాంటి లోపాలన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటికే దేశంలో ఎన్నికలు ఈవీఎంలకు మారిపోవడం వల్ల మళ్లీ బ్యాలట్‌కు వెళ్లడం కష్టమని, కనీసం వీవీ ప్యాట్‌ స్లిప్పులలో 50 శాతం లెక్కించాలని కోరారు.

దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లగా అలా లెక్కించడానికి 6 రోజుల సమయం పడుతుందని ఈసీ అఫిడవిట్ దాఖలు చేసిందని.. మళ్లీ రివ్యూ పిటిషన్ వేస్తామని చంద్రబాబు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)